Saturday, February 26, 2022

Eknath Gita Chapter 14 Sloka 5

14.5

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం

తన్ని బధ్నాతి కౌన్తేయ కర్మసంగేన దేహినమ్

కౌన్తేయా! రజోగుణము కామరూపమైనది , అది ఆశను, సంగమును కలుగజేయును. కర్మలయందు ఆసక్తిని కల్పించి జీవుని బంధించును

రజస్ మనను బంధించ కారాగారంలో పడేస్తుంది. ఎందుకంటే అది స్వార్థపూరితమైనది: నేను, నాది, మొదలైనవి. ఇది రజస్ కున్న పెద్ద లోపం. రాజసికుడు తామసికుడు కన్న ఫరవాలేదు: వానికి మోహం, అపరిమిత శక్తి ఉన్నా, కొంత సున్నితత్వము కూడా ఉంది. "నేను సున్నిత స్వభావము కలవాడిని. సున్నితులలో మొదటి వాడిని. నాకు ఏమి కావాలో నాకు తెలుసు" అని అంటాడు. వానికి ఏమి కావాలో వాడికి నిజంగా తెలుసు. దానిని ఏదో విధంగా పొందుతాడు. దాని వల్ల ఎవరికైనా హాని జరిగితే పట్టించుకోడు. అది పర్యావరణ విషయమైతే "మనం దానితో సద్దుకుపోవాలి" అంటాడు. అది మారణాయుధాల గురించి అయితే "పురోగతికై అవసరము. " అంటాడు.

స్మాగ్ విషయం చూద్దాం. స్మాగ్ నిరోధక యంత్రాలు నిజంగా స్మాగ్ ని నిరోధించటంలేదు. స్మాగ్ కి కారణం యంత్రాలు, ఫర్నెస్ లు, ఇంజిన్ లు కావు. మానవులను శాస్త్రజ్ఞులు హోమో సేపియన్స్ అంటారు. అనగా ఆలోచించే శక్తి గలవారు. ఇది అనవసరమైన బిరుదు. బెర్గ్ సన్ అన్నారు మానవులకు అచ్చొ చ్చిన పేరు హోమో ఫేబర్ . అనగా ఎవరైతే వస్తువులను తయారు చేస్తారో. రాజసికుడు అంటాడు "నేను వస్తువులను తయారు చేస్తాను. అది కాక నేను ఏమి చేయగలను? అన్నిచోట్లా నాకు వీలైనన్ని వస్తువులను తయారు చేసి నింపుతాను. పిదప, వాటిని మానవాళి వాంఛిస్తుంది. వారికి వాటితో ఏమి చేయాలో తెలియదు కాని, అవి కావాలనే ధృడమైన సంకల్పం కలుగుతుంది". వాడు రహదారులు, పట్టణాలు, వాహనాలు, పళ్ళు తోముకొనే బ్రష్ లు, విమానాలు, ఆయుధాలు, ఒకటేమిటి అన్నీ చేయాలని ఆకాంక్షిస్తాడు.

వస్తువులు చేయడంలో తృప్తి ఉంది. దానిని నేను కాదనను. ఆ సంతుష్టే మనని బంధిస్తుంది. రాజసికుడు ఏమైనా తయారు చేస్తూంటే దానిలో లీనమైపోతాడు. అతడు వస్తువు లోపలకి దూరినట్టు ఉండి, తాళం వేసుకొని నట్టు ఉండి, బయటనుంచి ఎవరు కేకేసినా విననట్టు ఉంటాడు. ఈ విషయంలో తామసికుడు లాగ అంధుడు, చెవిటివాడు.

ఏదైనా బజారులో లేదా షాపులలో చూడండి, వాటిలో ప్రదర్శించబడిన వస్తువులలో మనకి నిజంగా ఎన్ని కావాలి? వాటిలో ఎన్ని మనకు నిజంగా ఉపయోగపడతాయి? ఇది హోమో ఫేబర్ లు చేసిన సహాయం. మనం నేతి, నేతి ప్రక్రియతో అక్కరలేని వస్తువులు తీసివేస్తే మిగిలేవి ఒకే ఒక షాపులో నిండినన్ని.

అనుభవించే మనకి ఈ ప్రక్రియతో అవినాభావ సంబంధం ఉంది. కొనేవాళ్ళము మనము. మనం వాహనాలకై, బట్టలకై, పరికరాలకై అక్కరలేని కొనుగోళ్లు చేస్తూవుంటే, కాలుష్యాన్ని పెంచినవారమౌతాము. నేను నిరాడంబరంగా ఉండడానికి పేదరికం మంచిదని అనటంలేదు. నిరాడంబర జీవితం ఆనందం, తృప్తి నిచ్చేది. వస్తుసముదాయముతో కూడిన జీవితం అవసరంలేదు. అవి కళలకు సంబంధించినవి అయినా సరే.

నేను, నా భార్య వోక్ లాండ్ లో నివసిస్తూ ఉండగా ఒకరోజు ఒక పెద్ద లారీ మా నివాస స్థలానికి వచ్చింది. "వాళ్ళు న్యూ జర్సీ నుంచి వస్తున్నారు" అని నా ఇంటి ప్రక్క వాడు చెప్పేడు. ప్రపంచంలో ఎక్కడికైనా వస్తువులను తీసికివెళతాం అని ఆ లారీ మీద వ్రాసి ఉంది. నేను కుతూహలంగా ఏ రకమైన కళలకు సంబంధించిన వస్తువుల మూడు వేల మైళ్ళు మోసుకొని తెచ్చేరో చూద్దామని అనుకున్నాను.

ఆ లారీ తలుపులు తెరిస్తే ఇవి కనబడ్డాయి: కుర్చీలు, దీపాలు, మంచాలు, కోట్లు తగిలించే హ్యాంగరులు మొదలగు వస్తువులు. అవి అమెరికాలో ఎక్కడైనా దొరుకుతాయి. వాటిని వాళ్ళు న్యూ జర్సీ లోనే వదిలి, ఓక్ లాండ్ లో కొనుక్కొన వచ్చు. ఏమీ తేడా తెలీదు. మానవులు తమ వస్తువులతో బంధింపబడతారు. వాటిని ఎక్కడికి వెళ్ళినా మోసుకొను పోతారు. గతంలో ముడిపడిన వాటి భారాన్ని లెక్క చేయరు.

నేను చెప్పినంత మాత్రాన మీ ఇంట్లో వస్తువులను దాన ధర్మాలు చేయకండి. నేను చెప్పేది వస్తువులతో అసంగత్వంగా ఉండమని. మీవద్ద ఎంతో పురాతనమైన, ఖరీదైన కళా వస్తువులు ఉండచ్చు. వాటిని చూసి ఆనందించండి కాని వాటికి అతుక్కుపోవద్దు. వాటితో తాదాత్మ్యం చెందితే వాటిని నిజంగా అనుభవించిన వారు అవ్వరు.

మనం స్వార్థంతో ఒకరితో అనుబంధం పెంచుకోవచ్చు. నిస్వార్థ అనుభందం ప్రేమ. మీరు మీగురుంచి ఆలోచించకుండా, అవతల వాళ్ళ సుఖానికై బ్రతుకుతారు. కానీ స్వార్థపూరిత బంధంలో ప్రేమ లేదు. ప్రేమ నిస్వార్థమైతే అనుబంధం గట్టి పడుతుంది; అదే స్వార్థపూరితమైతే అనుబంధం తెగుతుంది. వస్తువులలాగే, స్వార్థంతో సంబంధం పెట్టుకుంటే, మీరు దానితో బంధింపబడతారు. మీవారి అక్కరలు తెలియదు. నిజానికి మీకు కావలసినది ఏమిటో కూడా తెలీదు. నిజంగా మనం ఒకరిని ప్రేమించామంటే వాళ్ళని వస్తువులులా -- అంటే "ఇది నాది. ఎవ్వరూ ముట్టుకోకూడదు" -- చూడకూడదు.

మనందరికీ సహజంగా ఒక వస్తువును పొందుదాము, ఒక వస్తువును ఇతరులకు ఇద్దాము అని ఉంటుంది. మనం చిన్నప్పడినుంచీ, దేవుడి దయతో, ఒక వస్తువుని ఇతరులనుండి పొందితే ఎవ్వరికీ లాభం లేదని నేర్చుకోవచ్చు. మొదట్లో అంతా బాగా ఉన్నట్టే ఉంటుంది. అది స్వార్థ బుద్ధికి నిదర్శనం. క్రమంగా ఆకాశం మారుతుంది. ఒక చిన్న మేఘం -- మన చెయ్యి అంత పెద్దది -- అగుపిస్తుంది. "బ్రెడ్ ని కాల్చాలా, లేక పచ్చిగా తినాలా ? బ్రెడ్ గోధుమతో చేయబడినదా లేదా వేరొక పదార్థంతోనా?" అని తర్జనబర్జన పడతాం. మనతో మనకు కావలసిన వారు ఏకీభవించరు. ఆ మేఘం కాఫీ వైపు వెళుతుంది. రాజసికుడు చిక్కని కాఫీ అవసరమున్నా లేకున్నా తాగాలనుకొంటాడు. వాని భార్య కెఫీన్ లేని కాఫీ తాగాలనుకొంటుంది. వాని చెయ్యి పరిమాణమున్న మేఘం, వాని తలంత పెద్దదయింది.

రాజసికుడు ఇంటికి మధ్యాహ్న భోజనానికి వస్తాడు. వాని భార్య సాదరంగా ఆహ్వానించి "మీ గురించి వేచి ఉన్నాను" అంటుంది.

రాజసికుడు "నా వాచీలో ఐదే అయింది. క్రిందటి వారం డైరీ క్వీన్ వద్ద నీ గురించి ఎంతసేపు వేచి ఉన్నానో గుర్తుందా?" అని అడుగుతాడు.

"గతాన్ని తవ్వకండి. ఇప్పటి కాలంలో ఉండండి. అది డైరీ క్వీన్ కాదు. "

స్వార్థ పూరిత అనుబంధం ఇలాగే ఉంటుంది. అది ఒకానొక రోజు తిరగబడుతుంది. కొన్నాళ్ళకు మనం నిజమైన ప్రేమ అనేది అత్యంత బాధను కలిగించేదిలా అవుతుంది: మీరు ఎవరినైతే గతంలో గాఢంగా ప్రేమించారో, వాళ్ళు ఇప్పుడు ప్రకోపింప జేసేవారవుతారు. క్లియోపాత్ర రాణిని తలపించిన ఆమె ముక్కు ఇప్పుడు చూడడానికే అసహ్యం అనిపిస్తుంది. ఆయనగురించి ఒకప్పుడు కలలు గనేవారు. కలలు పండకపోతే ఆయనను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఈ రోజుల్లో రాజసికుల జీవితం ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఇలాగ క్రిందకి పడనక్కరలేదు. ఒకవేళ పడినా వాళ్ళ సంబంధాలను సత్త్వంతో తిరిగి పెంపొందించుకోవచ్చు.

ఒకరోజు నేను పాచి (Lichens) గురించి చదువుతున్నాను. దీన్నిబట్టి మీరు జ్ఞానార్జనకి నేను ఎంత దూరం వెళతానో అర్థం చేసుకోగలరు. నేను జీవితంలో మార్చలేని సిద్ధాంతాలను పాచిని ఉదాహరణగా తీసికొని చెప్తాను. నా మనస్సు ఒక్కొక్కప్పుడు ఇలా చెప్తుంది: "నువ్వు రచయితవు. నువ్వు చిన్న చిన్న జీవుల గురించి తెలుసుకోవడంకంటే ఒక మంచి నాటకం గూర్చిన పుస్తకం చదవరాదూ ? " కానీ నాకు పాచి వ్రాయడానికి మంచి స్పూర్తినిచ్చింది. అవి ఏ మొక్కా పెరగలేని వాతావరణంలో బ్రతుకుతాయి. శాస్త్రజ్ఞులు దానికి కారణమేమిటని పరిశోధన చేస్తున్నారు. పాచి రెండు రకాల జీవుల సంయోగం. ఒకటి ఆల్గే , రెండవది ఫన్గస్. అవి పరస్పర౦ సహాయం చేసికుంటూ బ్రతుకుతాయి. వాటి జీర్ణశక్తిలో, స్వభావములో, ప్రకృతిలో చాలా తేడాలున్నాయి. ఒకటి పదార్థాన్ని తయారు చేస్తే, రెండవది నీరు సమకూరుస్తుంది. రెండూ కలసి మెలసి ఎటువంటి వాతావరణంలోనైనా ఒత్తిడి పడక బ్రతుకుతాయి.

ఇది ఒక మగవాడు, ఆడది కూడా చేయగలరు. వాళ్ళు ఇద్దరూ శివ-పార్వతులులా ఒకే స్వరూపం. వాళ్ళు పరస్పర అవగాహన పెంచుకొని, ఒకరికొకరు సహాయం చేసికొ౦టే ఎటువంటి శక్తీ వారిని విడదీయలేదు. అటువంటి స్థితిలో వాళ్ళ మధ్య గట్టి బంధం ఏర్పడుతుంది.

ఎక్కడైతే ఆడ మగ పోటీ పడతారో అక్కడ ప్రేమ ఉండదు. కృత్రిమ ప్రేమ నటన కూడా పనిచేయదు. ఎక్కడైతే స్పర్థ ఉంటుందో అక్కడ మరణమొక్కటే ఉండగలదు. మన సమాజములో శోచనీయాంశం ఏమిటంటే ప్రేమ పేరుతో ఆడ మగ మధ్య ప్రతి రంగంలోనూ స్పర్థలు కలిగించడం. నేను రోజూ వాటిగురించి పుస్తకాలలో, సినిమాలలో , టివిలో, విద్యాలయాలలో, ఇళ్ళలో చూస్తున్నాను. మనమందరము మన బుద్ధిని ఉపయోగించుకొని ఆడామగా పరస్పర సహాయంతో కలసి మెలసి ఉండాలని తలచి వాళ్ళ మధ్య స్పర్థలు పెట్టకుండుటకు ప్రయత్నించాలి. 126

Saturday, February 19, 2022

Eknath Gita Chapter 14 Sloka 4

14.4

తత్ర సత్త్వ౦ నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం

సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ

అర్జునా ! ఈ త్రిగుణములలో సత్త్వ గుణము నిర్మలమైన దగుటచేత ప్రకాశమును కలుగజేయునదియు, నిర్వికారమైనదియు నగుచు సుఖాభిలాషయచేతను, జ్ఞానాభిలాష చేతను జీవుని బంధించుచున్నది

త్రిగుణాలను వ్యష్టి పరిణామము దృష్ట్యా చూడవచ్చు. జడత్వం, జాప్యం చేయుట, శక్తిలేమి, లక్ష్యం లేకుండుట, "నాకు లెక్క లేదు. ఈ కర్మ చేయకపోతే ఏమవుతుంది?" అని తలంచేవారు, తమస్ యొక్క లక్షణాలు గలవారు. అపరిమిత శక్తితో క్రియలు చేయవలెనని పట్టుదలతో, ఎప్పుడూ ముందుకు సాగుతూ, లక్ష్యం లేకుండా ప్రవర్తిస్తూ, స్వాధీనములోలేని గాలివానవంటి మోహంతో ఉన్నవారిలో రజస్ ఎక్కువగా ఉన్నది. ఎవరైతే తమ సమయాన్ని, శక్తిని పరోపకారమునకై దారపోస్తారో, ఇతరులను దూషింపక వారి తప్పులను క్షమిస్తారో అట్టివారిలో సత్త్వ గుణము అధిక పాళ్ళలో ఉన్నట్టు. వారిలోని గుప్తమైన శక్తిని వెలికి తీసి, దాన్ని స్వాధీనము చేసుకొని ఇతరుల వృధ్ధికై పాటుపడతారు.

సత్త్వము, తమస్ పరస్పరం సహాయం చేసుకుంటాయి. కాని వాటిలో అగాధమంత తేడా ఉంది. తమస్ మొద్దు బారినది. తామసిక వ్యక్తికి కుర్చీలోంచి లేచి పక్క దగ్గరకు వెళ్ళడానికి బద్దకం. సాత్త్వికమైన వ్యక్తి అపారమైన శక్తితోకూడి ఉంటాడు. ఆ శక్తి అతని ఆధీనంలో ఉంటుంది. వానికి అందరికన్నా ముందు ఉండాలనే కోర్కె ఉండదు. తన శక్తిని ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో తెలిసినవాడు.

"నేను ఏమి చేయాలో ఆలోచించుకొని చేస్తాను. సాధారణంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. వేచి చూడు అన్నది నా ధ్యేయం. వాటిపాటికి వదిలేస్తే అవే సద్దు కొంటాయి" అని తామసిక వ్యక్తి అనుకొంటాడు.

సాత్వికునికి సులభంగా కోపం రాదు. దానివలన వానిలో గొప్ప శక్తి గుప్తంగా ఉంటుంది. వానికి ప్రాణ అనే ఆర్జన ఉండి, బ్యాంక్ అకౌంటు లో కొంత సొమ్ము ఉంటుంది. వీటి వెనుక ఎక్కువ సొమ్ము స్టాక్ మార్కెట్ లో ఉంటుంది. కావలిసినప్పుడు తన స్టాక్ ను అమ్మి లక్షలు తన బ్యాంక్ అకౌంటు కు జమ కట్ట గలడు. రజస్ తో ఉన్న వ్యక్తి తన సొమ్మంతా బ్యాంక్ లో దాస్తాడు. అతని వద్ద చాలా క్రెడిట్ కార్డ్ లు ఉండి, వాటిపై ఖర్చులు పెట్టి, దివాలాకి దగ్గరగా ఉంటాడు. అతని ఆస్తులు గొప్పవే. అలాగే అతని ఖర్చులు కూడా. అతను నడివయస్సును దాటిన తరువాత తలకుమించిన ఖర్చులు చేసి, బ్యాంక్ లోని సొమ్ము నంతటిని వాడుకుంటాడు. తామసిక వ్యక్తి డబ్బంతా పోగొట్టుకుంటాడు. తను చెల్లించ వలసిన రుసుములను ప్రక్కన పెడతాడు. వానిని జమ కట్టడానికి తయారవుతాడు, కాని ఎన్నో ఆలోచనలలో మునిగి వాటిని నిర్లక్ష్యం చేస్తాడు. బాహ్య కర్మలే ప్రాణాన్ని క్షయం చేయనక్కరలేదు. స్వార్థానికి ఎక్కడలేని ఖర్చులు చేసినా ప్రాణం వ్యచ్చి౦పబడుతుంది. తామసిక వ్యక్తి తన జీవితాన్ని వ్యధతో గడుపుతాడు. ఎల్లప్పుడూ తన సమస్యలు, కాంక్షలు గురించి ఆలోచిస్తూ తను కట్టవలసిన రుసుములను నిర్లక్ష్యం చేస్తాడు. గాలిలో మేడలు ఇలా లెక్కలు కడతాడు: "సెలవుకు 20, నా జాలి 75, పైనున్న ఉద్యోగికి ఏమి చెప్పాలో దానికి 100, మొత్తం 477.95". అతను అలాగ సతమతమౌతాడు.

మా ఎలెక్ట్రిక్ సంస్థ రోడ్డు ప్రక్కన విద్యుత్చ్ఛక్తి వాడకాన్ని తగ్గించుకోమని ప్రకటనలు పెట్టింది. "ఇది ఇలా చేయకు. అనవసరమైన వానిని ఆఫ్ చేయి." మన ప్రాణ శక్తిని కూడా అలాగే వ్యర్థం అవ్వకుండా చూసుకోవాలి. దానికై సులభమైన పద్దతి: "స్వార్థాన్ని తగ్గించుకొని, పరోపకారానికి పూనుకోవాలి." మననుండి దృష్టి మార్చి, ఉదాహరణకు మంత్రాన్ని మనస్సులో ధ్యానిస్తూ ఉంటే, ప్రాణ శక్తి తక్కువ ఖర్చు అవుతుంది. ఇతరుల గూర్చి ఆలోచిస్తున్నప్పుడు ప్రాణ శక్తి వృద్ధి అవుతుంది. ఈ విధంగా సాత్వికుడు ప్రాణ పరంగా ధనికుడవుతాడు. సెయింట్ ఫ్రాన్ సిస్ ఇలా చెప్పేరు: "మనం ఇతరులకు దానం చేయడం వలననే లబ్దిని పొందుతాము." అది అక్షరాలా నిజం. పరులకు 10 ప్రాణ రూపాయలు ఇస్తే , మనకు భగవంతుడు ప్రతిఫలంగా 20 ప్రాణ రూపాయలు ఇస్తాడు. మీరు దీనిని అమలుపెట్టి చూడండి. మీకే తెలుస్తుంది. దానికి వ్యతిరేకంగా ఒకరి దగ్గరనుండి కాజేస్తే మనకు నష్టం కలుగుతుంది. మనం ఏదీ పొందకపోవడం సరి కదా, ఉన్నది ఊడ్చుకు పోతుంది.

మనం క్రియా శక్తి దృష్ట్యా చూడవచ్చు. తామసిక వ్యక్తికి అది శూన్యం. అదిలేక తన క్రియలను చేయలేకున్నాడు. వానికి జాప్యం చేయడం వలన కలిగే నష్టాలను ఎంత చెప్పినా వినడు. తమస్సు అతనికి చెప్పిన దానిపై మనస్సును పెట్టక, చెవులున్నా వినీ విననట్టు చేస్తుంది.

రజస్ కు క్రియాశక్తి , క్రియల చేయాలనే ఉత్సాహం ఎక్కువ ఉంది కానీ బుద్ధి తక్కువ. ఎక్కువ కోర్కె, తక్కువ బుద్ధి వల్ల సమస్యలు ఎదురవుతాయి. తమోగుణమున్నవానికి ఒక మంచి లక్షణం ఉంది. వానికి ఆశ లేదు. ఎందుకంటే వానిలో శక్తి లోపించింది. ప్రపంచంలో అతి మూల్యమైన చాకోలేట్ తీసుకొని ఒక స్థంబం ముందు పెడితే ఎలా ఆ స్థంబం స్పందించదో అలాగే తామసిక వ్యక్తికి కోర్కె లేదు. వానికి అమితమైన తిండి తినాలని అనిపించవచ్చు, కాని దానికి కూడా బద్దకిస్తాడు. తామశికులు శిలా విగ్రహాల్లాగ ఉంటారు. వారిని ఒకచోట వదిలి, రెండేళ్ళ తరువాత చూస్తే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నటు వాళ్ళ స్థితిలో ఎట్టి మార్పూ ఉండదు. అలాగే తామసికులకు కోపం రాదు. అది వాళ్ళలో క్షమించాలనే లక్షణం ఉండి కాదు. వాళ్ళలో ఆశ అనేది లేక. వాళ్ళలో దురాశ లేదు. అది వాళ్ళ వైరాగ్యం వల్ల కాదు. వాళ్ళలో స్పందన లేక ఏదీ కాంక్షించరు. వాళ్ళు దేన్నీ ప్రేమించ లేరు. ఒక వింతను చూడడానికి ఇష్ట పడరు. అది వాళ్ళ ప్రక్కనే ఉన్నా. గొప్ప ఖరీదైన వాహనాన్ని చూసి "నాకు దాన్ని పొందుతే ఎలావుంటుంది" అని అనుకోరు. వాళ్ళ జవాబు "నాకేం పట్టింది?"

తమస్ లో సున్నితము, స్పురణ లేదు. స్వామి వివేకానంద ఇలా చెప్పేవారు: నిరాశ కన్నా ఆశ నయం, స్తభ్దత కన్నా కోపం నయం, చచ్చినట్టు పడి ఉండడం కన్నా ఒక్కొక్కప్పుడు విలాసంగా బ్రతకడం నయం. ఈ వ్యాఖ్యలు మనకి తమోగుణం హెచ్చయినప్పుడు పనికి వస్తాయి. కూర్చోవడం కన్నా ఏదో దిక్కులో అటూ ఇటూ తిరగడం నయం. కదులుతూ ఉన్నప్పుడు దిక్కుని మార్చుకోవడం సులభం.

రాజసికులుకు కోపం వెంటనే వచ్చేస్తుంది. వాళ్ళు అవతలి వాళ్ళని లెక్క చేయక, వస్తువులను కోరుకుంటూ, వాళ్ళ మార్గమే ఉత్తమమనే విధంగా ఉంటారు. విరోధము ఎన్నాళ్లయిన పెట్టుకొంటారు. వాళ్ళ జ్ఞాపకశక్తి మెండు. మనమనవచ్చు "ఎంత చెడు భావన!". అయినప్పటికి రాజసికులకు భవిష్యత్ ఉంది. గ్రీటింగ్ కార్డ్ పంపిస్తున్నపుడు మనమిలాగ వ్రాయవచ్చు: "మంచి మిత్రునికి వ్రాయునది." శక్తి చాలా ఉంది. అలాగే మార్పుకుకూడ అవకాశముంది.

దానితో పోలిస్తే తమస్సు తుస్సు టపాకాయి. స్వామి వివేకానంద తమస్సును మెత్తగా నానిన దుంగ అంటారు. ఎన్ని అగ్గిపుల్లలు వెలిగించినా దానిని మండించలేము. రజస్సు అలాగ కాదు. ఒక్క అగ్గి పుల్ల చాలు. వాని చిత్త చాంచల్యం ప్రమాదకరమవ్వచ్చు . కానీ వాడు ఏదో క్రియచేస్తూ ఉంటాడు. వానికి శక్తి ఉన్నది.

రాజసికుడికి ఎప్పుడూ ఏదో పని చేయాలని ఉంటుంది. పనిలేకుండా ఉండడు. బస్ గురించి నిరీక్షించాలంటే ఊరకనే ఉండడు. సిగరెట్ వెలిగిస్తాడు లేదా మెటికలు విరుచుకుంటాడు. ఊరకనే కూర్చొని సినిమా చూడడు. ఏదో తినుబండారాన్ని తింటూ త్రాగుతూ ఉంటాడు. దేని గతి ఐనా నెమ్మదిగా ఉంటే లేచి వెళిపోతాడు. వాహనం నడుపుతున్నప్పుడు రేడియో పెట్టుకొని, వ్రేళ్ళతో స్టీరింగ్ వీల్ మీద తాళం వేస్తూ, రేడియో స్టేషన్ మారుస్తూ ఉంటాడు. రెడ్ సిగ్నల్ దగ్గర దినపత్రిక చదువుతాడు లేదా ఎవరినైనా ఫోన్ చేసి మాట్లాడుతాడు. తన పనిగురించి, సమస్యల గురించి ఆలోచిస్తూ, పక్క మీద అటూ ఇటూ దొర్లుతూ, నిద్ర లోకి జారుకుంటాడు. నిద్రపట్టడానికి మేకలను లెక్క పెడుతూ సింహాలని, పులులని ఊహించుకుంటాడు.

తామసికుడు పరిగెత్తడం కన్నా నడకే మేలనుకొంటాడు. పార్క్ లో పరిగెత్తడం హింసగా భావిస్తాడు. అది రక్తపు పోటుకు దారితీస్తుంది అంటే "అయితే అవ్వనీ" అంటాడు. గుండెపోటు రానంత కాలం ధీమాగా ఉంటాడు. ఊహించ రాని విషయం గురించి ఎందుకు వ్యధ చెందాలి అని తలుస్తాడు. తామసికుడు నడవడం కన్నా కూర్చోవడమే ఉత్తమమని అంటాడు. కార్ మీద "నేను పడుకొని ఉంటే బాగుండును" అని స్టిక్కర్ పెట్టుకుంటాడు. వానికి రాజసికుడు లా కాక నిద్రకు భంగం ఉండదు. స్పృహ లేక నిద్రపోతాడు. మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. అతడు భౌతికముగా ఏ పనులూ చేయకున్నా, సంపూర్ణ విశ్రాంతి అనుభవించడు. అతని మనస్సులో భయానకమైన దృశ్యాలు చూస్తాడు.

సాత్త్వికుడికే విశ్రాంతి ఎలా తీసికోవాలో తెలుసు. అవసరమైనప్పుడు కష్టపడి పని చేస్తాడు. కాని వాని మనస్సు అతలాకుతల మవ్వదు. అది మందమవ్వదు. అతను విశ్రాంతి సమయంలో టెన్నిస్ ఆడవచ్చు, కుటుంబంతో సినిమాకి వెళ్ళవచ్చు, లేదా మిత్రులతో ముచ్చటలాడవచ్చు. అతని మనస్సు ఆఫీస్ పని మీదకు మళ్లక ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో చక్కగా వింటాడు. అతని ఆఫీస్ పనిని భౌతికంగా, మానసికంగా అక్కడే వదిలేస్తాడు. ఎక్కడకి వెళ్ళినా పూర్తిగా నిమగ్నమై ఉంటాడు. అతనికి నిద్రపోవడానికి ఇబ్బందిలేదు. అతను మనలాంటివారి ఇద్దరి, ముగ్గురి చేసేపనిని సునాయసంగా తను ఒక్కడే చేయగలడు. అతని రహస్యం: అసంగత్వం. అతను తన పనితో తాదాత్మ్యం చెందడు . కష్టపడి పనిచేసి, ఫలితం గురించి వ్యధ చెందడు. ఫలం దైవానికే వదిలేస్తాడు.

ఒక మంచి నటుని ఉదాహరణగా తీసికొని చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రిందట సర్ మైకేల్ రెడ్ గ్రేవ్ ఆంగ్ల సాహిత్యంలోని కొన్ని అంశాలను చదవడానికి ఏర్పరచిన సమావేశానికి వెళ్ళాను. ఆయన పిక్ విక్ పేపర్స అనే పుస్తకంలోనుంచి ఒకానొక అంశం తీసికొన్నారు. టాప్ మేన్ అనే పాత్ర ప్రేమ వలలో పడడం దాని ప్రధాన విషయము. సర్ మైకేల్, మిస్ వార్ డిల్ ఆ పాత్రలకు అనుగుణంగా నటించేరు. తరువాత వాళ్ళు ఉంకో నవల (The Importance of Being Earnest) ఆధారిత పాత్రలను పోషించేరు. వాళ్ళ మాట తీరు, ప్రవర్తన, మొదటి దానికన్నా చాలా భిన్నంగా ఉన్నాయి. నేను వాళ్ళు వేరే వ్యక్తులనుకునేలా అ విభిన్న పాత్రలలో కనిపించేరు. అలాగే జాన్ డాన్, షేక్స్ పియర్, షా సాహిత్యాని కనుగుణంగా పాత్రలు పోషించేరు. ఈ విభిన్న పాత్రలు చేసిన సర్ మైకేల్ ఉన్నది ఒక్కడే. మనమది ఎప్పటికీ మరువం. దానిలోనే ఉంది సగం కళ. సర్ మైకేల్ అలాగే మరువరు.

సాత్వికుడు అలాగే ఉంటాడు. తన స్వస్వరూపం తెలిసికొని, తన విభిన్న పాత్రలను తడబాటు లేకుండా చేస్తాడు. అతను వైద్యుడయితే ఉదయాన్నే తెల్ల కోటు వేసికొని తన క్రియలను సామర్థ్యంతో నిర్వర్తిస్తాడు. అది అతని వృత్తి. రోగులకది నమ్మిక కలిగిస్తుంది. కానీ తను ఒకానొక పాత్రధారినని మరచిపోడు. ఇంటి కెళుతున్నప్పుడు తన కోటుని తీసి, దానితోనే తన పాత్రను విరమించి ఇంటికి వెళతాడు. ఇంట్లో ప్రేమించే భర్తగా, తండ్రిగా, వివిధ పాత్రలను సునాయసంగా ధరిస్తాడు.

అదే రజస్ అనే వైద్యుని వైనం చూద్దాం. అతనికి తను చదువుకొన్న పాఠ్య పుస్తకాలు కంఠతా వచ్చు. కానీ మానసికంగా రోగులు వారి రోగములతో తాదాత్మ్యం చెందుతాడు. ఇంటికి వెళ్ళినా తన రోగుల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అతను అతి తక్కువ సమయం భార్యాపిల్లలపైన వ్యచ్చిస్తాడు. ఆ వ్యాపకంతో మరుసటి దినం తన ఆసుపత్రికి వెళ్ళేక క్రొత్త రోగులను చూస్తూ, పాత రోగుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీని వలన తన మనస్సును రోగులమీద కేంద్రీకరించ లేకపోతాడు. అతను గత స్మృతులను తలచుకొంటూ, వాటి బరువును మోస్తూ, అవి తనవేనని ఆవేదన చెందుతాడు. దీనివల్ల ఎవరికీ లాభంలేదు.

అసంగత్వం లేకపోవడం పనిలో పెద్ద అవరోధం. ఈమధ్య ఒక లావాటి పుస్తకం చదివేను. దానిలో అనేక రోగుల చరిత్ర, వారికి సంబంధించిన చిత్ర పఠాలు ఉన్నాయి. దాని రచయితకు తెలీని విషయం: ఒక సాత్వికుడు నిరంతరం అసంగత్వంగా సమస్య లేకుండా పని చేయగలడు.

ఒక ఉపాధ్యాయుడికీ ఇది వర్తిస్తుంది. ఇక్కడ నా స్వీయానుభవము చెప్తాను. ఒక కాలేజీ ప్రొఫెసర్ నిజానికి ప్రొఫెసర్ కాదు. అతను ఇంటా, బయటా, అన్నిచోట్లా ఒక మంచి వాడు. కాని అతడు కాలేజీ లోకి ప్రవేశించగానే పాండిత్యం ఉదయిస్తుంది. గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలను పోగుచేసి, అందులో కొన్ని పెద్ద పుస్తకాలను ఎంచుకొంటాడు. పాఠం చెప్తున్నప్పుడు బోర్డు మీద వ్రాసి, చిత్రాలు గీసి, స్లయిడ్ లు చూపించి, తోచిన హాస్యం కూర్చి, ఒక పండితుడిగా వ్యవహరిస్తాడు. కాలేజీ బయటకు వచ్చినపుడు షాపు కు వెళ్తే అక్కడ అతను ప్రొఫెసర్ కాడు. అందరిలాగా వ్యవహరిస్తాడు. కల్పిత శాస్త్ర సాహిత్యం, స్టాక్ మార్కెట్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ ఒక సగటి మధ్య తరగతి వ్యక్తి గా మెలుగుతాడు.

సాత్వికుడు అసంగతవ్యంగా వ్యవహరిస్తాడు. ఒక సాత్వికమైన భార్య తన బాధ్యతను సక్రమముగా నిర్వర్తిస్తుంది. పిల్లలకు మంచి తల్లిగా ఉంటుంది. ఆఫీస్ లో డాక్టర్ , ఉపాధ్యాయిని, గుమాస్తా, కంప్యూటరు ప్రోగ్రామర్, అకౌంటెంట్ మొదలగు పాత్రలు ధరించి చక్కగా పనిచేస్తుంది. కొంత కాలం తరువాత యధేచ్చగా, సహజంగా సర్ మైకేల్ రెడ్ గ్రేవ్ లాగ ఆమె వ్యవహరిస్తుంది. తన స్వస్వరూపం ఆత్మ అని తెలిసికొని, జీవితంలో వివిధ పాత్రలను ధరించి, ఇతరులకు సహాయకారిగా ఉండాలనే కాంక్ష ఆమెను బలపరుస్తుంది.

ప్రతి గుణంలోనూ లోపం లేకపోలేదు. తమస్ భయమును కలిగిస్తుంది. తామసికుడు తన నీడను చూసి భయపడకపోవచ్చు. తనను తాను భయంకరమని తలంపక పోవచ్చు. కానీ భయం అనేక రూపాలలో వస్తుంది. అతడు సదా వ్యధతో నుండి, ఏ కార్యము చేయకుండా ఉంటాడు. అతడు దేశ ఆర్థిక పరిస్థితి, అంటువ్యాధుల గురించి వ్యధ చెందవచ్చు. అతడు తన గురించి తక్కినవారు ఏమనుకుంటున్నారన్న భావనతో సతమతమవ్వచ్చు. వాళ్ళు తనను ప్రేమిస్తున్నారో లేదో, తనకు కావలసిన విధంగా స్పందిస్తారో లేదో అని బాధ పడుతూ ఉండొచ్చు. అతడు చాలమార్లు భయానికి లొంగి ఉంటాడు. అది మంచి పద్దతి కాదు.

రాజసికుడు రెండు విధాలుగా స్పందిస్తాడు: కోపం లేదా ఆశ. అతడు ఎన్నిక చేసుకోలేడు. అయినప్పటికి అతని ఎదుగదలకు ఆస్కారం ఉంది. అతను తనను మార్చుకోగలడు. అతనికి కొంత బుద్ధి ఉంది. సమస్యలు ఎందుకు ఎదురవుతాయంటే తనను క్రియలలో నిర్బంధించుకుంటాడు కాబట్టి. అతనిలోని బుద్ధి, కోర్కె ఒక చిన్నపిల్లవాడు, తండ్రిలాగా ఉంటాయి. కోర్కె వేగంగా నడుస్తూంటే బాలుడిలా బుద్ధి వెనకబడుతుంది. కానీ తండ్రిలాంటి కోరిక వేచి చూడదు. అతనికి సహనం లేదు. "నాతో నడవడానికి ప్రయత్నించు. అడుగు తీసి అడుగు వెయ్యి" అంటాడు. కానీ బుద్ధి ముందుకు వేగంగా సాగలేదు. అది ఇంకా వెనుకబడిపోతుంది. అది ఒక సమస్యగా మారుతుంది. అతడు తన కోర్కెలకు బలి అయిపోతాడు. అతడికి ఎన్నుకోడానికి స్వతంత్రము లేదు. ఎంతసేపు ముందుకు సాగాలనే తపన పట్టి పీడిస్తుంది. ఒక వస్తువు లేదా వ్యక్తి గురించి వచ్చే ఆలోచనలను నియంత్రి౦చలేక పోతే, మనస్సును కట్టడి చేయలేకపోతే, కోర్కెను చంపుకోలేకపోతే బుద్ధి తీవ్రంగా వెనకబడుతుంది.

కోర్కె విపరీతంగా ఉంటే అది తీరే వరకు చేతనాన్ని వేదిస్తుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, వాహనాన్ని నడుపుతున్నప్పుడు, నిద్రలో మనస్సు కోర్కె వైపు తిప్పుతుంది. దృష్టి కేంద్రీకరించలేక ఏ పనీ సక్రమంగా నిర్వర్తించలేక, స్నేహితులకు, బంధువులకు దూరమవుతూ ఉండడానికి కారణం బుద్ధి లేక పోవడమే.

అదృష్టవశాత్తూ ధ్యానం ఇందుకు సహకరిస్తుంది. భారత దేశంలో తల్లులు తమ బిడ్డ నడక నేర్చుకుంటున్నప్పుడు మూడు చక్రాలున్న ఊత నిస్తారు. దానితో బిడ్డ చిన్న చిన్న అడుగులు వేసి, నడవడానికి ప్రయత్నిస్తాడు. వాడు సమంగా నడుస్తే తల్లిని చేరుకొంటాడు. ఒకరోజు ఆ ఊతను తల్లి తీసేస్తుంది. "ఇక్కడికి రా" అని పిలుస్తుంది. బిడ్డ రెండు మూడు అడుగులు తత్తరపాటుతో వేస్తాడు. తల్లి వాడిని ప్రోత్సాహిస్తుంది. "రా, ముందుకు రా" అంటుంది. వాడు చివరకు తల్లిని చేరి సేద తీర్చుకొంటాడు. చివరికి వాడికి నడక వస్తుంది. త్వరలోనే వాడు పరిగెత్తి ఫూట్ బాల్ ఆడుతాడు. తల్లి వాడిని ఇంట్లో వుండేలా చేయలేదు.

ఇదే విధంగా మన బుద్ధిని కూడా పెంపొందించుకోవాలి. అది తినే ఆహారంతో మొదలవుతుంది. మధ్యాహ్న రాత్రి భోజనాల మధ్య కాలంలో తినకపోవడం, శరీరానికి హాని కలిగించే ఆహారాన్ని తినకుండా, తీపి కొవ్వు తగ్గించి, పచ్చటి ఆకుకూరలను తింటూ ఉండాలి. ఇది మంచి పోషకాహారమనే కాదు, మన బుద్ధిని కూడా మేల్కొలుపుతుంది.

మన ఇంద్రియాలను కేవలం నేర్పడానికే కాదు. వాని ద్వారా మన బుద్ధిని ప్రభావితం చెయ్యడానికి. దానికి వేరే మార్గ౦లేదు. "సిగరెట్ అలవాటును మానుకోవడానికి మాతో సముద్ర యానంకి రండి" అని ప్రకటనలు చూస్తాం. ఇవి కట్టు కథలు మాత్రమే. మనం వాటిని చూసి మోసపోకూడదు. మీ బుద్ధిని బలపరచడం నిరంకుశముగా మీకు కావలసిన వస్తువును లాక్కోడం, లేదా మనం పట్టిన పట్టు సాధించడానికి కాదు. దాని అవసరం పట్టు వదలని రజస్ ని స్వాధీనం చేసుకోడానికి. తద్వారా మోహం, ఉద్రేకం మొదలైన వాటిని కట్టడి చేసి ఇతరులకై పాటు పడడానికి.

ఇంద్రియాలకు నేర్పుతూఉంటే, రాజసికుడ క్రమంగా బుద్ధిని నేర్చుకోంటాడు. అలాగ అతడు సాత్వికుడిగా మారుతాడు. బుద్ధి పరంగా ఒక పెద్ద వస్తాదు అవుతాడు. కాని వానికి ఎంతో పని లేదు. సాత్వికుడు ఒక కోర్కెను నిరాకరించినా, బుద్ధి సరిగా పనిచేని కోర్కెను తరిమేస్తుంది. కానీ సత్త్వ గుణాన్ని ఎదిరించేది లైంగిక కామం. దానితో నిజమైన యుద్ధం జరుగుతుంది. అదే సాధన. అది చాలా కాలం జరుగుతుంది.

దీని గురించి ఇబ్బంది పడక్కరలేదు. లైంగిక కామం చాలా బలమైన కోరిక. అది జీవితమిచ్చే పెద్ద భౌతిక సుఖం. అందుకే దానికి అంతులేని శక్తి ఉన్నది. కామ కోర్కె అధికంగా ఉంటే వాహనంలో ఇంధనం అధికంగా ఉన్నట్టే. ఆ ఇంధన పాత్రను తీసి పారేయలేం. మనకున్న ఎన్నిక: లైంగిక కామానికి బానిసలమా కామా. దాన్ని అధిగమిస్తే గొప్ప శక్తిని పొంది, అయస్కాంతం లాంటి వ్యక్తిత్వాన్ని పొందవచ్చు. కోర్కెలోని శక్తిని కుండలిని అంటారు. అది మనని చేతనవంతులుగా చేసి, ఉత్తమ పురుషులుగా పరిణామ౦ చెందిస్తుంది. లైంగిక కామంతో చాలా శక్తి వ్యర్థం అవ్వకుండా నియంత్రించుకొంటే, మనలాంటి సాధారణ వ్యక్తులు ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకొనేలాగా, నిస్వార్థ కర్మలను ఆచరించేలాగా చేస్తుంది.

సత్త్వ గుణం మన బుద్ధి ఎంత పెంపొందిస్తుందంటే, అది లైంగిక కామాన్ని అణచివేస్తుంది. అప్పుడు గీత చెపుతుంది హృదయం పరిశుద్ధ మవుతుందని. జీసస్ చెప్పినట్లు ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉంటుందో వాళ్ళు దేవుడిని చూస్తారు. మన హృదయంలోని స్వార్థ మోహాన్ని తీసివేయడానికే మన బుద్ధిని అతి బలవంతునిగా చేసుకోవడం. 122

Saturday, February 12, 2022

Eknath Gita Chapter 14 Sloka 3

14.3

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః

నిభధ్నంతి మహాబాహో దేహే దేహిన మవ్యయం

అర్జునా! ప్రకృతినుండి జనించిన సత్త్వరజస్తమో గుణములు అవ్యయుడైన జీవుని దేహమునందు బంధించుచున్నవి

మన గ్రంథములు జీవి, పరమాత్మ నుండి ఆవిర్భవించి, మూడు శక్తులచే బంధింపబడ్డవాడని చెప్పుచున్నవి. ఆ మూడు గుణాల గూర్చి గీత చెప్పే సిద్ధాంతం అతి ముఖ్యమైనది. గుణాలు ప్రకృతికి మూలం. పదార్థం, శక్తి, మనస్సు ఈ మూడు గుణాల కలయికగా చెప్పవచ్చు. సత్త్వ గుణం అనగా నీతి, సామరస్యం, సమత్వం. రజస్ అనగా శక్తి. తమస్ అనగా జడత్వం. వ్యష్టిగా సత్త్వ గుణము ఆనంద సామ్రాజ్యానికి దారి తీస్తుంది. రజస్ మనను అక్కడికి తీసుకు వెళ్ళే శక్తి. అది స్వాధీనములో లేకపోతే మనం అడ్డదారులు తొక్కుతాం. తమస్ మనకు కలిగే అవరోధాలు.

హిందూ శాస్త్రాల దృష్ట్యా, సృష్టికి పూర్వం, నిర్వికల్పమైన, విభజింపబడని, చైతన్యం ఉన్నది. దానినే మనం పరమాత్మ లేదా దేవుడు అంటాము. పురాణాలలో విష్ణు మూర్తిని సర్వాంతర్యామి అయిన దేవుడుగా భావిస్తారు. ఆయన అంతములేని ఆది శేషునిపై, ప్రపంచమనే సముద్రమధ్యలో శయనించి ఉంటాడు. చైతన్యం సర్వవ్యాపాకమై, ఏఖాండమైనంతకాలం వేరే పదార్థానికి తావులేదు. జెనెసిస్ లో చెప్పినట్లు "దేవుడుచే నీరు మీద ఆయని శక్తి పయనించింది". దేవుడు ధ్యానంలోకి వెళ్ళేడు. దానివల్ల చైతన్యం మూడు గుణాలతో వికల్పమైనది. వాటినుండి పదార్థము, శక్తి ఆవిర్భవించినవి. ఈ విధముగా మూడు గుణాల సముదాయంతో సృష్టి గోచరమైనది. జ్ఞానులు సృష్టి జరగబడలేదు, వివర్తించినది అని కూడా నమ్ముతారు. ఎలాగైతే సాలీడు తన స్వశక్తితో గూడు కడుతుందో, అలాగే దేవుడు సృష్టి తనంతట తానే చేసేడు. మూడు గుణాలూ ఆ సృష్టికి మూలం.

కోట్ల సంవత్సరాల పరిణామము వలన మానవులలో మూడు గుణాలూ వివిధ పరిమాణములో ఉంటాయి. ఒకడు బహు శక్తిమంతుడు. మరొకడు మందగొండి. బహు కొద్దిమంది శాంతమైన, నమ్మకమైన, భద్రతతో కూడిన వారు. ప్రతి ఒక్కరిలో ఒక గుణం ప్రబలమై ఉంటుంది. అది వ్యక్తిత్వంలో వివిధ దశలలో వ్యక్తమౌతుంది.

నిజానికి ఆ మూడు గుణాలూ ప్రతీ వ్యక్తిలోనూ ఉన్నాయి. ఒకప్పుడు ఒకడు శక్తితో పూనుకొని ఉంటాడు. ఉదాహరణకి వాడు తనకిష్టమైన కార్యం చేస్తున్నప్పుడు. అతడే వేరే సమయములో ఉదాసీనంగా ఉంటాడు. అది తనకయిష్టమైన పని చేయవలసి వచ్చినపుడు. వ్యక్తి ఒక్కడే గాని గుణాల వల్ల తన ప్రమేయం లేకుండా ప్రభావితమౌతున్నాడు.

ఒక్కొక్కప్పుడు సమయం, శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఉదయం మనం శక్తితో కూడి, ఏ కార్యాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉంటాము. మధ్యాహ్నం, ముఖ్యంగా భోజనం చేసిన తరువాత, స్తబ్దుగా ఉంటాము. ఒక పరిశీలకుడు వానిని ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా, వ్యక్తిత్వాలుగా భావించవచ్చు. మనలో మూడవ వ్యక్తిత్వం కూడా బహు అరుదుగా ఉంది. మానవులమైనందుకు మనలో సత్త్వ గుణం ఎంతోకొంత ఉంది. దాని వల్ల మనలో దయ, భద్రత, సమభావము, స్వయం నియంత్రణ ఉన్నాయి. అవి గుప్తంగా ఉండవచ్చు. కానీ మనలో అవి వున్నాయి కాబట్టి మనం జంతువులనుండి పరిణామం చెందేమని తెలుస్తుంది. మనం రజస్ యొక్క శక్తిచే తమస్ కలిగించే అవరోధాల్ని దాటే౦. పిదప రజస్ యొక్క శక్తిని నియంత్రించేం.

గుణాలతో మన వ్యక్తిత్వాన్ని విశ్లేషించి, అదెలా ఏర్పడిందో, దానికి ఉంకో దానితో ఎలా సంబంధం ఉన్నదో చెప్పగలం. మన స్వభావం ఎలాగ మారుతుందో గుణాల బట్టి చెప్పవచ్చు. అవి స్తబ్దంగా ఉండేవి కావు. గీత మన వ్యక్తిత్వం క్రింద ఎటువంటి శక్తులు ఉన్నాయో చెప్పడం, ఒక ఆదర్శమైన వ్యక్తిగా మనం మనలను మలచుకోడానికి.

మనం ఒక దృఢమైన మూసలో, పెరుగుదల లేకుండా, లేము. మనము నిజంగా తలచుకుంటే మనను మార్చుకోవచ్చు. కానీ దానికి ఒక మంచి సంకల్పం కలగాలి. అవసరమైతే మన పరిస్థితి బట్టి ఎదురీత ఈదాలి. మొదట తమస్ ని రజస్ గా మార్చుకోవాలి. అనగా జడత్వాన్ని ఉత్సాహపూరితంగా, శక్తిమంతంగా మార్చాలి. రజస్ అనగా: మనలో ఉన్న భయం, కోపం, ఆశ మొదలైనవి. వాటిని తగినట్లుగా నియంత్రించి జడంగా ఉన్న వ్యక్తిత్వాన్ని మేల్కొలిపి ఉన్నత మైన స్థితికి చేరవచ్చు. మన లక్ష్యాన్ని సాధించడానికి అది తోడ్పడుతుంది.

ఇక్కడితో అయిపోలేదు. మనం రజస్ ను సత్త్వం గా మార్చగలగాలి. అతిశయముగాఉన్న శక్తిని నిస్వార్థ కర్మకై వినియోగించాలి. చివరిగా, అన్ని నియంత్రణలూ తీసి వేయాలంటే త్రిగుణాలను కూడా దాటి వెళ్ళాలి.

ఈ గుణాల పరిణామం ప్రాణం వల్ల సాధ్యం. భౌతిక శాస్త్రంలో ఎలాగైతే గుప్తంగా ఉన్న శక్తిని, చలన శక్తిగా మార్చి, తద్వారా విద్యుత్తును కలుగజేయవచ్చని చెప్పేరో, తమస్ ను కూడా రజస్ గా మార్చి తద్వారా సత్త్వ గుణాన్ని పొందవచ్చు. తమస్ ఘనీభవించిన గుప్త౦గా ఉన్న బలము. అది ఫ్రిడ్జ్ లో చాలా కాలముండి ఘనీభవించింది. అదలా కూర్చొని, ఎవరైనా మెల్కొలుపుతారా అని వేచి చూస్తోంది. ఘనీభవించిన నీరుని, మళ్ళీ ద్రవంగా మార్చవచ్చు. అలాగే తమస్ కరిగి రజస్ అవుతుంది. అది పరిగెత్తే నదిలాటిది. నది పదార్థాలను అతలాకుతలం చేసి, అవరోధాలని అధిగమించి, ఒక ప్రదేశాన్ను౦చి శరవేగంగా ఉంకో ప్రదేశానికి ఎలాగైతే ప్రవహిస్తుందో, రజస్ కూడా అలాగే శక్తివంతమైనది. కాని అది నది వరదగా మారినట్టు వినాశకారి అవుతుంది. సత్త్వమ్ రైలును నడపగల ఆవిరి వంటిది. రజస్, సత్త్వ గుణాల శక్తి, తమస్ లో గుప్తంగా ఉన్న శక్తివలననే. తమస్ ని కరిగించిన కొలదీ శక్తి ఉత్పన్నమౌతుంది.

తమస్ కరిగినికొద్దీ మన జీవితంలో ఎనలేని శక్తి వస్తుంది. దీనితో మన ధ్యాననికి పరీక్ష పెట్ట వచ్చు: ఎప్పుడైతే పనులు వాయిదా వేస్తున్నామో, మనం ధ్యానాన్ని పెంపొందించుకోవాలి. ధ్యానంలో భౌతికంగా , మానసికంగా అప్రమత్తంగా ఉండి మన కుటుంబానికి , సమాజానికి ఉపయోగపడే రీతిలో ఉండాలి. కష్టపడి పనిచేస్తే తమస్ నుండి ఉత్పన్నమైన శక్తిని ఉపయోగించుకోవచ్చు.

తెరెసా ఆఫ్ ఆవిలా ఇలా చెప్పేరు: "నిస్వార్థ సేవ ధ్యానం యొక్క చివరి లక్ష్యం. భగవంతుని నుండి మనకు అనుగ్రహింపబడినవి మన సేవలకు నిదర్శనం." మరొక పరీక్ష : "మన౦ మానవ కళ్యాణనికై నిస్వార్థంగా, ఏకాగ్రతతో పని చేస్తున్నామా లేదా?" కష్టపడి పని చేయడంతో సరిపోలేదు. రజస్ కు అవసరమైనా లేకున్నా మన ఆనందానికై పనులు చేయి౦చే సామర్థ్యం ఉంది. చాలా మంది నియంత్రించబడని రజస్ తో పనికిరాని, వ్యర్థమైన, ఇతరులకు హాని కలిగించే పనులు చేస్తారు.

వ్యాకులత చెడ్డ గుణం కాదు. తమస్ తో పోలిక చేస్తే అది మంచిదే. వ్యాకులత సూచించేది: "ధ్యానం నేర్చుకొని, అంతర్ముఖులము అవ్వాలి" . ఆ సూచనని పాటించని వారు ఊర్లు , దేశాలు, ఉద్యోగాలు, మారుతూ ఉంటారు. ఇది లోపలి శక్తులను వృధా చేయడమే. వ్యాకులత వల్ల ప్రపంచాన్నే మార్చేయాలి, లేదా ప్రపంచాన్ని ఒక వాహనంతో చుట్టేయాలి, మొదలైన ఎవరికీ ఉపయోగపడని, అహంకారాన్ని పోషించే, తన సాహసాన్ని ప్రదర్శించే వ్యర్థమైన కోర్కెలు కలుగుతాయి. అటువంట కోర్కెలు వచ్చినపుడు ధ్యానం చేయాలి. మనకున్న శక్తిని పోగుచేసి సత్త్వగుణంగా మార్చుకొంటే స్వర్గం ఎక్కడో లేదు, మన హృదయం లోనే ఉంది అని తెలుసుకొంటాము. 115

Friday, February 4, 2022

Eknath Gita Chapter 14 Sloka 2

14.2

మమ యోని ర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం

సంభవ స్సర్వభూతానాం తతో భవతి భారత

అర్జునా! గొప్పదియగు మాయ నాకు గర్భస్థానము . దానియందు నేను బీజరూపమున గర్భదానము చేయుదును. అందుచేత సర్వప్రాణుల ఉత్పత్తి కలుగుచున్నది

సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సంభవంతి యాః

తాసాo బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా

కౌన్తేయా! సర్వయోనులయందు జనించు రూపము లన్నిటికి ప్రకృతి తల్లి. నేను బీజప్రదానము చేయు తండ్రిని.

నిన్నటి రాత్రి టివి లో పసిఫిక్ సాల్మన్ అనబడే చేపల గురించి చూసాను. అవి అతి సాహసంగా తమ జీవిత చక్రాన్ని త్రిప్పుతాయి. వాటితో నేను తాదాత్మ్యం చెందేను. ఎక్కడో కొండల్లో పుట్టి, అవి నిర్మలమైన, తేటయిన నదీ జలాల్లో 6 ఇంచీలు పెరిగి పెద్దదవుతాయి. ఏదో శక్తి వాటిని ప్రేరణ చేస్తే సముద్రంవైపుగా, క్రొత్త పరిసరాలవైపుగా, తమ ప్రయాణాన్ని సాగిస్తాయి. అక్కడ నీరు నల్లగా, ఉప్పగా ఉంటుంది. ఇప్పటిదాకా వేర్పాటుగా ఉన్న ఆ చేపలు ఇప్పుడు అనేక జల జీవాల మధ్య బ్రతకాలి. కనిపించినదానిని తినాలా, వొదిలేయాలా లేక భయపడి వెనక్కి తగ్గాలా అన్న విషయాలు అవి నేర్చుకోవాలి. ఆ అనంతమైన సముద్రం వాటి విద్యాలయం. సముద్ర ఉపరితలంలో అలలు ఎగసిపడుతాయి. లోపలి కెరటాలు ఖండాలను దాటుకొని ప్రయాణం చేస్తాయి. అది అలా చూస్తున్నప్పుడు, నాకు గీత చెప్పిన "సంసార సాగరం" గుర్తుకు వచ్చింది.

సాల్మన్ తన నూతన పరిసరాలకు అలవాటు పడి కొన్ని రోజులు ఉంటుంది. అది తన రూపాన్ని, నా బెర్క్లీ విశ్వవిద్యాలయానికి ఇంటినుండి క్రొత్తగా వచ్చిన విద్యార్థులలాగ , కూడా మార్చుకొంటుంది. అది ఇప్పుడు ఒక ఉప్పునీటి చేప. హఠాత్తుగా, కారణం లేకుండా, దాని మదిలో ఒక సంచలనం కలుగుతుంది. వెనక్కి వెళ్ళడానికి సమయమిది అని నిశ్చయించుకొంటుంది

మిగతా కథ చాలా ఉర్రూతలూగిస్తుంది. ఆ చేప తను వచ్చిన నది వైపుకు వెళుతుంది. నదీ ప్రవాహానికి వ్యతిరేకంగా ఈత చేసి తను ఎక్కడైతే నిర్మలమైన నీటిలో పుట్టిందో అక్కడికి చేరుకొంటుంది. దీనిలో సహజంగా ఉన్నదేమీ లేనట్టుంది. ఇది ససేమిరా సులభం కాదు. అ చిన్న చేప ప్రతి అడుగు ఘర్షణతో ముందుకు సాగాలి. అది ప్రయాణం సాగిస్తున్న కొద్దీ శక్తిని పొందుతున్నట్టు అనిపిస్తుంది. అది తన కొండ ప్రదేశంలోని వేగంగా వచ్చే ప్రవాహానికి ఎదురీదుతూ, పైకి ఎగురుతూ, ఒక ప్రాణ జ్వాలలాగ ఉంటుంది. దానిని తన శరీరానికన్న ఎన్నో రెట్లు పెద్దదైన శుద్ధమైన శక్తి నడిపిస్తోంది. దానికి వేరే మనోభావం లేదు. తన గమ్యం చేరడమే దాని లక్ష్యం. "ఇది ఒక యుద్ధం" అనిపించింది. గీత మొదలు గుర్తు వచ్చింది. ఇది రణనాడి. యుద్ధం అనబడే నదీ ప్రవాహం, నది లాంటి జీవితం.

చివరకు అంతా అయిపోయింది. ఆ చేప ఆఖరి జలపాతం దాటి, శుద్ధమైన నీటితో నిండిన కొండల మధ్యన ఉన్న కొలనులోకి ప్రవేశిస్తుంది. అక్కడ గుడ్లు పెట్టి తన శేష జీవితం గడుపుతుంది.

కొన్ని చేపలకి ఈ కథ ఇంకా సమాప్తం కాలేదు. అవి గుడ్లు పెట్టి సముద్రానికి తిరిగి వెళ్తాయి. మళ్ళీ ఎదురీత చేసి, ఇలాగ మూడు, నాల్గు సార్లు క్రిందకీ మీదకీ తిరుగుతాయి. బహుశా అవి సముద్రంలో ఉన్నప్పుడు తమ నది ఆవిర్భవన ప్రదేశాన్ని గుర్తుంచుకొని, మనకి చెప్తున్నదేమిటంటే: జీవికి ఒక ఆరంభం ఉంది. దాని వైపు వెళ్ళాలంటే యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో గెలిచే అవకాశం చాలా ఉంది.

ఆ టివి ప్రసారం ఒక గంట సేపే అయినా, పసిఫిక్ సాల్మన్ జీవితాన్ని పూర్తిగా వివరించబడినది. కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కు వెళితే హిందువులు, భౌద్ధులు చెప్పే పరిణామ సిద్ధాంతం అవగాహనకి వస్తుంది. జీవి అనేక జన్మలెత్తి, తక్కిన ప్రాణులను అధిగమించి, మానవుడుగా పుట్టి, తిరిగి తన పుట్టుటకు కారణమైన భగవంతుని చేరుకొనడానికి కొట్టుమిట్టాడుతాడు. 112