Saturday, October 9, 2021

Eknath Chapter 13 Sloka 5

13.5 -13.6

మహాభూతా న్యహంకారో బుద్ధిరవ్యక్త మేవ చ

ఇంద్రియాణి దశైకంచ పంచ చేంద్రియగో చరాః

ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సంఘాత శ్చేతనా ధృతిః

ఏతత్క్షేత్రం సమాసేన సవికార ముదాహృతం

పంచభూతములు, అహంకారము, బుద్ధి, పదనొకoడు ఇంద్రియములు, ఐదు శబ్దాది విషయములు, ఇచ్ఛ , ద్వేషము , సుఖము, దుఃఖము, దేహేంద్రియాదుల సమూహము, చేతనత్వము, ధైర్యము అను వీటితో గూడి వికారయుతమైనట్టిదియే క్షేత్రము

రెండు దశాబ్దాల క్రిందట నేను కారు డ్రైవింగ్ బెర్క్లీ నగరములో నేర్చుకున్నాను. ఆమెరికన్లతో పోలిస్తే చాలా ఆలశ్యం. అలాగైతే నేను ఏనుగు సవారి బాల్యంలో నేర్చుకొన్నాను. అమెరికన్లకు అది రాదు. నేను డ్రైవింగ్ పాఠాల్ని పూర్తి చేసాను. కానీ తక్కిన ప్రాణుల భద్రత కోసం నేను ఎక్కువగా డ్రైవింగ్ చేయను. నాకు డ్రైవింగ్ నేర్పిన గురువు చాలా ప్రావీణ్యo గలవాడు. అతను బెర్క్లీ లో ఉండే ఉపాధ్యాయులకు కూడా డ్రైవింగ్ నేర్పించి ఉండవచ్చు. ఎందుకంటే డ్రైవింగ్ గురించ విపులంగా చెప్తాడు.

చాలకాలంపాటు నాకు కారు గేర్లు మార్చడం రాలేదు. అతను నాకు గేర్ల గురించి వివరించేడు. "ఈ స్టిక్ లోపలున్న స్పైడర్ గేర్ తో కలపబడినది" అని అతను కాగితంమీద బొమ్మలు గీసి చూపించేడు. "ఈ స్టిక్ ఇక్కడ ఉంది. గేర్ లతో తగలకుండా ఉన్నప్పుడు దానిని న్యూట్రల్ అంటారు. ఇక్కడ నాల్గు గేర్ లు ఉన్నాయి.."

నేను అడిగేను: "క్షమించండి, డ్రైవింగ్ నేర్చుకోడానికి ఇది అవసరమా".

"అవసరం కాదు. నువ్వు చేతులతో డ్రైవింగ్ చేస్తావు కాబట్టి లోపల ఏమవుతున్నదో తెలిసికోనక్కరలేదు. కొంతమంది లోపల ఏమవుతున్నదో తెలిసికొని తొందరగా నేర్చుకొంటారు. "

"దయచేసి పాఠం చెప్పండి. మీరు చెప్పింది అనుభవానికి తెచ్చుకోడానికి ప్రయత్నిస్తాను" అన్నాను.

పై శ్లోకాలవంటివానిలో శ్రీకృష్ణుడు పారిభాషికంగా అనుభవానికి కావలసిన దాని కన్నా ఎక్కువ చెప్తాడు. మనము ఓపిక పట్టాలి. ఆ 22 విశ్వ సిద్ధాంతాలు విశ్వం గురించి మనోహరంగా వివరిస్తాయి. అందువల్ల మనకి సులభంగా అనుభవానికి వస్తాయి. హిందూ శాస్త్రాల్లో దీనిని సాంఖ్య అంటారు. దాని అర్థం లెక్కపెట్టుట లేదా జాబితా చేయుట. యోగ, ధ్యానము దానితో ముడి పడినవి. తరతరాలుగా సాంఖ్య, యోగ కలిపి భోదించేవారు. అవి పరస్పరంగా సహకరించు కొంటాయి. జ్ఞానం ధ్యానానికి దోహదం చేస్తుంది. ధ్యానము దానిని అనుభవoలోకి తెచ్చి సిద్ధాంతాలను అర్థంచేసుకోవడానికి సహాయపడుతుంది. కొన్ని సంవత్సరాలు సాధనచేస్తే ఆ పురాతనమైన సిద్ధాంతాలు యోగ, ధ్యానములతో మంచి అవగాహన కలిపించి మనస్సుని స్వాధీనం చేసుకోవడానికి తోడ్పడతాయి.

ఈ 22 సిద్ధాంతాలను ఆంగ్లంలో అనువాదం ఎలా చేయాలో నాకు తెలీదు. ఎందుకంటే వాటికి పశ్చిమ దేశాలలో వాడే పద ప్రయోగాలతో పొంతన లేదు. వారు వాడే తర్కము వేరు. సాంఖ్యలో ఒక శక్తివంతమైన భావన ఉంది: అది భౌతిక సత్యాలను గూర్చి చెప్పటం లేదు. అది మనస్సును విశ్లేషిస్తుoది "మన మెవరము" అనే ప్రశ్నకు సమాధానం సమకూరుస్తుంది. సాంఖ్య భౌతిక ప్రపంచం మనస్సు కన్నా వేరు కాదని నమ్ముతుంది. అది మన బాహ్య, అంతర్గత ఇంద్రియాల గూర్చి మాట్లాడదు. అది చెప్పేదంతా "ఇది ఏకైక ప్రపంచ అనుభవము." వస్తువు, ఇంద్రియము వేర్వేరు కావు. అవి ఒకే ఘటనకు చెందినవి. మనస్సు, శక్తి , పదార్థము అవిచ్ఛిన్నమైనవి. భౌతిక ప్రపంచమనగా మన మనస్సుకు తోచినది కానీ తనంతటతాను ఉద్భవిందినది కాదు .

ఒక ఉదాహరణ ఇస్తాను. ఇవాళ ప్రొద్దున్నే ఒక మంచి మామిడిపండుని తిన్నాను. అది పెద్దది, అందమైనది, సువాసన గలది. అది సమయానికి పరిపక్వం అయినది. దాని తొక్క ఎరుపు , పసుపు రంగులతో కూడియున్నది. మీకు ఇప్పటికి మామిడి పండ్లు నాకెంతో ఇష్టమని తెలిసి ఉండచ్చు. నేను బాల్యంలో వందలకొద్ది మామిడి పండ్లను తిన్నాను. నాకు వాటి జాతి రంగు, ఆకారము, వాసన వల్ల చెప్పగలను.

సాంఖ్య నేను తిన్న మామిడి పండు బాహ్య ప్రపంచంలో నేను చెప్పిన విశేషణాలతో లేదoటుంది. ఆ పండులో ఎరుపు పసుపు అనే అంతర్భాగాలు లేవు. దాని విశేషణాలు మన కన్ను అనే జ్ఞానేంద్రియం యొక్క పరిమిత శక్తి వల్ల ,మన నరాల వ్యవస్థ వల్ల తెలియబడుచున్నవి. నా పెంపుడు కుక్క మూకా ఎరుపు, పసుపు రంగులను చూడలేదు. అది విశేషమైనది కాని నెరసిన ముద్ద అనుకొంటుంది. దానిని ఒక వెన్నతో పూసిన బ్రెడ్ ముక్క కన్నా విలువ తక్కువని భావిస్తుంది. మన చేతన మనస్సు పంచేంద్రియాల ద్వారా వచ్చిన సందేశాలను కూర్చి మామిడిపండు రూపాన్ని కల్పిస్తుంది. ఆ బాహ్యంగాలేని రూపం నా అనుభవంలోకి వస్తుంది. అలాగని నిజమైన మామిడిపండు లేదని కాదు. కానీ అది ఇంద్రియాల ద్వారా నాలో కల్పించబడినది. నా జ్ఞానంలో, చేతన మనస్సులో మాత్రమే ఉంది. ఒక మెదడు, నరాల వ్యవస్తాను అధ్యయనం చేసే శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పేడు : "మనం ప్రపంచాన్ని నిజంగా ఎదుర్కోము. ఇంద్రియముల శక్తి వలన మనము అనుభవించేదంతా మన నరాల వ్యవస్తను మాత్రమే"

గీత సృష్టి పంచ భూతాలతో చేయబడినదని చెప్పడం అవి మన పంచేంద్రియాలా ద్వారా అనుభవ యోగ్యం కాబట్టి. ఉదాహరణకు కుర్చీలు, టేబిళ్ళు అనేవి నిజము కాదు. అవి మన మనస్సులో నిక్షిప్తమై ఉన్న నామరూపాత్మకములు. ఈ విధంగా భౌతికమైన వస్తువులు మనస్సులో చిత్రీకరింపబడాలి. మన పంచేంద్రియాలు గ్రహించేవి తన్మాత్రలు : శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలు. ఈ తన్మాత్రలకి పంచభూతాలు గ్రాహ్యము. కాబట్టి సాంఖ్య 5 సంఖ్యను విశేషంగా చూడడం ఏదో నిభందన లేక కాదు. అది మన మెదడు లోని విద్యుత్ రసాయన రూపాలుగా ఒక క్రమములో ఉన్నవి.

పంచభూతలలో నాల్గుటికి ఆంగ్లంలో అనువాదము ఉన్నది. అవి earth, fire, air water . గ్రీక్ దేశస్తులు మననుంచే పూర్వ కాలంలో వీనిని సంగ్రహించి ఉండవచ్చు. మనం పంచభూతాలిని మన గ్రహణ శక్తితో అనుసంధానము చేసేము కానీ వాటిని విశ్లేషణము చేయలేదు. అది భౌతిక శాస్త్రము చేసే పని . మన సిద్ధాంతాలు అధునాతనము కాకపోవచ్చు. కానీ అవి విశేషమైనవి. శాస్త్రజ్ఞులు చెప్పే నూతన సిద్ధాంతాలు వానితో ఏకీభవిస్తాయి. ఒక విషయం తెలియాలంటే జ్ఞాతను జ్ఞేయం నుండి విడదీయలేము. తేజస్సు అంటే అగ్ని మాత్రమే కాదు. దాని అర్థము గొప్ప వెలుగు లేదా ప్రకాశం అని కూడా కావచ్చు. మన మనస్సులోని ఉద్ధేశ్యం ప్రకారం తేజస్సు యొక్క అర్థాన్ని అగ్ని లేదా మరోటి కి ఆపాదిస్తాం.

ఐదవ భూతం ఆకాశం. దాన్ని ఆంగ్లంలో ఈథర్ అనవచ్చు. ఆ పదము శాస్త్రజ్ఞులు గగనానికి ఆవల వున్న ప్రదేశాన్ని సూచిస్తుందని అని చెప్తారు. అది ఒకరకంగా భ్రమ కలిపించేది. ఐన్ స్టైన్ అనే శాస్త్రజ్ఞుడు అది తప్పని వివరించగా ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఈథర్ పదాన్ని వాడటంలేదు. కాబట్టి నేను ఆకాశం పదాన్నే వాడుతాను. భౌతిక శాస్త్రవేత్తలు పదార్థం, శక్తి దేశ కాలాల కే పరిమితమని చెప్తారు. అది సహజంగా ఎటువంటి పదార్థం గాని శక్తిగాని లేని మూసలో ఉన్నట్టు చెప్తారు. ఆ మూస రూపం దానిలో ఉన్నా పదార్థాల బట్టి ఉంటుంది. ఆకాశం ఆ మూస వంటిది. అది సృష్టి యొక్క భౌతిక ప్రపంచం.

ఇంద్రియాలు వాటి గ్రాహ్యములు మధ్య చాలా తాదాత్మ్యం ఉంది. మనం చూసే వస్తువులు , కన్ను ఇంద్రియము మధ్య ప్రేరణ క్రియ (causal connection) ఉంది. ఎట్లనగా మన కన్ను నరాల వ్యవస్త గుండా కాంతి కిరణాలను మెదడు లేదా మనస్సులో ప్రతిబింబింప చేస్తుంది. ఈవిధంగా అన్నీ మన మనస్సుకి సంభందించినవి. మనం చూసే వస్తు బింబాల యొక్క ఆకారం మనo చూసే విధానంలో ఉంటుంది. ఇలాగ ఇంద్రియాలు అవి పనిచేసే వస్తువులు కలిపి చెప్పుకోవాలి. యోగశాస్త్రం మానసిక పరంగా ఎందుకు ఇంద్రియాలు, అవి పనిచేసే వస్తువులు మధ్య తాదాత్మ్యం ఉన్నదో వివరంగా చెపుతుంది. ఇంద్రియాలకు లోబడితే ఆ సంబంధం ఇంకా గట్టి పడుతుంది.

గీత ఆ అవినాభావ సంభందం మనం కాదు, అది ఆత్మది, జ్ఞానిది అని చెబుతుంది. . ఆయస్కాంతము ఆకర్షణ లాగ క్షేత్రంలోని పదార్థాల మధ్య అవినాభావ సంభందం ఉంది. అది మనతో సంబంధం లేనిది. మనకు నేనే క్షేత్రమనే భావన లేకపోతే వాటి మధ్య ఉన్న ఆకర్షణను చూడవచ్చు. కానీ దానితో తాదాత్మ్యం చెందకూడదు. నేను ప్రిన్స్ అలఫాన్సో జాతి మామిడి పండ్లను చూస్తే ఇంద్రియాలు సహజంగా స్పందిస్తాయి. కానీ నేను వాటికి దూరంలో ఉండి వాటి మధ్యగల ఆకర్షణని అసంగత్వoగా చూడాలి. ఎలాగంటే ఎవరు బరువులెత్తి మోస్తున్నారో వారలను చూచినట్లు. ఇలా అయితే నా ఇంద్రియాలు పంపే సందేశాలను గ్రహిస్తూ ఆనందంగా ఉండచ్చు. నా చేయికి నేనిలా చెప్పగలను: "ఇక చాలు. మనం తగినంతగా తిన్నాము. మిగిలినది రేపటికి."

సాంఖ్య చెప్పే 24 విధాలు బహు పెద్ద గాధ. ఒక వ్యష్టి చైతన్యo పరిణామం చెంది మన ఇంద్రియాలకు లెక్కపెట్టలేని అనుభవాలు అందిస్తుంది. ఇది ప్రపంచం బిగ్ బాంగ్ నుండి ఎలా పరిణామం అయిందో అలాగునే. ప్రపంచం అతి వేడి అయిన, అతి సూక్ష్మమైన, అనంతమైన శక్తిగల ఆది కణం నుంచి ఆవిర్భవించినదని అనేక శాస్త్రజ్ఞులు చెపుతారు. కాలారంభంలో, సృష్టికి ముందు, మనం సృష్టి అంతా ఒక అణు రూపంలో ఉన్నట్టు ఊహించుకోవాలి. కాలారంభం అంటే అంతకు పూర్వం దేశ కాలాలు ఇంకా పుట్టలేదు. ఇది ఒక మాటల చాతుర్యం. నాకు అటువంటి శాస్త్రాలు చదువుతే నవ్వు వస్తుంది. అది శాస్త్రాలకు మాటలతో అందని విషయం. యోగులు ఈ విధంగా మాట్లాడితే శాస్త్రజ్ఞులు జుట్టు పీక్కొని, వారు చెప్పేది కవిత్వం అని హేళన చేస్తారు.

బిగ్ బాంగ్ సిద్ధాంతం ప్రకారం సమత్వంతో కూడిన, అవికల్పమైన శక్తిని ఎవరో కదిలించేరు. దానిచే సృష్టి ఆరంభంలో గొప్ప కాంతి వెదజల్లబడినది. నాలుగు నిమిషాల వ్యవధిలో అది వ్యాప్తి చెంది, కొంచెం చల్లబడిన తరువాత న్యూట్రాన్ అనబడే పరమాణువులు పుట్టేయి. వాటినుండి మనం చూసే సూక్ష్మ కణాలు పుట్టడానికి కోట్ల సంవత్సరాలు పట్టింది. జాన్ గ్రిబ్బిన్ ఈవిధంగా వర్ణిoచేరు: "సృష్టి ఆరంభంలో ప్రపంచమంతా మన సూర్యని ఉపరితలంలాగ ఉండేది. అది మిక్కిలి వేడి, కిరణబేధ్యమైన, పచ్చని రంగులతో నింప బడినది. ఎప్పుడైతే పదార్థం, శక్తి విడిపోయేయో అది పారదర్శక మయింది." ఈ విధంగా పదార్థము శక్తికన్న పైచేయి పొందింది. అప్పడినుంచి విశ్వం పరిణామం చెందుతూ సర్వ వ్యాప్తమై వివిధ రూపాలుగా భిన్నత్వం చెందింది.

సాంఖ్య సిద్ధాంతం దీనికనుగుణంగా ఉంటుంది. కానీ అది శక్తితో కాక చైతన్యంతో మొదలవుతుంది. మనం భౌతిక ప్రపంచంలో చూసే వివిధ నామ-రూపాలు ఒకే ఒక చైతన్యం నుండి ఎలా వచ్చేయో దాని ముఖ్యాంశం. మనం పరిణామాలను అవరోహణ క్రమంలో అర్థంచేసికొoటే సృష్టికి మూలం దేవుడొక్కడే.

నాకున్న 6 ఏళ్ల మిత్రులు జానీ ఆపిల్ సీడ్ ని నాయకుడిగా ఆరాధిస్తారు. వాళ్ళు ఆపిల్ తిన్నప్పుడు విత్తనాలను దాచుతారు. వాళ్ళు ఒకానొక రోజు ఇంట్లోంచి పారిపోయి వాటిని భూమిలో పాతుతామని బెదిరిస్తూ ఉంటారు. ఒక విత్తనాన్ని వాళ్ళ చూసినట్టు చూసాను. అంత చిన్నదాన్నుoచి ఒక పెద్ద చెట్టు వస్తుందని ఎవరు ఊహించగలరు? అది ఎక్కడ నుంచి వస్తుంది? పాతి, నీళ్ళు పోసి, చూస్తే గాలి, నీరు, మట్టి, సూర్య రశ్మి ఆధారంతో అది ఆహారాన్ని తయారుచేస్తుంది. ఆ పనిని కాండము, ఆకులు, వ్రేళ్ళు పంచుకొని తమతమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తాయి. చివరకు ఒక పెద్ద చెట్టు అవుతుంది. ఎలాగ? విస్తృతమైన, అర్థం చేసుకోవడానికి క్లిష్టమైన, చైతన్యముతో కూడిన చెట్టు అంత చిన్న విత్తనం లోంచి ఎలా తయారయింది? దానికి తనను తాను పునః నిర్మాణం చేసుకోవడం ఎలా తెలుసు? దాని వ్రేళ్ళు ఊర్ధ్వ ముఖంగా ఎందుకు వుండవు? శాస్త్రవేత్తలు ఈ ప్రశ్న లన్నీటికీ సమాధానాలు చెప్తారని నాకు తెలుసు. అయినప్పటికీ అవి మంచి ప్రశ్నలు. అదొక వింతగా మనం ఊహించుకోవడం మన జ్ఞానం పరిమితము కాబట్టి.

ఆపిల్ విత్తనం చిన్నది, చైతన్యములేనట్టు ఉండి, అపరిమితమైన అవ్యక్త శక్తిని పొంది యున్నది. దానిలో ఉన్న వివరణాత్మక పథకం ఎలా వ్రేళ్ళు మొలుస్తాయో, ఆకులు కాస్తాయో, పెద్ద చెట్టు అవుతుందో సూక్ష్మ రూపంలో ఉండాలి. అలాగే విశ్వమనే విత్తులో పరిమాణం లేకపోయినా, సూక్ష్మ వివరణ పథకంతో, సిద్ధాంతాలకు లోబడి శక్తితో నక్షత్రాల, చేపల, మానవుల సృష్టికి కారణ భూతమై యున్నది. సాంఖ్య మన విశ్వం చెట్టులాoటిది అని చెప్తుంది. "చెట్టనే జీవితం, భూమిలో కాండము -- ఇంద్రియముల అనుభవం కొరకు --, ఊర్థ్వముఖంగా వ్రేళ్ళు గల అవిచ్ఛిన్న చైతన్యమై ఉన్నది. దానినే మహత్ అందురు. మనం ఊహించిన విశ్వ-విత్తు లాగా మహత్ అతి పెద్దది. ఎలాగంటే దానిలోని సూక్ష్మ శక్తి వల్ల మొత్తం విశ్వం పుట్టింది. అయినప్పటికి అది దేశకాలాతీతం. ఎందుకంటే అది పుట్టక పూర్వం దేశకాలాలు, పదార్థం-శక్తి ఇంకా అవ్యక్త రూపంలో ఉండేవి.

ఎప్పుడైతే సమత్వంలోవున్న స్థితిని కదిపేరో అది విచ్ఛిన్నమైంది. మహత్ నుండి విశ్వం ఒక క్రమ పద్దతిలో పరిణామం చెంది ఒక మహత్తర శక్తితో, అనేక నామ రూపాలుగా ఆవిర్భవించింది. ఇది ఉపమాన పరంగా ఒక పెద్ద చెట్టు చిన్న విత్తుతో మొదలైనట్టు. మొదట అహంకారం పుట్టింది. అది నేను అనే భావనతో ఇతరులు వేరని చెప్పడం. తరువాత బుద్ధి వచ్చింది. దాని విశేషణాలు విశ్లేషణము, విచక్షణ, బేధపరచు శక్తి. వాని నుంచి మనస్సు, ఇంద్రియాలు, వాటికి గోచరమైన ప్రకృతి వచ్చేయి..

ఈ వివరాలన్నీ బహు జటిలమైనవి. వానివలన వొరిగేమీ లేదు. ధ్యానంలో పరిణామ వివరాలన్నీ విదితమౌతాయి. పరిణామంలో అనేక దశలున్నాయి. ఒక్కొక్క దశ ఒక చేతనమైన శక్తిని స్ఫురింప చేస్తుంది , అది సమిష్టి నుంచి వ్యష్టికి, సూక్ష్మo నుంచి బ్రహ్మాండంకు వ్యాప్తమైనది. ఒక వ్యక్తిలో ఆ దశలను వ్యక్తిత్వంగా భావన చేస్తాం. ఒక దశలో మనం సాధారణ జంతువులం. అక్కడ మనము భిన్నత్వాన్ని చూస్తాం. అది మన బాహ్య నామ-రూపాలు మాత్రమే. భౌతిక ప్రపంచం క్రింద అనేక పొరలు ఉన్నాయి. లోతుకు వెళుతున్న కొద్దీ ఆ పొరలు చైతన్యంతో కూడి ఉంటాయి. అతి పెద్ద లోతులో అఖండ చైతన్యం. ఏదీ కనపడదు. ఇంద్రియ సుఖం అనుభవించడమంటే పై పొరలోనే ఉండి, తక్కినదంతా చీకటిలో ఉందని అనుకోవడం. ధ్యానంలో అంతః ముఖులమై అవరోహణ క్రమంలో మన భిన్నత్వం, భౌతిక స్వరూపం ఏ దశలలో వచ్చేయో తెలుసుకోగలం. మనం మనస్సు లోలోతులకు పయనించి మన ఆవిచ్ఛిన్నమైన, పవిత్రమైన చైతన్యాన్ని చవి చూస్తాం.

ఒక శాస్త్రవేత్త ఇలా అన్నారు "కొన్ని దశల తరువాత ప్రాణులకు చెందిన శాస్త్రము ముందుకు పోవాలంటే అణువులను విశ్లేషించాలి". ఇది జీవితం అనే భవంతిలో మొదటి అంతస్తు కాదు. ఒక అంతస్తులో సూక్ష్మం కన్నా అతిసూక్ష్మం ఉన్నదని ఉపనిషత్తులు చెప్పేయి. అదే చైతన్యం. పరిపూర్ణమైన చైతన్యంలో నామ-రూపాలు లేవు. ఆ స్థితిలో మన మనస్సు, ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయో తెలుస్తుంది. ఆ మాటకొస్తే భౌతిక స్వరూపాలు ఎలా పరిణామం చెందేయో తెలుస్తుంది.

పరిణామం యొక్క అంతం పరమాత్మను చేరటమే. మైస్టర్ ఎక్ హార్ట్ ఇలా అన్నారు: "నీకు ఇష్టమున్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా, రహస్యంగా ప్రకృతి యందలి దేవుని అడుగుజాడలనుండి దేవుని వెదకడం మొదలెడుతావు". ప్రతి అనుభవం, క్రియ, సమర్థత మనని అంతః ముఖులను చేసి ఆ పరమాత్మను వెదకి పట్టుకోడానికే. దీనిలోని ఆర్ధ్రతను చూడు. ఎవరైతే సుఖము, అధికారము, లాభం, గౌరవం కోసం ప్రపంచంలో మసలుతున్నారో వారు నిజంగా భగవంతుని వెదకడానికి పూనుకొన్నవారు. మనo అలవరచుకొన్న గుణాలకు, చెడ్డ గుణాలతో కలుపుకొని, గమ్యం ఉంది. అది అచేతన మనస్సులో జరుగుతున్న అంతర్యుద్ధములో జయించి మనమేవరో తెలిసికోవడం.

ఈ అపారమైన విషయం గురించి వివరంగా చెప్పేనని తలుస్తాను. సాధన పరిణామానికి అంతం. ఆ యుద్ధం యొక్క ఉద్దేశం మనలోని దుశ్శక్తులను మంచి వారిగా మార్చడం. ఇది మానవాళి జంతు దశనుంచి పోగుచేసుకొన్న వారసత్వపు సంపద. అందుకే యోగులు ఇలా చెప్తారు: ఆధ్యాత్మికను కాంక్షించే ప్రతి ఒక్కరూ అది మానవాళి మనుగడకై చేస్తారు. ఒకని జయం అందరి విజయం. అది మనకి ఏది సాధ్యమో, మన ఉత్కృష్ట ప్రకృతి ఏమిటో తెలియజేస్తుంది. మహాత్మా ఇలా అన్నారు: "ఒక్కడు ఆధ్యాత్మికను పొందితే ప్రపంచమంతటకీ లాభం. ఒక్కడు దెబ్బ తింటే ప్రపంచమంతా ఆ మోస్తరు క్రింద పడినట్టే. " ఆయన ఇంకా ఇలా చెప్పేరు: "నాకు, నా సహాయకులకు లబ్ది లేనిదే నా శత్రువులకు సహాయం చేయను." 57

No comments:

Post a Comment