Saturday, November 27, 2021

Eknath Chapter 13 Sloka 12

13.12

సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోముఖ్యం

సర్వత శృతిముల్లోకే సర్వమావ్ఱుత్య తిష్టతి

ఆ ఆత్మ స్వరూపము యొక్క కాళ్ళు అంతటను గలవు. చేతులు అన్ని చోట్ల కలవు. నేత్రములు సర్వత్ర గలవు, శిరములు ముఖములు, చెవులు అంతట కలవు. అది సర్వత్ర వ్యాపించి యున్నది

సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం

అసక్తం సర్వభృచ్ఛఐవ నిర్గుణం గుణభోక్తృ చ

ఇంద్రియములు లేనిదియై యున్నది. దేనితోను సంగత్వము లేనిదియై సకలమును భరించుచున్నది. గుణరహితమయ్యును గుణములను అనుభవించుచున్నది

బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వా త్తదవిజ్ఞేయం దూరస్థo చాంతికే చ తత్

ప్రాణులు బాహ్యాభ్యoతరముల యందున్నది. చలించునది, చలించనిది యైయున్నది. సూక్ష్మమైనందున అగ్రాహ్యమై యున్నది . అది దూరముగను , దగ్గరగను యున్నది

నా పెంపుడు కుక్కలు నన్ను చూడడానికి, బిస్కట్ ముక్కల కోసం ప్రతి ఉదయం నా గది తలుపు దగ్గర కూర్చుంటాయి. నేను ధ్యానం నుంచి వచ్చేక వాటిని కుక్కలుగా చూడను. భగవంతుడు కుక్క వేషంలో వచ్చేడని తలుస్తాను. నా స్వానుభవాన్ని చేతనయింత వరకు వివరిస్తున్నాను. ఇది ఒక ఉపమానము కాదు. నేను నా దృష్టికి కలిగిన అనుభవాన్ని చెపుతున్నాను. అవి కర్ర ముక్కతో ఆడుకొంటూ ఉంటే సాక్షాత్తూ శ్రీకృష్ణుడు ఆడుకొంటున్నాడు అని తలుస్తాను. అది ఆయన లీలతో పోలిస్తే అతి తక్కువే. ఈ సృష్టి అంతా దేవుడు ఆడుకునే రంగస్థలం. ఆయన అన్ని పాత్రలను పోషిస్తాడు: నా కుక్కలు కర్ర ముక్క తో ఆడుకొంటున్నట్టుగా, నా ఇంటి ప్రక్క వారి పిల్లలు వాటి వైపు కర్ర ముక్కను విసురుతున్నట్టుగా. ఆ పాత్రలకు వేరువేరు లక్ష్యాలు ఉన్నాయి. వసంత ఋతువులో వికసించే లైలెక్ పువ్వులు నా కిటికీ దగ్గర ఉన్నాయి. యోగులు "చుట్టూ చూడు. ప్రపంచమంతటా దేవుడున్నాడు" అంటారు.

ఈ దృష్టితో చూస్తే కాంతి వైపు పెరిగే మొక్కల్లాగ, ప్రాణులు పరిణామ క్రమములో దేవునివైపు వృద్ధి చెందుతున్నారు. ఈ ప్రపంచమంతా సూర్య కాంతి వైపు వంగే మొక్కల్లాగ, భగవంతుడి వైపు వంగే జీవులతో నిండి ఉన్నది. నా కుక్క మూకా నా ధ్యానం అయిన తరువాత నాతో మనిషి చేసే శబ్దాలతో మాట్లాడుతుంది. ఉదాహరణకు ఓం . అది నాతో "నేనూ నీలాగా మనిషిగా ఉండాలని ఎంతో కోరుకుంటున్నాను" అంటునట్టు ఉంటుంది. నేను ధ్యానం చేస్తే దానికీ అదే చేయాలని ఉంటుంది. ఇదే పరిణామానికి ఉన్న శక్తి. మూక తన లక్ష్యం చేరడానికి, పరిణామం చెందడానికి ఆ శక్తి సహకరిస్తుంది. అటువంటి ఐక్య కోరికతో నాకు మూకా మరుజన్మలో ఒక ఆశ్రమంలో మనిషిగా పుడుతుందని అనిపిస్తుంది. దేవుని వైపు ఈ విధంగా జీవులన్నీ నడుస్తున్నాయి.

అటువంటి దృష్టి దేవుని కృప వల్లే సాధ్యం. శ్రీ రామకృష్ణులు చెప్పినట్లు "దేవ మాత బ్రయన్ (అనబడే వ్యక్తి) కి అట్టి దృష్టి ఇవ్వాలి". ఆమే తన అందమైన కళ్ళతో క్రీగంటగా చూసి వానికి ప్రపంచ సుఖములుకన్న హృదయంలో దేవునికొరకై మిక్కిలి తపన కలిగిస్తుంది. మన అందరి హృదయాల్లో అటువంటి కోరిక గుప్తంగా వసంత ఋతువు కై వేచి వున్న విత్తులా ఉంది. ఆ తరువాత బ్రయన్ స్వార్థ పూరిత క్రియలు చేసినా, లేదా ఏమాత్రం జంకి వెనకంజ వేసినా ఆమె శక్తి ముందుకు లాగుతుంది. ఎలాగంటే వాని కోర్కెను ప్రజ్వలింప జేసి, లేదా లక్ష్యాన్ని గుర్తు చేసే కష్టాలు ఇస్తుంది. ఇటువంటి దృష్టిని కలిగినవారు ఆ పరాశక్తి ఉందని చెప్తారు. ఎవరైతే మనసా వాచా కర్మా ఆ పరాశక్తికై తపిస్తారో వాళ్ళు దాన్నే పొందుతారు. 86

Sunday, November 21, 2021

Eknath Chapter 13 Sloka 11

13.10

జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృత మశ్నుతే

అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాస దుచ్యతే

దేనిని తెలుసుకొనుటవలన మోక్షము కలుగునో ఏది ఆదిలేని పరబ్రహ్మమో, దేనిని సత్తనిగాని, అసత్తని చెప్పలేమో అటువంటి జ్ఞేయమును చెప్పుచున్నాను

ఆధ్యాత్మిక చింతనాలక్ష్యం మరణించిన పిదప ఏమౌతుందో విశ్లేషించడం. అది చేయటం సాధ్యం. అది చేయ బడినది. ఎలా అంటే ఉనికిని శరీరముతో విడదీసి.

కఠ ఉపనిషత్ లో నాచికేతుడు యమధర్మరాజును ఒక ప్రశ్నని అడిగేడు. ఈ ప్రశ్నని ఎప్పుడో ఒకప్పుడు మనమూ అడిగే ఉంటాము. ఒక మనిషి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు? నాచికేతుడు "కొందరంటారు మరణించినవాడు ఎక్కడో బ్రతికి ఉంటాడు. ఇంకొందరు అతడు మాయ మౌతాడు అంటారు. అక్కడితో పరిసమాప్తం. ఓ ధర్మరాజా నాకు విడమరచి చెప్పు. నేనిది తప్పక తెలుసుకోవాలి." అని అడిగేడు.

నాకు ముగ్గురు మిత్రులు ఉన్నారు. వారు జియో డెసిక్ డోం (Geodesic Dome) అనబడే ఇంట్లో ఉంటారు. ఇది భూగోళం చుట్టూ ఉన్న వాయువుకు (Atmosphere) నిదర్శనం. వాళ్ళు రోజూ పనికి వెళతారు. సాయంత్రం డోం కి తిరిగి వస్తారు. ఒకరోజు వాళ్ళు ఇంటినుండి బయటకు వెళ్లకూడదని నిర్ణయించేరని అనుకుందాం. ఏవరో వాళ్ళకి కావలిసిన సరుకులు తెచ్చి, వాళ్ళ చెత్తని ఊడుస్తారు అనుకుందాం. వాళ్ళు దానికి అలవాటుపడిపోతారు. కొన్నాళ్ళకు వాళ్ళు బయట ప్రపంచాన్ని మరచిపోతారు. వాళ్ళ కార్లను, కార్ నడపడం మరచిపోతారు. బయట ఉన్న ప్రదేశం, పైన్ వృక్షాల గురించి కూడా వాళ్ళ స్మృతి కిరావు. వాళ్ళ ధ్యాస ఎప్పుడూ ఇంటి గురించే. వాళ్ళ పుస్తకాలకు, పాత పత్రికలకు, ఫోటో లకు, రోజూ వారి పత్రికలకు అంకితమైపోతారు. వాళ్ళ నీళ్ళ గొట్టాలు నీరు కారుతున్నా పట్టించుకోరు. మీద తిరుగుతున్న సాలీడులను చూడరు. వాళ్ళని సాన్ ఫ్రాన్ సిస్కో గురించి అడిగితే తెలీదంటారు. ఆ పట్టణం ఒక కలలా ఉంటుంది. "నాకు తెలీదు" అంటారు. చివరకి "ఏ పట్టణం లేదు. సాన్ ఫ్రాన్ సిస్కో నిజానికి లేదు. బయట ప్రపంచం ఉందని చెప్పటానికి ఆధారమేమిటి?" అని పైపెచ్చు అడుగుతారు.

మనమెక్కడి నుంచి వచ్చేమో మరచిపోయామా? మనమందరము వసుదైక కుటుంబమని, ఒకే భగవంతుని బిడ్డలమని మరచేమా? మనం భగవంతుని దగ్గిరకి తిరిగివెళ్ళ వలసిన వారలమని మారిచిపోయామా? మనం ప్రపంచ ధ్యాసలో పడిపోయేం. యుగయుగాలుగా ఈ ప్రపంచంలో ఎన్నో జన్మలెత్తి స్వార్థ పూరిత నడవడికతో, మన వేర్పాటుతో, మనకదేమి గుర్తుకు రావటంలేదు. నిజానికి దాన్ని మనం ఖండిస్తాము. జీవులపై పరిశోధన చేసే శాస్త్రజ్ఞులు నాచికేతుని ప్రశ్నకు ఇలా సమాధానమిస్తారు: "మనిషి మరణించిన తరువాత వాని జీవితం పరిసమాప్తమైపోయింది. అదే చివరి జన్మ." యమధర్మరాజు దానికి ఒప్పుకోడు. నా మిత్రులు బయట ప్రపంచముందని ఆధారం ఏమిటంటే నేను "మీ డోం తలుపులు తెరవండి. బయటకు వెళ్ళి చుట్టూ చూడండి. నాకు మీరు చూసిందేమిటో చెప్పండి" అంటాను. "నేను తలుపులు తియ్యను. ఎందుకు తీయాలి? బయట ఏమీ లేదు" అని అనవచ్చు. వాళ్ళు బయటకే వెళితే మళ్ళీ ప్రపంచం అనుభవంలోకి వస్తుంది. మనము ధ్యానముతో మన అహంకార పూరిత వ్యక్తిత్వం వదులుకుంటే, మనమేవరో తెలుసుకొంటాము. మనం శాశ్వతమైన, మరణములేని తాత్వికత అనబడే భగవంతుని గుర్తు తెచ్చుకుంటాము.

Saturday, November 13, 2021

Eknath Chapter 13 Sloka 10

13.9

మయి చానన్యయోగేన భక్తి రవ్యభిచారిణీ

వివిక్త దేశ సేవిత్వం అరతి ర్జనసంసది

నాయందు అనన్యమైన అచంచల భక్తిని కలిగియుండుట , ఏకాంతవాసము చేయుట, జనసమూహమునందు ప్రీతి లేకుండుట మరియు

ఆధ్యాత్మ జ్ఞానవిత్యత్వం తత్త్వ జ్ఞానార్థదర్శనం

ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యథా

ఆత్మ జ్ఞానము నందు స్థిరత్వము, తత్త్వజ్ఞానము కొరకు శాస్త్రావలోకనము ఇది అంతయు జ్ఞానమని చెప్పబడినది. దీని కంటెను అన్యమైన దంతయు అజ్ఞానము

ముందు చెప్పిన శ్లోకాలు వలె ఇక్కడ కూడా వైరాగ్యం పొందే పద్దతి, దాని గమ్యం చెప్పబడుచున్నది.

మన మెప్పుడైతే అనుభవంతో భగవంతుడు మనయందే ఉన్నాడని తెలుసుకొంటామో, తక్కినదంతా అస్థిరముగా చూస్తాము. మనము భూమి మీద సేవ కోసం ఉన్నాము. ఏ శక్తీ మనను స్వార్థపూరితమైన బంధం వైపు ఆకర్షింపలేదు. కొందరు నన్నడిగే వారు: "మీరు దేనికైనా ఆకర్షింపబడతారా?" నా సమాధానము "ఎవరి ద్వారా?". మన ప్రతి అణువులోనూ అపరిమిత ఆనందం ఉన్నప్పుడు, చాకలేట్ ట్రఫుల్ మీద మనస్సు ఎందుకు పోతుంది? నాకు ట్రఫుల్ అంటే ఇష్టం లేక కాదు. ఆత్మ జ్ఞానం వల్ల కలిగే ఆనందంతో పోలిస్తే ఇంద్రియముల ద్వారా వచ్చే సుఖం దిగతుడుపే.

ఇది సమాధి వలన పొందే ఫలం. సాధన మార్గము అనేకమైన విఘ్నములతో కూడినది. మనము సాధనలో ముందుకెళుతున్న కొద్దీ అవి తగ్గు తాయి. కాని అవి మన సాధనికి అంతరాయం ఎందుకంటే మనలోని ఘనీభవించిన కోరికలు. మనము ఆత్మ జ్ఞానం పొందుటకు విపరీతమైన కృషి చేయాలి. అదే మన లక్ష్యం. వ్యక్తిత్వం సాధనతో మార్చు కోవడం చాలా కష్టం. అందుకే సాధనని చిన్న చూపు చూసి, మిగతా వాటికి పెద్ద పీఠం వేయకూడదు.

అలాగని మనం వేరే క్రియలు చేయరాదని నిషేధం లేదు. సంస్కృతంలో భూగోళం ని కర్మ భూమి అంటారు. కర్మ అంటే క్రియ. భూమి క్రియలతో నిండినది. క్రియలు చేసే ప్రపంచం కర్మ ప్రపంచం. ఇతరులతో సామరస్యంగా పనిచేయడం ఆధ్యాత్మిక జీవనానికి చాలా ముఖ్యం. అది ఒక విధంగా తప్పనిసరి. మనం మనకన్నా వేరైన వారితో జీవిస్తూ పనిచేస్తూ ఉండకపోతే మనం ఏ విధంగా పాత కష్టాలు, తప్పులు సరి దిద్దుకొంటాం? మనం జీవితంలో ఉత్సాహంగా లేకపోతే -- ముఖ్యంగా కష్టాలెదురైనప్పుడు -- మనకు ధైర్యముతో, ఓర్పుతో, దయతో, గౌరవముతో కష్టాలని అధిగమించడం ఎలా సాధ్యం? వీటన్నిటికీ మూలం దేవుడు సర్వ జీవులలో ఉన్నాడనే జ్ఞానం. అదే భూమిమీద పుట్టినందుకు కారణం.

మొదట్లో సాధన ప్రారంభించినపుడు మన రోజూవారీ చేసే క్రియలనుండి మార్పు తప్పదు. పాత మిత్రులు మన నూతన స్వభావమువల్ల దూరమౌతారు. ఒకరు సోమర్ సెట్ మౌమ్ ని ఇలా అడిగేరు: "పాత మిత్రలను మారిచిపోవాలా?" ఆమె నిర్లిప్తంగా "కొన్నిసార్లు తప్పదు" అని సమాధానం ఇచ్చేరు. జీవితాన్ని పునరుద్దరించడానికి మన పాత మిత్రులను, జీవన శైలిని మార్చుకోవాలి. మొదట్లో ఇది బాధాకరంగా ఉంటుంది. రాను రాను మనం పాత మిత్రులను కలిసినపుడు గ్రుడ్డివాడికి గ్రుడ్డివాడు దారి చూపిస్తున్నట్టు లా కాక, మనం వాళ్ళ హృదయాలలో వెలుగు నింపుతాము.

భారతదేశంలో గుర్రం బగ్గీలు ఇంకా వాడకంలో ఉన్నాయి. వాటిని నడిపేవాడు గుర్రం జన సమూహాన్నిగాని, ఇతర వాహనాలను గానీ చూసి బెదరకుండా కళ్ళకి గంతలు కడతాడు. అలాగే సాధకులకు కూడా గంతలు ఉన్నాయి. ఒకటి వైరాగ్యం. అంటే శరీరం, ఇంద్రియాలు, మనస్సుతో తాదాత్మ్యం చెందకుండుట. రెండవది వివేకము. అంటే అన్ని క్రియల్లోనూ మాటిమాటికి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకోవడం. లక్ష్యం లేక, మన ఇంద్రియాల చెప్పు చేతలలో ఉంటే మనం గంతలు లేని గుర్రాలలాగా చూసే, విన్న వానితో తికమకపడి ఏ దిక్కoటే ఆ దిక్కుకు పోతాం.

సాధకులుగా మనము విప్లవాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి ఎంతో శాంతంగా ఉన్న మన మనస్సును ఉసిగొల్పుతాయి. అలాగే ప్రసార మాధ్యాలకు దూరంగా ఉండాలి. ఇది సాధన ఉపక్రమించినప్పుడే కాదు. అన్ని వేళలా. మన పూర్వీకులకు ఈ బెడద ఉండేది కాదు. మనం 21 వ శతాబ్దం వాళ్ళము కాబట్టి వీటిగురించి అప్రమత్తతో ఉండాలి. టివి లోని చిత్రాలు, మాటలు మనను ప్రభావితం చేస్తాయి. అలాగే చలన చిత్రాలు , సినిమా పాటలు కూడా. అవి మనకి తెలియకుండా మన అచేతన మనస్సును ఆక్రమించుకొంటాయి. నేనొక విత్తనాల జాబితాలో ఇలా చూసేను: "మా విత్తనాలు తప్పకుండా పెరుగుతాయి." ప్రసార మాధ్యాల విత్తనాలు కూడా తప్పక పెరుగుతాయి. మనము ఇది ధ్యానం మొదలెట్టిన చాలా కాలం అయినప్పుడు -- ఎప్పుడైతే మనం స్పృహ లేక చుట్టూ చూస్తున్నప్పుడు-- తెలుస్తుంది. ప్రసార మాధ్యమనే కలుపు మొక్కలను వేళ్ళతో పెకళించాలి. అది మనమనుకొంటున్నంత సులభము కాదు.

నేను సాధన గూర్చి భారతదేశంలో చూసిన రైలు బండ్లను ఉపమానముగా తీసికొని చెప్తాను. మనం ధ్యానం మొదట్లో ప్యాసింజర్ బండిలా అనగా నెమ్మదిగా ఉంటాము. మనము మద్రాసు స్టేషన్ నుంచి బయలదేరేము. మన గమ్యం 2 వేల మైళ్ళు దూరం ఉన్న హిమాలయాలు. ప్యాసింజర్ రైలు ప్రతీ స్టేషన్ లోనూ ఆగాలి. అనేకమైన ఎక్కి దిగే ప్రయాణీకులు ఉంటారు. దానికి తోడు తినుబండారాలు అమ్మేవాళ్ళూ ఉంటారు. అలాగే కొందరు సాధకులు అన్ని బాధ్యతలను నిర్వహించేక ధ్యానం మొదలపెడదామని అనుకొంటారు. అలాంటివాళ్ళు ప్యాసింజర్ బండిలో ప్రయాణీకుల్లా ప్రతి స్టేషన్ లో దిగి, చుట్టూ చూసి మళ్ళీ బండి ఎక్కుతారు. సూర్యాస్త సమయంలో ఎక్కడో పల్లెటూరు స్టేషన్ లోనే తమ గమ్యానికి వందల మైళ్ళ దూరంలో ఉంటారు. చీకటి పడ్డాక, ఇక వాళ్ళు గమ్యం చేరినట్టే !

ప్యాసింజర్ రైలు లాగా, అలాంటి సాధకుడు తన గమ్యాన్ని ఎప్పుడో ఒక రోజు చేరుకొంటాడు. కానీ దానికి ఎన్నో జన్మలు ఎత్త వలసి ఉంటుంది. మనం బండిలా పట్టాల మీద ఉండి ముందుకు దూసుకుపోతున్నా ఎంతో దూరం వెళ్ళ వలసి ఉంది. ప్రయాణం చివరలో ఎంతో నిటారుగా ఉన్న కొండనెక్కాలి. ఇలాంటి పరిస్థితిలో ఒక మనిషికి ప్రతి వీధిని చూసి గమ్యం చేరుకోడానికి కావలసిన ఇంధనం ఒక జీవిత కాలంలో ఉండదు. మనకి వెయ్యేళ్ళు ఆయుష్షు ఉంటే అది సాధ్యమేమో. మనం జీవితాన్ని ఆటగా చేసికొని ప్రతి చిన్న విషయాన్ని అనుభవించవచ్చు. అలా చేసినా మన గమ్యం చేరుకోవచ్చు. కానీ వంద ఏళ్ళు ఆయుష్షు సరిపోదు. వృద్దాప్యం, బాల్యం ల వల్ల పూర్తిగా వంద ఏళ్ళు కూడా లేవు. మనకు రోడ్ల ప్రక్కన జరుగుతున్న జంతర్ మంతర్ చూడడానికి సమయం లేదు. టిబెట్ వాస్తవ్యుడు మిలెరెప ఇలా అన్నారు: "ప్రపంచ విషయాలు అలా ఉంటూనే ఉంటాయి. ధ్యానం మొదలు పెట్టడానికి ఆలస్యం చేయద్దు."

ఇప్పుడు ఎక్స్ ప్రెస్ బండి పరిస్థితి చూద్దాం. నేను భారతదేశంలో ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ ఉదయాన్నే మద్రాసు స్టేషన్ నుంచి వెయ్యి మైళ్ళ దూరాన దేశం నడుమనున్న నాగ్ పూర్ పట్టణానికి వెళ్ళేది. అది ముఖ్యమైన స్టేషన్ లలోనే ఆగేది. ఆ రోజుల్లో హిమాలయ అంచుల్లో ఉన్న సిమ్లాకి ప్రయాణమైన వాళ్ళు మద్రాసు నుంచి ఎక్స్ ప్రెస్ బళ్ళు ఎక్కి రెండు మూడు రోజుల్లో గమ్యం చేరేవారు. ఇది రెండవ కోవకు చెందిన సాధకునికి ఉపమానము. మనందరికీ అట్టి సామర్థ్యం ఉంది. అటువంటి సాధకుడు జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. అతని స్వంత ఊరిలో అతని ఆగడాల గురించి ఇంకా చెప్పుకునే వారు వుండవచ్చు. అయినప్పటికీ అతను ధ్యానం, ఆధ్యాత్మిక కార్యాలు సహృదయంగా చేస్తే రామ బాణంలా ముందుకు సాగుతాడు. 83

Sunday, November 7, 2021

Eknath Chapter 13 Sloka 9

13.8

ఆసక్తి రస భిష్వంగః పుత్రదారగృహాదీషు

నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు

సంగము లేకుండుట , పుత్రుడు, భార్య, ఇల్లు మొదలగు వానియందు అభిమానము లేకుండుట, ఇష్టాయిష్టముల యందు సమ బుద్ధిని కలిగి యుండుట మరియు

మనమమిప్పుడు మన అనుబంధాల గూర్చి తెలుసుకొంటాం. వైరాగ్యం గూర్చి ఈ సంధర్భంలో చెప్పుకొంటాం. దాని నుండి పొందే మంచి గురించి తెలుసుకొంటాం.

ఒకసారి నేను 3 ఏళ్ల మిత్రుని వద్దకు వెళ్లి గౌరవంతో అడిగేను "లోరీ ఎలా ఉన్నావు?"

"నువ్వు నానుండి దూరంగా వుండు. నాకు నిద్ర సరిపోలేదు" అన్నది.

నేను ఆమెతో చాలా ఆప్యాయంగా ఉన్నాను. ఆమె జుట్టుని, దుస్తులని, పొగిడేను. ఆమె ఏమి తిన్నాదో అడిగేను. తెలివైనవాడెవ్వడూ మూడేళ్ళ బిడ్డని ప్రేరేపించడు. నేనేమి అడిగినా దానికి ఆమె తల వూపింది.

మూడేళ్ళ బిడ్డల నడవడిక సరిగ్గా లేకపోతే అది పట్టించుకోవలసిన విషయమేమీ కాదు. ముఖ్యంగా మనని అంకుల్ అనేవాళ్లు. కానీ పెద్దవాళ్ళు ఇలా మాట్లాడితే అది వేరే విషయం. "నేను 4 గంటలే పడుకున్నాను. కాబట్టి ఏమీ మాట్లాడకు" లేదా "నేను ఆకలితో ఉన్నాను. నాకు నా ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు. తిన్న తరువాత నాతో మాట్లాడు" అని పెద్దవాళ్ళంటే ఆశ్చర్య పడవలసిన విషయం. కానీ కొన్ని సార్లు మనం ఒప్పుకోకపోయినా అలాగే ప్రవర్తిస్తాం. ఈమధ్య ఒక రాజకీయ తంత్రం గురించి విన్నా. మంచి రాజ భోజనం తిన్న తరువాత మంతనాలు చేయాలట. ఎందుకంటే మద్యం, భోజనం, మన సంభాషణని మెరుగు పరుస్తాయట.

మన మెప్పుడైతే మనస్సు కాదని, కాని దాన్ని నడిపేవారలమని, తెలుసుకొంటామో మన మనస్థితినుండి వైరాగ్యం పొందుతాము. మన మనస్సుకేదైనా అయితే, అది ఒక యంత్రం కాబట్టి, సరి చేసుకోవచ్చు. ఎవరైనా మనన్ని ఖండిస్తే -- నిద్ర సరిపోకపోయినా, తలనొప్పి వున్నా-- మనం కోపం చెందుతాం. కాని అది మన ఇతరులను ప్రేమించే, గౌరవించే వైఖరి మార్చదు. మన సంభందితుల మీద ఆ మంచి ప్రభావం చూడవచ్చు.

మనస్థితుల నుండి విడబడడం నేర్చుకుంటే మనం మనస్సు కాదని భావిస్తాం. అలాగే మనం మన అభిప్రాయాలూ కాము. దీన్నే బుద్ధి అంటారు. అంటే మన ఉన్నతమైన మనోస్థితిని కూడా అధిగమించడం.

మనముండే కాలంలో నకిలీ మేధ(pseudo intellectual) చాలా ఉంది. ఇలాంటి వాతావరణంలో వైరాగ్యం అంత సులభంగా వచ్చేది కాదు. చాలా మంది తమ అభిప్రాయాలతో తాదాత్మ్యం చెందుతారు. విశ్వవిద్యాలయోల్లో కూడా చాలామంది మేధావులు తమ అభిప్రాయాలనుండి విడబడలేక "ఈ అభిప్రాయం అంత మ౦చిది కాదు. దాన్ని మార్చుకొంటాను" అని అనరు. "ఈ అభిప్రాయం అంత మంచిది కాదు" అని అనలేక "ఇది నా అభిప్రాయం. దీన్ని ఎలా మార్చుకొంటాను?" అంటారు. ఈ తర్కం అర్థం కాదు. మనమెప్పుడైతే మనం మేధాశక్తి కామని తెలుసుకొంటామో -- నమ్మడమేకాదు, దాన్ని అనుభవానికి తెచ్చుకొంటామో -- మన ప్రతిపక్ష అభిప్రాయాలను మిక్కిలి ఆసక్తితో, భద్రతతో వింటాము. మనం ఇంకొకరి అభిప్రాయం మన దానికన్నా మంచిదనుకొంటే --మనం మన అభిప్రాయాన్ని 20 ఏళ్ల నుంచి ఉంచుకున్నా -- "ఎక్కడ చెత్త బుట్ట? దానిలో నా అభిప్రాయాన్ని పారేసి, నీ అభిప్రాయాన్ని సమర్థిస్తాను" అనగలగాలి.

ధ్యానంలో ప్రవేశించి కొన్నేళ్ళు అయితే మనస్సుని ఒక పని ముట్టుగా చూస్తాం. అది వాక్యూమ్ క్లీనర్ లాగ పెద్ద శబ్దం చేస్తుంది కాని ఇల్లు శుభ్రం చేస్తుంది. నా చిన్న పిల్లలు వాక్యూమ్ క్లీనర్ వాడుతూ ఉండగా చూసేను. వాళ్ళు ఎలాగో గొట్టాన్ని తిరగామరగా పెట్టి, ఇల్లంతా దుమ్ముతోనూ, కాగితాల తోను చిందరవందర చేసేరు. మనం మనస్సునిలాగే వాడుతాం. మన ఇష్టాయిష్టాలు మన వద్దకు వచ్చిన వారి మీద వెదజల్లుతాం. మనస్సుని సక్రమంగా వాడితే మనం చెత్తని ప్రోగుచేసి బయట పారేస్తాం. ఇదే ధ్యానమంటే: "మనస్సుతో మనస్సుని శుద్ధి చేసుకోవటం. ఇంకోవిధంగా చెప్పాలంటే ఉన్నతమైన మనస్సుతో క్రింద మనస్సుని శుభ్రం చేయడం."

నా స్వీయానుభవముతో, మనస్థితి నుండి , అభిప్రాయాలనుండి విడబడడానికి నేనొక ఒక మంచి ప్రక్రియ చెబుతాను: ఇష్టాయిష్టాలను తక్కువ చేసుకోండి. అవి బాంధవ్యాలు లోనే కాక అన్నిట్లోనూ. హేతుబద్ధం చేయాలంటే, మన ప్రతి ఇష్టం లేదా అయిష్టం అహంకారంకు సంభందించినవి. అది ఈ విధంగా తన తెలివిని ప్రదర్శిస్తుంది.

సాంఖ్యులు మనస్సు ఎలా పనిచేస్తుందన్న విషయం పై చెప్పేది మన అహంకారానికి వర్తిస్తుంది. సంస్కృతంలో చైతన్యాన్ని చిత్తమంటారు. మనం దాన్ని రూపంలేనిది విరగనిది, అఖండమైనది, ఆకారం లేనిది, పరిమాణం లేని బంక మన్నుగా భావించవచ్చు. మనమీ బంకమన్నుని మనం ఏమి ఇష్టపడతామో, ఏ కలలో కంటామో, ఏది ఊహించుకుంటామో దాని కనుగుణంగా చెట్లు, పక్షులు, బొమ్మలు, మనుష్యులు, కోపం, దయ లేదా బాధగా మార్చుకోవచ్చు. అనేకమార్లు పాత ఆలోచనలతో పునరుక్తి చేస్తే మన చిత్తాన్ని మేడమ్ టుస్సాద్ వాక్స్ వస్తుప్రదర్శనశాలగా చేసినవారమవుతాం. మన సంభందితులందరూ మనస్సులో వాళ్ళతో సాంగత్యం బట్టి కొలువై ఉంటారు. తలిదండ్రులు, భార్య లేదా భర్త, పిల్లలు, అత్త జోసీ , మన ఆఫీస్ లోని సహోద్యోగులు, మన పెంపుడు కుక్క. ఒకటేమిటి అన్నీ మన మనస్సులో దాగి ఉన్నాయి. మనం ఊహించుకున్న అత్త జోసీ బాహ్యంగా ఎవరికీ వర్తింపక పోవచ్చు. అత్త జోసీ మనం వేసుకొన్న ఒకానొక చిత్రం. మనమావిడితో తగువు పడితే, మనము మన వస్తుప్రదర్శనశాలకు వెళ్ళి ఒక కోర అంటిస్తాము. "నేను వాళ్ళను ఎలా భావిస్తానో అలాగే చూస్తాను" అని అంటుంది మనస్సు. శ్రీకృష్ణుడు తల అడ్డంగా ఊపి: "నువ్వు వాళ్ళని ఎలా మనస్సులో తయారు చేసేవో అలాగ చూస్తున్నావు" అంటాడు. మనం గ్రహించే ప్రతి విషయం, ప్రతి అనుభవం చిత్తం మీద ఆధారపడే చైతన్యం వల్లనే. అవి మనం జీవితాన్ని ఎలా చూస్తామో నియంత్రిస్తాయి. కాబట్టి అవి మన స్పందనను తమ ఆధీనంలో ఉంచుకొంటాయి.

ఎప్పుడైతే క్రోధం, భయం, దురాశ ఆ బంకమన్నును ధృడమైన ఆకారాలుగా మారుస్తాయో దాన్ని ఖండించడం చాలా కష్టం. "నా తప్పులు నాకు తెలుసు" అని కొందరు జాలిగొలిపేలా అంటారు. "నాకు తెలుసు నాతో సహజీవనం చేయడం మిక్కిలి కష్టం. కానీ నేను మారలేను." ప్రతివొక్కరు ధ్యానంతో మార గలరు. మనము మనుష్యుల మీద చేతనంతో వేసే దృఢమైన బంకమన్నుతో చేసిన శకలాలను మళ్ళీ క్రొత్త, సాగుతూన్న బంకమన్నుగా మార్చవచ్చు. చిత్తాన్ని బంకమన్నులాగా సాగదీయగలం. దాన్ని అలా స్పందింపజేయగలం. మనం దయ, ఓర్పు, సత్సంభందం, ధైర్యం అనే అందమైన క్రొత్త వస్తువులను తయారు చేసుకోగలం. పనితనం మారలేదు. మునుపు వినాశనానికి హేతువైన చేతనం ఉండేది. ఇప్పుడు సృజనాత్మక శక్తితో మనకూ మన తోటివారకూ ఉపయోగపడే ఆకారాల్ని చేస్తున్నాం.

అనేక మానసిక సంక్షోభాలు తుచ్ఛమైన ఇష్టాయిష్టాల వల్ల కలుగుతాయి. వాటిని పెద్దవిగా చూసి: "నాకిది కావాలి. కాని నాకది సాధ్యం కాదు" లేదా "నాకిది నచ్చదు. కాని వొదిలించికోను" అనుకోవడం. కానీ వీటితో సరిపెట్టకోనక్కరలేదు. అదే శ్రీకృష్ణుడు చెప్పిన "సమస్థితి" లోనున్న మనస్సు. మన ఇష్టాయిష్టాలను తక్కువగా చూసుకోవాలి. అలా చేస్తే మన సంబంధాలు మెరుగు పడతాయి.

మనం చేసే ఉద్యోగంలో గాని, లేదా కార్యంలోగాని, అతి సూక్ష్మమైన క్రియలు చేయాలని ఉండదు కానీ చేయక తప్పదు. కోటికి ఒక్కడు "నా ఉద్యోగం నాకు నచ్చదు. కానీ చేయక తప్పదు" అంటాడు. మన అంతర్యామి చెప్పవలసింది ఇంతే: "నేను ఇది చేయలేను. నేను స్టాంపులు నాలుకతో తడిపి పని చేయలేను. ఇంకా మాబెల్ ప్రక్కన నాకు పనిచేయడం ఇష్టంలేదు." మనం "అలాగే, నీ ఇష్టం" అంటాము. అంతర్యామి కాలక్రమేణా పెద్దదై, ధైర్యంతో కూడినది అవుతుంది. ఆ తరువాత అది సంప్రదాయం పాటించదు. అది "మాబెల్ గుర్తుందా?" అంటుంది. మనం "నీ ఇష్టం, పో " అంటాము. చివరకు అది అహంకారపూరితమై "ఇక మర్చిపో" అంటుంది.

మనమిలాగ అంతర్యామిని తన ఇష్టం వచ్చినట్టు ప్రతి ఇష్టాయిష్టాలను ప్రదర్శనీయనిస్తే మనం కఠిన మవుతాము. కొన్ని పరిస్థితుల వల్ల మనం ఇతరులకు తలవొంచితే మన అంతర్యామి నరాల వ్యవస్థను చిందరవందర చేసి "నేను తల వంచను. నేను అఖండమైన ఎముకతో చేయబడ్డాను. నేను వంగలేను" అంటుంది. మొదట్లో ఈ ఆక్షేపణ మనస్సుకే పరిమితం. క్రమంగా మనస్సుకి శరీరానికి లోతుగా ఉన్న సంబంధం వల్ల శరీరం మీద తన ప్రభావం చూపుతుంది. పట్టుదలతో అంతర్యామిని వింటూ ఉన్నవాళ్ళకి అనేకములైన మానసిక, భౌతిక సమస్యలు వస్తాయి. అసహనీయత, తలనొప్పి, మొదలైనవి బాధిస్తాయి. వాళ్ళ అహంకారమునకు వ్యతిరేకంగా వెళితే వాళ్ళు తమ ఇష్టాయిష్టాలను చెప్పుకోలేరు, శ్వాస క్రమం తప్పుతుంది, రక్తపోటు అధికమౌతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. హాన్స్ సెల్యే అనే వైద్యుడు ఇలా చెప్పేరు: "ఒత్తిడి మానసిక వ్యాకులతకు దారి తీస్తుంది". మొదట మనస్సుకు వ్యాపిస్తుంది. మనం దాన్ని గాని నియంత్రించకపోతే తీవ్ర దీర్ఘమైన వ్యాధులకు గురై, దీనాతిదీనంగా తయారయి ఆయుష్ని తక్కువ చేసుకొంటాము.

అధృష్టవశాత్తూ అంతర్యామి యొక్క వ్యాకులత, ఇష్టాయిష్టాలను అదుపులో పెట్టుకొంటే తగ్గి పోతుంది. బాంధవ్యాలలో సఖ్యతకు ఇది చాలా ముఖ్యం. మాబెల్ పై ఆమెను చూసి దారి మార్చు కొనేటంత అయిష్టత ఉంటే, ఆమె కళ్లలోకి చూసి చిరునవ్వు చింది౦చండి. ఇలాగ రెండు మూడు సార్లు చేస్తే ఆమెని బలవంతంతో కాక నిజంగా ఇష్టపడడం అవుతుంది. మీరు మీ నిర్బంధంను సడలించుకొని పట్టు విడుస్తారు. అది మొదట నొప్పి కలిగించవచ్చు , అతి కష్టం అవ్వచ్చు. అయినా దానివల్ల ఎంతో లాభం ఉంది. మీ నరాల వ్యవస్త బాగుపడి ధృడమౌతుంది. మీ హుషారు ఎక్కువవుతుంది. పరిస్థితులు అనుకూలించక పోయినా మీరు నిరుత్సాహపడరు లేదా మీకు కోపం రాదు. ఒకవేళ పరిస్థితులు అనుకూలిస్తే మీ సమత్వాన్ని కోల్పోరు. గాలిలో మీరు కట్టుకొన్న కోటలు పఠాపంచల్ అవ్వచ్చు. వేరొకరు బాగుపడితే, మీకే అసూయ రాదు. నిజానికి మీరు పట్టించుకోరు. 80

Sunday, October 31, 2021

Eknath Chapter 13 Sloka 8

13.8

ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ

జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనమ్ ఇంద్రియ విషయములయందు విరక్తి , అహంకార త్యాగము, పుట్టుట, చచ్చుట, ముదిమి, రోగము, దుఃఖములలోని దోషములను దర్శించుట మరియు

శ్రీకృష్ణుడు వైరాగ్యంతో మెలిగే మనిషి గూర్చి ఇంకా వివరిస్తున్నాడు.

ఈ శ్లోకం మన వ్యక్తిత్వంలో యాంత్రికంగా జరిగే విషయముల గూర్చి చెప్పుచున్నది. మన శరీరం , మనస్సు రెండూ మనము ఉపయోగించే పనిముట్లు. మనం మన యంత్రం అనే భావన లేకపోతే యంత్రం బాగా పనిచేస్తుంది. అదే శారీరిక, మానసిక స్థితికి అనుకూలం. ఇంకా విచిత్రంగా మనము తెలిసికొనే విషయమేమిటంటే ఈ యంత్రానికే అనారోగ్యం, క్షయము, నాశనము కలిగేవి. మనం దానిని నడిపే వాళ్ళం.

మేధతో శరీరమును యంత్రంగా చూడడానికి అతిగా కష్ట పడనక్కరలేదు. మన శరీరము శక్తివంతమైన, ఆధునాతనమైన వాహనము. దానితో మనం కారు లేదా రైలు లేదా విమానంలో లాగా తిరుగవచ్చు. నేను సాన్ ఫ్రాన్ సిస్కో కి నా వోల్ వో కారులో వెళతాను. అది ఒక గంట సమయం పడుతుంది. అలాగే నాకు ఎక్కువ సమయం ఉంటే శరీరమనే చిన్న కారులో వెళ్తాను. నా భౌతిక శరీరాన్ని ఇలాగే చూస్తాను. అది "నేను" కాదు. అది నా జీవితంలో దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా క్రియలు చేయుటకు ఉపయోగపడే వాహనము.

ఇక్కడ ఒక కంగారు పెట్టే విషయం ఉంది . మనం మన కార్ ని చూపి "నేనిక్కడకు ఈ వాహనంలో వచ్చాను" అని చెప్పవచ్చు. కానీ మన శరీరాన్ని చూపి: "ఇది కూడా ఇక్కడికి రావడానికి ఉపయోగింపబడిన వాహనము" అని చెప్పలేము. మనము అలా నిజంగా చెప్ప గలిగితే ఈ వాహనాన్ని బాడుగ ఇచ్చిన వారికి వంద సంవత్సరాల తరువాత తిరిగి వాపస్ ఇవ్వాలి. ఈ కార్ తో మనం తాదాత్మ్యం చెందేము. అవిద్య కారణంగా మనము ఒక ఘోరమైన తప్పు చేసి, మనం మన శరీరమని అనుకొన్నాము. జననమరణాలు శరీరానికే అని తెలిసికోలేకపోతున్నాము. యూదుల, క్రిస్టియన్ ల సంప్రదాయంలో దీన్ని దైవ సంబంధమైన స్థితి నుండి నీచ స్థితికి రావడం అంటారు. ఆ దైవ సంబంధమైన స్థితిలో మనం మన శరీరము కాదు. మనమొక ప్రయోజకరమైన శక్తి. మనం చావుకి, విభాగాలికి అతీతం. ఎప్పుడైతే ఆ ఉన్నతి స్థితి తిరిగి పొందుతామో భూతల స్వర్గం చూస్తాము.

నాకు వోల్క్స్ వాగన్ అనే సంస్థ కారులను బాగా ఇష్టపడే మిత్రముంది. నేను ఆవిడకి నా శరీరాన్ని చూపి ఇలా అనేవాడిని: "నీకు ఎర్ర రంగు వోల్క్స్ వాగన్ కార్ ఉంది. ఇది చామనఛాయది. దీన్ని బాడుగకు తీసికోవచ్చు. ఇక్కడ తీసికొని, అక్కడ వదలవచ్చు." నేను చక్కటి సంరక్షణ -- ఆయిల్, టైర్లు సమయానికి మార్చి, తుడిచి శుభ్రం చేసి -- చేస్తే ఇది వందేళ్లు మంచిగా ఉంటుంది. ఇది సరైన పరిమాణం గలది. టిబెట్ కి చెందిన జ్ఞానులు రెండు జన్మల మధ్య కాలంలో బార్డో అనే అటూ-ఇటూ --త్రిశంకు స్వర్గం--కాని ప్రదేశంలో ఉంటామని అంటారు. మన అవసరాలకు , వ్యక్తిత్వానికి సరైన కార్ గురించ అక్కడ నిరీక్షిస్తామట. నాకైతే ఈ చామనఛాయ కారు చాలు. నాకు పెద్దవి, ఖరీదైనవి, అయిన కారులపై ఎటువంటి అసూయ లేదు. అవి ఎక్కువ భూమిని ఆక్రమిస్తాయి. అలాగే ఎక్కువ పెట్రోలును తాగుతాయి. నా కారు తగినంతగా పెట్రోలు తాగుతుంది. అది సమంగా నడపడానికి తగినట్లుగా ఉంటుంది. దాని ఇంజను అతి వేగవంతమైన ఫెరారీ కారు అంత శక్తివంతమైనది.

ఇటువంటి దృక్పధం వల్ల మనం శరీరంనుంచి విడిబడతాం. అలా కాని వాళ్ళు ఎల్లప్పుడూ తమ శరీర సంరక్షణకై బట్టలు, ఆహారం, సుఖాలమీద దృష్టి కేంద్రీకరిస్తారు. తమ ఇంద్రియాలుచేసే కోర్కెలను నియంత్రించుకోలేరు. ఇంద్రియాలు ఏమి కోరితే అదే చేస్తారు. దేహంనుoచి విడిబడడం అంటే మన నాలుకకు ఇలా చెప్పడం: "అది నా శరీరానికి అవసరం లేదు. దానిని మాడిసన్ వీధి లోని దుకాణాలు కొనమని చెప్తాయి. అది చాలా సంవత్సరాలు నిల్వ ఉంటుంది. అది నీ జీవితానికి పనికి రాదు." మనం ఎప్పుడైతే వద్దు అని భౌతిక దబాయింపులకు లొంగకుండా ఉంటామో అప్పుడు మన శరీరానికి కావలసిన ఆరోగ్యం, హుషారు, అందం పెంపొందించగలం.

క్రీడాకారులు ఈ క్రింది విషయం అర్థం చేసికోగలరు. ఒక క్రీడాకారుడు వొలింపిక్స్ లో పతకం గెలవాలని తన శరీరాన్ని రేసు కారులా చూసుకొంటాడు. అందరూ ఈ కారణ౦తో ఏకగ్రీవం చూపుతారు: నీకు వొలింపిక్స్ లో పతాకం వచ్చే అవకాశం ఉంటే, పిజ్జా మీద దృష్టి ఎందు కుంటుంది? నాకు ఆశ్చర్యమైన విషయమేమిటంటే మన స్వస్థతకి, సంపూర్ణ ఆయుష్షుకి అవసరమైన పనులు చేయమంటే కొందరు "వాటికి విలువ లేదు. బీరు పిజ్జా గురించే బ్రతకాలి" అని అంటారు. గీత య౦త్రo, యంత్రాన్ని నడిపేవాడి మధ్యన గల తేడా ఈ కారణంవల్ల చెప్తుంది: మనం మన యంత్రానికి తల వొగ్గక్కరలేదు. యంత్రం మన చెప్పుచేతల్లో ఉండాలి.

మన కార్ ని అపురూపంగా చూసుకొంటాం. దానికి కావలసిన హంగులన్నీ సమయం, ధనం వెచ్చించి చేస్తాం. దానికి మంచి రంగు వేయిస్తాం. వర్షా కాలంలో ఉపయోగపడే పరికరాలను అమరిస్తాం. మంచి స్టీరియో పాటలు వినడానికై పెట్టిస్తాం. లేదా మంచి హారన్ వేయిస్తాం. ఇవన్నీ ముఖ్యమైనవే. మనకు హారన్ అవసరం ఉంది. కానీ సమయమంతా శరీరం మీద వెచ్చించి, ఇంజన్ వలె ఉన్న మనస్సుని మరిచిపోయేం.

చాలా ఏళ్ల క్రిందట -- నేనింకా అమెరికాలో క్రొత్తగా ఉన్నప్పుడు -- నా మిత్రుడు తన కార్ ను చూపించడానికి తీసికెళ్ళేడు. "చూడు. నీకొక అద్బుతమైన విషయం చెప్తాను. ఈ కార్ కి ఇంజన్ లేదు. " అన్నాడు. తన కార్ ముందున్న హుడ్ ని తీసి చూపేడు. నేనక్కడ పాత గుడ్డలు, కొన్ని పనిముట్లు తప్ప ఏమీ చూడలేదు. కొంతసేపయ్యేక ఇంజన్ ముందుకాక వెనక ఉందని చెప్పేడు.

మనలో చాలామంది ఇలాగే ఆలోచిస్తాం. మన శరీరo ఇంజన్ లాంటిది. అది సదా నడుస్తూ ఉంటుంది. ఆ ఇంజన్ అతి నికృష్టమైన పరిస్థితిలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. దేవుని దయవల్ల ప్రమాదములు లేక మన దినం సజావుగా నడవడానికి పనిచేస్తుంది. అందుకే గీత చెప్తుంది: మొదట నీ దృష్టి ఇంజన్ మీద కేంద్రీకరించు. అనగా నీ ఆలోచనా క్రమం, నీ మానసిక స్థితి, నీ ప్రేమ స్వభావం, నీ పట్టుదల మీద దృష్టి సారించు. నీకు శక్తివంతమైన ఇంజన్ ఉంటే కార్ కి హారన్ లేకపోయినా పరవాలేదు. కార్ కి ప్రక్క కిటికీలు లేక పోయినా పరవాలేదు. చాలా జీప్ కార్లకు ప్రక్క కిటికీలు ఉండవు. అయినా కొందరు వాటిని నడపగలుగుతున్నారు. ఇంజన్ మీద పనిచేయి: అది వెసులుబాటు లేని తప్పనిసరిగా చేయవలసిన పని. నీ మనస్సు మీద పని చేయి. అవి ఒక మంచి స్థితికి వచ్చి చక్కగా పనిచేస్తున్న తరువాత, సమయం ఇంకా ఉంటే, ఒక బొమ్మను తెచ్చి కార్ వెనుకనున్న కిటికీకి తగిలించు. శ్రీకృష్ణుడు నిర్లిప్తంగా అకాలమంటాడు.

ప్రస్తుత శాస్త్రాలు మనం మెదడు గురించి పూర్తిగా అధ్యయనం చేస్తే చాలు మనస్సుని గూర్చి పూర్తిగా విదితమౌతుందని చెప్తాయి. ఒక పత్రికా కథన౦లో ఇలా వ్రాసేరు: "ఎంతో పరిశోధన తరువాత మెదడును అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు తరతరాలుగా వస్తున్న సందేహాన్ని నివృత్తి చేయలేకపోతున్నారు. అది ఏంటంటే: మన భౌతిక శరీరం మన చైతన్యానికి కారణమా కాదా. సoదేహనివృత్తి కొంచం తక్కువ వ్యవధిలో అవుతుందన్న తరుణాన, వాళ్ళు మెదడులో చైతన్యం ఎక్కడ ఉంది, నరాల్లో ఎక్కడ సంగీతం ఉంది లేదా దృశ్యం ఉంది, అనే అంశాల మీద అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది." అవి మన చైతన్యం యొక్క అగ్రమే కాని పూర్తి చైతన్యమైతే కాదు. ఇంకా ఇలా వ్రాసేరు: "నిజానికి చైతన్యానికి సంబందించిన పరిశోధనలన్నీ సందిగ్దావస్తాలో పడ్డాయి. " అది తప్పదు. ఎందుకంటే అది ప్రశ్న వేయడం బట్టి ఉంటుంది. ఒకదాని మీద పరిశోధన చేసి అది మరొకటి అనుకోవడం మరింత సందిగ్దావస్థని కలిగిస్తుంది.

మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Massachusetts Institute Of Technology) సంబంధిత ఒక శాస్త్రజ్ఞుడు ఈ విధంగా చెప్పేరు: "మన మెదడుని కంప్యూటర్ గా చూస్తే మెదడు యొక్క వ్యవస్థ అతి క్లిష్టమైనది. అది ఆశ్చర్యం కలిగించేది, ఉత్తేజ పరిచేది. మెదడుతో పోలిక చూస్తే ఇప్పుడున్న కంప్యూటర్ లు దిగతుడుపే." మెదడు ఎంతో క్లిష్టమైనది. అయినప్పటికీ అది కంప్యూటర్ లేదా ఒక యంత్రము మాత్రమే. దాన్ని ఒక బల్ల మీద పెట్టి పరీక్షించవచ్చు. దాని ప్రతిరూపం తయారు చేయవచ్చు. దాని క్రియలన్నీ కృత్రిమంగా చేయించవచ్చు. కాని దానిని నడిపేవాడెవ్వడో చెప్పలేము.

చాలా ఏళ్ల క్రిందట ఓక్ లాండ్ అనే నగరంలో ఒక కంప్యూటర్ ప్రదర్శనకి వెళ్ళేను. చుట్టూ కంప్యూటర్ లు శబ్దాలు చేస్తూ బీప్, బీప్ అంటున్నాయి . కొన్ని నిమిషాలు ఉన్న తరువాత ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చేడు. నేను అతనికి వేరే దేశస్థుడిగా అనిపించి "మీకు ఇవి ఏమిటో తెలుసా?" అని అడిగేడు. గౌరవంకొద్దీ "దయచేసి మీరు చెప్పండి" అన్నాను. "ఇవి కంప్యూటర్లు" అని హుందాగా చెప్పేడు. "మీకు అవి ఏమి చేయగలవో తెలుసా?" అని మళ్ళీ అడిగేడు. "దయచేసి మీరు చెప్పండి" అని మళ్ళీ అన్నాను. "మీరేమి చేయగలరో అవి అన్నీ చేయగలదు" అన్నాడు. నేను నవ్వుతూ "అవి ధ్యానం చేయలేవు" అన్నాను.

అతనికి ధ్యానమంటే ఏమిటో తెలియక పోవచ్చు. కాబట్టి నేను చేసిన హాస్యం అతనికి అర్థం అవ్వలేదు. ఎటువంటి స్పందన లేదు. అతనికి జటిలమైన మెదడులా పనిచేసే కంప్యూటర్ గానీ ఉంటే చాలా గర్వ పడేవాడు. అది ఎంత జటిలమైనప్పటికీ మనం మెదడులా పనిచేసే కంప్యూటర్ చేయలేము. ఎందుకంటే మనలో మానవత్వం ఉంది. పదాలకు, ఆలోచనలకు, ఇంద్రియ అనుభవానికి అతీతంగా ఉన్న జ్ఞానం, ఎరుక మనకున్నాయి. అవి మనం మరణించినా ఉండేవి. దానికి కారణం ఏమో కాదు. కంప్యూటర్ కి ఆత్మ లేదు. అది ఒక యంత్రం మాత్రమే. ఏదీ దాన్ని ఒక జీవిగా మార్చలేదు. కొంత మంది కంప్యూటర్లు , యంత్రాలు ఏదో ఒకనాడు ఒక రాక్షసి లాగ మన జీవితాలను నియంత్రిస్తాయి అని భయపడుతూ ఉంటారు. అలా భయపడడానికి అవసరం లేదు. యంత్రాలు ఎన్నటికి మానవాళిని పరిపాలించలేవు. ఎందుకంటే వాటిలో చైతన్యం లేదు. కానీ అలాగని ధీమాగా ఉండకూడదు. యంత్రాలు మన చిక్కులను విడదీస్తాయి, చైతన్యాన్ని పెంపొందిస్తాయి, మన జీవిత గమ్యాన్ని చేరుస్తాయి అనుకోవడం అతిశయోక్తి. అది ఒకరకంగా ప్రమాదం కూడా.

స్వామీ అరబిందో ఇలా వ్రాసేరు: "తప్పులు చేసే మానవాళి చుట్టుప్రక్కల ప్రాంతాలను, సమాజాన్ని ప్రభుత్వ యంత్రాంగముతో నిర్దోషమైనవిగా మార్చాలని కలలు కంటుంది. నిజానికి మన ఆత్మలని నిర్దోషము చేయకపోతే సమాజాన్ని మార్చలేము. నీవు లోపల ఎలా ఉన్నావో, అదేవిధంగా బయట వస్తువులను అనుభవించి ఆనందంగా ఉంటావు. ఎటువంటి యంత్రాంగం నీ స్వధర్మం నుండి నిన్ను రక్షింపలేదు." చివరగా "నీ యొక్క ఆదర్శమేమిటి? మన లోపల ఉన్న భావంతో సర్వ మానవ ఐకమత్యము.. మన ఆత్మ శక్తిని భౌతిక మైన , మానసికమైన ఉపకరణాల మీద వ్యచ్చించి, శాస్త్రజ్ఞులు మనం జంతువులనుంచి పరిణామం చెందేమని చెప్పినా నిరుత్సాహ పడకుండా, పట్టుదలతో మన ప్రస్తుత పరిస్థితిని అధిగమించి..ముందుకు సాగాలి" అరబిందో గొప్ప జ్ఞాని అయినప్పటికి శాస్త్రాలను వల్లించటంలేదు. అటువంటి వాక్యాలు స్వీయ అనుభవంతోనే సాధ్యము.

వైరాగ్యం ఎక్కువవుతున్న కొద్దీ ఆరోగ్యం చక్కబడుతుంది. మన దైనింద చర్యలు: మంచి పోషకాహారం తినడం, ఎక్కువ వ్యాయామం చేయడం, సరిగా నిద్ర పోవడం వల్ల ఊహించనంత స్వస్థత మనకు చేకూరుతుంది. ముఖ్యంగా మనకు మనఃశాంతి కలుగుతుంది. అదిలేక ఎంత పోషకాహారం తిన్నా, వ్యాయాయం చేసినా స్వస్థత కలుగదు.

నేను చదివిని పుస్తకాలలో మనస్సును గురించి పెద్ద ఏమీ చెప్పబడలేదు. గుండె జబ్బు, కేన్సర్ గూర్చి చేసిన పరిశోధనాలలో తేలిన విషయం ఏమిటంటే ధూమ పానము, ఆహారంలోని కొవ్వు, రక్త పోటు వల్లనే ఎక్కువ హాని కలుగుతుంది . ఇవన్నీ బాహ్యమైన కారణాలు. అంతర్గతంగా ఉన్న కారణాలను ఎవ్వరూ పట్టించుకోవటంలేదు. ముఖ్యంగా మనస్సు యొక్క ప్రభావం. మనస్సు గురించి ఒకవేళ అడిగినా వాళ్ళకు ఎక్కడనుంచి మొదలెట్టాలో కొన్ని భౌతిక కారణాలవల్ల తెలియదు. మన కోపం వల్ల వాటిల్లే ప్రమాదం, కొలస్ట్రాల్ వలన కలిగేదానికన్నా ఎక్కువ. క్రోధం, నిరుత్సాహం, భయం, దురాశ -- డబ్బు గురించే కాదు పదవి, ఆనందానికై -- మన ఆరోగ్యానికి హాని కలుగిస్తాయి. అందరూ అనుకున్నట్టు చిరుతిండ్లు, బద్దకం ప్రభావం వీటికన్నా తక్కువే. ఒకతను బ్యాగ్ బంగాళాదుంప చిప్స్ రోజూ తినేవాడాని ఎక్కడో చదివేను. నాకైతే అతని శరీరం ఒప్పుకుందని నమ్మకం లేదు. మనం దయపూరితమైతే రోజుకు 3 బంగాళాదుంప చిప్స్ బ్యాగులు తిన్నా ఒక మంచి ఆహారం తినే క్రోధమైన వ్యక్తి తో పోలిస్తే ఆరోగ్యానికి ఏమీ హాని కాక పోవచ్చు.

కాఫీ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎన్నో. అందుకే నేను డీకాఫ్ ని చాలా తక్కువగా తాగుతాను. కొందరు కాఫీ లో ఉండే కఫీన్ అనే రసాయనం యొక్క ప్రమాదాలను నాకు చెప్పినపుడు వాళ్ళనిలా కుదుట పరుస్తాను. "నాకు మీతో విబేధం లేదు. మీరు ఎక్కువ ఆలోచించవలసినది కోపం గురించి. మీ కోపాన్ని వదులుకుంటే, మీకు కావలసినంత కాఫీ తాగవచ్చు ." మన ఆరోగ్యానికి ఈ 4 కారణాలు మిక్కిలి హాని కలిగించేవి: కోపం, భయం, దురాశ, స్వార్థం. మనం వీనిమీద మన దృష్టి కేంద్రీకరించాలి. లేదా అవి మన ఆరోగ్యానికి, క్షేమానికి, ప్రేమించగల శక్తికి దెబ్బ కొడతాయి.

మనం శరీరంతో తాదాత్మ్యం అవ్వకపోతే రోగాల బారిన పడం. వృద్ధాప్యం కూడా బాధ అనిపించదు. గాంధీ గారు దీనికి తార్కాణం. దయనీయుడైన బుద్ధుడు కూడ తన 70 వ సంవత్సరాల వయస్సులో చక్కగా ఉండేవాడు. చరిత్ర పుటల్లోనూ, చిత్రాల్లోనూ ఆగ్నేయ ఆసియాలో ఎక్కడైతే బౌద్ధ మతం అతి ప్రాచీన మైనదో, బుద్ధుడు వృద్ధాప్యంలోనూ మంచి బలంతో , ఉత్సాహంగా ఉండేవాడని చెప్పబడినది. కావి దుస్తులు ధరించి, ఏ సంపద లేక, భిక్ష పాత్ర పట్టుకున్నా అతను ఎన్నటికీ రాజే (రాజై పుట్టినందుకు).

కాలం గడుస్తున్న కొద్దీ మన భౌతిక శరీరం క్షీణిస్తుంది. కాని మనకున్న స్థిరభావం వల్ల -- అనగా శరీరంతో తాదాత్మ్యం -- మననుంచి కాలo కొల్లగొడుతు౦ది. విల్ రోజర్స్ అనే ఆయన ఇలా చెప్పేవాడు: ఆయన అందమైన యువతిని చూస్తే, ఉంకో 20 ఏళ్లలో ఆమె తనకన్నా 5 ఏళ్లు ఎక్కువ వున్నట్టు కనిపిస్తుంది. అది ఆధ్యాత్మికతను అవలంబించిన వారలు కూడా వర్తిస్తుంది. 20 ఏళ్లు ధ్యానం చేస్తే, మనo 5 ఏళ్ళ పాటే వృద్ధాప్యంకి దగ్గర అవుతాం.

నేనిక్కడ సమాధి గురించి మాట్లాడటలేదు. అంతకన్నా ముందు మనం ధ్యానంలో శరీరాన్ని కూడా మరచిపోయే స్థితిని అనుభవిస్తాం. సాధన పెరుగుతున్నకొద్దీ ఆ స్థితి నిద్రలో కూడా అచేతనంగా అనుభవిస్తాం. అదే అయితే పక్కనుండి ఎగిరి గంతెయ్యకండి. మీ మంత్రాన్ని కొన్ని నిమిషాలు జపిస్తూ లేవండి. అలా చేస్తే మీరు అత్యంత సుఖాన్ని అనుభవిస్తారు. దాని ఆస్వాదన వల్ల మీరు మీ శరీరాన్ని మునుపటికన్నా విలక్షణమైనట్టి దానిగా చూస్తారు. మీరు మీ శరీరాన్ని ప్రేమగా, నాలాగా, చూస్తారు. కానీ దానితో తాదాత్మ్యం చెందరు. శరీరాన్ని ఎంతో విలువైనది, మనకు పూర్ణ సంతృప్తిని ఇవ్వ వలసినదానిగా చూడరు. ఇక కోరికలుగాని, వాంఛలు గాని ఉండవు. అవి ప్రసక్తికే రావు. కోరికలు, వాంఛలు పాత ప్రపంచానికి సంబంధించినవి. మనం ఇప్పుడు ఉంకో ప్రపంచంలో నివసిస్తున్నాము. 76

Saturday, October 23, 2021

Eknath Chapter 13 Sloka 7

13.7

అనామిత్వ మదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం

ఆచార్యోపాశనం శౌచం స్థైర్య మాత్మ వినిగ్రహః

అభిమానము లేకుండుట, దంభము లేకుండుట , అహింసా, సహనము, ఋజుత్వము , గురుసేవ, శుభ్రత, స్థిరత్వము , మనోనిగ్రహము మరియు

ఈ శ్లోకం, వచ్చే 4 శ్లోకాలు అసంగత్వంగా జీవించేవారి గూర్చి చెప్పబడినది. అనగా ఎవరైతే తాము శరీరము, మనస్సు గానివారమని భావింతురో వారిని గూర్చి.

ప్రతి సంప్రదాయంలో ఇటువంటి మనుష్యులున్నారు. మాటలు వేరై ఉండచ్చు కానీ వాటి అర్థము ఒకటే. బుద్ధుడు అహంకారం జ్ఞానానికి చిహ్నం అని ఎన్నడూ అనలేదు. జీసస్ "దంభం ఉన్నవారు అదృష్టవంతులు" అని ఎప్పుడూ అనలేదు. ఈ 5 శ్లోకాలలో చెప్పబడిన గుణాలు నిజమైన జ్ఞానులకు చెందినవి. ఎక్కడైతే స్త్రీగాని పురుషుడు గాని ఆత్మ సాక్షాత్కారం చేసుకొంటారో ఈ గుణాలు వల్లే. అవి దేశకాల, సంస్కృతులకు అతీతం.

ఇవి ఉత్తేజ పరిచే సద్గుణాల జాబితా మాత్రమే కావు. ఇవి విత్తనాల జాబితా: ఒక్కొక్క గుణాన్ని పండించి వైరాగ్యం పొందవచ్చు. అవి విత్తనము మరియు ఫలం. వాటిని పాతి, పెంచితే అవి పెద్దవై మనోక్షేత్రంలో వ్యాపించి, జీవితాంతం సరిపోయే పంటను ఇస్తాయి.

ఈ గుణాలు ఒకదానితో ఒకటి సంభందం ఉన్నవి. నా దృష్టిలో ఈ శ్లోక సారాంశం క్షమ. ఎవరైతే క్షమని -- మాటాలతోనే కాక హృదయంతో -- ఎలా ఇవ్వాలో తెలుసుకొంటే వారు ఎక్కడైనా సామరస్యంతో పని చేస్తారు. వారికెట్టి భయం ఉండదు. ఇదేమి పెద్ద రహస్యం కాదు. చిన్నపాటి అహంకారం. దానిలోంచి వైరాగ్యమనే సద్గుణం వస్తుంది.

మొదట నిగర్వము. శ్రీకృష్ణుడు దానిని పొగరు లేకుండుట అని చెప్పాడు. నాకు తెలీని విషయమేమిటంటే గర్వాన్ని పటుత్వం గాను, వినయాన్ని బలహీనంగాను చూస్తారు. అందరికీ గర్వం బలహీనపరుస్తుందని తెలుసు. గర్వమంటే కాఠిన్యం. మానవ సంభందాలలో అగాధమైన వేర్పాటు మనకున్న అభిప్రాయాలు, విలువలు వల్ల కాదు. ఒక్క గర్వం వల్లే. ఏ పక్షము మొదటి అడుగు వేయడానికి ముందుకు రాదు. ఎవరికైతే భద్రత, బలము ఉన్నాయో గర్వాన్ని వీడి రాజీకై ముందడుగే గాక లెక్కలేనన్ని అడుగులు వేయవచ్చు.

ఇక్కడ అహింసతో సంబంధం ఉంది. అహింస అనగా హింస చేయకుండా ఉండడము మాత్రమే కాదు. అది ఒక తత్వం. మన మనస్సులో క్రోధం లేకుండా చేసుకొనుట. అనుభవంలో క్రోధాన్ని దయగా, జాలిగా మార్చుకోవడం.

అహింస మన సహజ స్థితి. అది ఒక సారమైన భూమి వంటిది. దానిలో దయ అనే విత్తనాలు వేయనక్కరలేదు. మంచి మాటలు, క్రియలు దానిలోంచి సహజంగా వస్తాయి. కానీ క్షేత్రం స్వార్థంతో నిండిపోయింది. స్వార్థ పూరిత, లోభముతో కూడిన నడత, మనమెప్పుడైతే అధికులమనుకొన్నామో, అప్పుడు వస్తుంది. స్వార్థమనే కలుపు మొక్కలను తీసేస్తే భద్రత, తృప్తి పెరుగుతాయి. అది ఏదో బాహ్య శక్తి వల్ల కాదు. మనలో సహజంగా ఉన్న దయ వల్ల. అలాగే రాక్షస దంతాలను నాటితే విరోధము మొలకెత్తుతుంది. ఇటువంటి తోట వల్ల పర్యావసానము జీసన్ కి రాలేదా? ఎక్కడైతే ఒక దంతం పడిందో దానినుంచి సైనికులు యుద్ధానికై ఆవిర్భవించేరు. ఇది నమ్మశక్యం కానిదవవచ్చు. కానీ ఇది మనం రోజూ పత్రికలలో చదివే హింసను గూర్చి చెప్పేది అక్షరాలా నిజం.

హింసపూరిత భావనలు ఒక గొలుసులా ప్రతిస్పందిస్తాయి. ఒకరోజు నా మిత్రుడు మూకా అనబడే నా కుక్కను చూస్తున్నాడు. మూకా ప్రక్కింటివాళ్ళ పిల్లిని చూస్తున్నది. ఆ పిల్లి ఒక పక్షుల గుంపును చూస్తున్నది. పిల్లి సహజంగా ఆ పక్షుల వైపు దూకింది. మూకా వెంటనే పిల్లి మీదకు దూకింది. నా మిత్రుడు మూకా వెనక పడ్డాడు. ఇదే మన జీవితంలో జరిగేవి. మనని ఆఫీసులో ఎవరైనా అవమానిస్తే, మనతో ఇంట్లో సహజీవనం చేసే వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తాo. వాళ్ళు తక్కినవాళ్ళ మీద రోషంగా ఉంటారు. ఇది ఒక వ్యష్టికి మాత్రమే చెందదు. ప్రపంచ దేశాలుకూడా ఇలాగే ప్రవర్తిస్తాయి.

చాలా ఏళ్ల క్రిందట టివి లో ఒక వ్యక్తి గొలుసుకట్టును చూపించేడు. అతడు ఒక గదిని ఎలకలను పట్టే స్ప్రింగ్ లతో (mouse trap) నింపేడు. ఎప్పుడైతే ఆ స్ప్రింగ్ ని కదిలిస్తామో అది రెండు బంతులను విసురుతుంది. ఒక పలక మీద ఎలా ఒక యురేణియం కణాన్ని ఒక న్యూట్రాన్ పరమాణువు తాకితే రెండు న్యూట్రాన్లు వస్తాయో వివరించేడు. ప్రకటించకుండా ఒక బంతిని స్ప్రింగ్ మీద వేసేడు. ఆ స్ప్రింగ్ నుండి 2 బంతులు విడిపించుకొని తక్కిన స్ప్రింగ్ ల మీద పడాయి. వాటినుంచ్చ 4 బంతులు ఎగిరేయి. ఇలాగ అవి వ్యాపిస్తే గదంతా ఎగురుతున్న బంతులతో నిండి పోయింది.

మన ప్రపంచం అలాగే ఉందనడం అతిశయోక్తి కాదు. ఒకడు చాలా కాలం క్రోధ పూరితుడై తన క్రోధాన్ని నలువైపులా వ్యాపింపజేస్తాడు. ఎప్పుడైతే చాలా మంది క్రోధంతో, ద్వేషంతో , అసహనంతో , వైరంతో ఉంటారో, హింస పెరుగుతుంది . అది మన హృదయాల్లో , ఇళ్ళల్లో , వీధుల్లో , నగరాల్లో, వివాదంతో ఉన్న జాతుల్లో , ముఠాలలో, దేశాలలో విలయ తాండవం చేస్తుంది.

వైరాగ్యం ఈ గొలుసుకట్టును నివారిస్తుంది. ఒక పిల్లి సహజంగా పక్షులపైకి గెంతుతుంది. దానికి తెలిసిందంతా అదే. మూకా అనబడే నా కుక్క పిల్లి వెనక పడడం దాని సహజ గుణం. కాని మనుష్యులకు తమ ప్రతిక్రియను నియంత్రించుకొనే శక్తి ఉంది. మన స్పందన-ప్రతిస్పందన అనే గొలుసుకట్టును నివారించవచ్చు. ఎలాగంటే అసహ్యన్ని ఓర్పుతో, ద్వేషాన్ని దయతో , భయాన్ని నమ్మికతో విశ్వసనీయంగా, నియమంగా పాటిస్తే పెరుగుతున్న హింసను అరికట్టవచ్చు.

ధ్యానంతో మన మనస్సును కుదుట పరచుకొంటే స్వార్థం తగ్గి, వైరాగ్యం వచ్చి మన దృక్పథం మారుతుంది. అప్పుడే మనం క్షమించడానికి ఉన్న అవరోధాలు ఏవో సైద్ధాంతిక, తత్వజ్ఞానం వల్ల కాదని తెలుస్తుంది. అవరోధాలు మన స్వార్థం, పట్టుదల, ఇతరులమీద ప్రదర్శిస్తే వాళ్ళు మనమీద కూడా ఆదేరీతి స్పందిస్తే వచ్చేవి. దీన్ని సరిగా భావన చేస్తే క్షమను పెంపొందిచ్చవచ్చు. వోల్టైర్ ఇల్లా చెప్పేరు: "అందరినీ అర్థం చేసుకోవడమంటే వారిని క్షమించడమే". మనకు మరింత పదునైన చూపు ఉండాలి. అది మన పట్టుదల. పరిస్థితులు ప్రకోపించినప్పుడు శాంతంగా ఉండడానికి ఎంతో ఆత్మస్థైర్యము అవసరము. ఎప్పుడూ మన సమత్వాన్ని కోల్పోక, దురుసు మాటలాడక ఉండాలి. అలా చేస్తే ఒక అద్భుతం మనందరి అనుభవానికి వస్తుంది. మన ప్రత్యర్థి శాంతిస్తాడు. అతని కళ్ళు తేట అవుతాయి. మళ్ళీ సఖ్యత పెరుగుతుంది.

నూతన నాగరీకతలో క్రోధం ఒక మంచి సంస్కారంలా చిత్రీకరింప పబడినది. మంచి సంస్కారం అనగా మంచి సంబంధం. అది నిజం కాదు. క్రోధం బంధాలను త్రెంచుతుంది. మానవుల మధ్య అగాధం ఏర్పడిస్తుంది. బంధాలను నాశనం చేస్తుంది. "నీవంటే నాకు లెక్కలేదు" అని చెపుతుంది. "నువ్వు గౌరవింపబడే వ్యక్తి కాదు" అని అంటుంది. సంభాషణ ఒకే ఒక్క విధానంగా చేయగలం. అది ఓర్పు, సహనం ద్వారా. వానివల్ల మన మనస్సులో గాయాలేర్పడవచ్చు. నిజానికి గాయాలు ఏర్పడుతాయి. మన సహనాన్ని పరీక్షిస్తుంది. అందువలననే ఆధ్యాత్మిక జీవితం అతి కష్టం. మనం ఎంత ఇతరులకు ఇస్తే అంతకన్నా రెట్టింపు మనకు తిరిగి వస్తుంది. జీసస్ ఈ విధముగా చెప్పెను: "ఎవ్వరికి ఉందో, వాళ్ళకి ఎక్కువ ఇవ్వబడుతుంది. ఎవ్వరికీ లేదో, వాళ్ళ కున్నది లాక్కోబడుతుంది". ఆయని శిష్యుడు "అది న్యాయం కాదు", అంటే ఆయన చిరునవ్వుతో "ఏది న్యాయం కాదు? ఆ ఎన్నిక నీ చేతిలో ఉంది" అనవచ్చు.

దీన్ని ఒకే విధంగా తెలిసికోగలం. అది ఇచ్చి-పుచ్చుకోవడమనే మన మధ్య ఉన్న బంధం. మనకి దగ్గరి వాళ్ళు మనను ప్రేరేపింపవచ్చు. మనమూ వాళ్ళను ప్రేరేపింపవచ్చు. ఇది ప్రతీ దేశంలోనూ సహజంగా జరిగేదే. ఒక మగవాడు, ఆడది భిన్నమైన విద్యాలయాలికి వెళ్ళి చదివి, భిన్న సంస్కృతిలో పెరిగి, భిన్నంగా పని, ఆట, తినడం, మాట్లాడడం, ఆలోచించడం చేసి, అప్పుడప్పుడు కలహించకపోతే అది మనము ఆహ్లాద పడవలిసిన విషయం. మన మధ్య గల వేర్వేరు గుణాలు సహనం, ఓర్పు, గౌరవం ప్రదర్శించుకోవడానికి దోహదం చేస్తాయి. దీని కన్నా నేర్చుకోవడానికి వేరొక మార్గం లేదు.

క్షమ ఎటువంటి బంధాలకైనా మూలం. ముఖ్యంగా ప్రేమించడానికి. ఇద్దరు ప్రేమించుకున్నారనుకుందాం. ఒకరు తప్పు చేస్తే "నేనూ అదే చేస్తాను. చెల్లుకు చెల్లు" అని మరొకరు అనరు. ఒకరిమీదవొకరికి గౌరవం తగ్గదు. ఆ సమయంలో ప్రేమికునికి చేయూతవనివ్వాలి. అంతేగానీ వానిని కించ పరచకూడదు. వానిని తప్పును అధిగమించేలా చేసి, మానసికంగా ఎదగడానికి ప్రోత్సాహించాలి. ఇది ఒక కళ. ఇది ఒకని నడవడిపై తీర్పు లేదా అసహ్యం పడవలసిన విషయం కాదు. అంటే మన అహంకారాన్ని పూర్తిగా లేకుండా చేయాలి. మనలో చాలామంది లోతుగా ఆలోచింపక, ఉన్నత జ్ఞానం లేక, బంధం చెడితే దానినుంచి విముక్తిని కోరుకొంటారు. దీని గురించి దుఃఖించ నవసరము లేదు. నేను అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేసాను. అలాగే నా చుట్టు ప్రక్కల వాళ్ళు కూడా. ఇప్పడినుంచీ ధ్యానంతో మన జీవితాలను గడుపుదాం. మనం దృఢనిశ్చయంతో జావ కారకుండా ఉందాం. ఎక్కడైతే ద్వేషం, విరోధం, పగ చూపించేమో ఇప్పుడు ప్రేమ, గౌరవం చూపిద్దాం.

మనం పరిపూర్ణితను కోరనక్కరలేదు. రోబర్ట్ బ్రౌనింగ్ ఒక గొప్ప ఉపమానము చెబుతూ ఇలా అన్నారు: "మనం అర్థచంద్రాకృతి గీస్తే చాలు, పరమాత్ముడు దాన్ని పూర్ణ వృత్తాన్ని చేస్తాడు. అతడు మనముంటున్న క్లిష్ట పరిస్తితులను పరిగణలోకి తీసికొంటాడు. పత్రికల్లో తరచూ కామం , డబ్బు గురించి వ్రాస్తున్నారు. ప్రపంచమంతా అర్థంలేని ఉన్మాదంతో నిండి ఉన్నది. ఆయన మన దేశ, సాంస్కృతిక, భౌతిక లేదా బుద్ధి కున్న లోటుపాటులను అర్థంచేసికొని ఇలా అంటాడు: ఇతరుల గురించి నువ్వు వీలయినంత మంచి చెయ్యి. అందరి పురోగతికై పాటు పడు. నువ్వది చేయగలిగితే నువ్వు ఐక్యతకు, సామరస్యానికి, శాంతికి ఒక గొప్ప శక్తి అవుతావు." "

పరమాత్మ మనను గాఢంగా ప్రేమిస్తాడు. ఆయనకు ఎనలేని దయ, క్షమ ఉన్నాయి. ఆయన ప్రేమ ఎంతవరకంటే మనం ఇతరులను ప్రేమించినంత. దీనిలో ఎటువంటి చిత్రం లేదు. నేను ఒకరిని క్షమించినపుడు నా మనస్సులోని అంతర్గత ప్రపంచంలో చాలా నిజంగా అనిపించి నా బాధలను మరచిపోతాను. దానివల్ల నా నరాల వ్యవస్తకు, ముఖ్య ఆవయవాలకి మంచి జరుగుతుంది. పురాతన భాషలో చెప్పాలంటే నాపై దైవ కృప ఉన్నది. కోపం అనేకమైన శారీరక బాధలను కలుగజేస్తుంది. క్షమ బాధలను ఉపశమనం చేస్తుంది. అవి మానసిక బాధలవ్వచ్చు లేదా శారీరకమైనవి కావచ్చు.

ఒకరోజు నేను బెర్క్ లీ దగ్గర కార్ పార్ కింగ్ చేసి వస్తూ వుంటే పూర్వపు రాజ కోటల దగ్గర ఉండే పెద్దపెద్ద మేకులవంటి ఇనుప శలాకలు నేల మీదు కనిపించేయి. అక్కడ ఒక సూచన ఉంది: "ఇక్కడ ప్రవేశించ వద్దు. టైర్ లు నాశనమవుతాయి". ఆ శలాకలు చూస్తూ ఉంటే టైర్ లు పచ్చడి అవుతాయి. మనలో కూడా ఇటువంటి సూచన ఉంది: "స్వార్థంతో బ్రతుకకు. ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా కష్టాలను అనుభవించవలసి వస్తుంది." జీసస్ మరియు శ్రీకృష్ణుడు మనకు "ఇతరులపై పగ తీర్చుకో వద్దు. ఇతరులను దూషణ చేయవద్దు" అని బోధ చేయడం ఏదో మతమునకు పరిమితం కాదు. అవి సజీవ సిద్ధాంతాలు. నిర్దయమైన ఆలోచనలు, మాటలు, నడవడిక వల్ల మనకే అమిత నష్టం వాటిల్లుతుంది. ఎప్పుడైతే మీరు బద్ద శత్రువును క్షమిస్తారో అది మీ బంధాన్ని పునః నిర్మాణము చేయడానికి తోడ్పడుతుంది . దానితో బాటు మీలో పేరుకుపోయిన క్రోధం, వైరం సమసిపోయి ఆరోగ్యం కుదుటపడుతుంది. నన్ను అడుగుతూ వుంటారు: "నేను వేరే వారి స్వస్థత కై ప్రార్ధిస్తే అది పని చేస్తుందా?" నా సమాధానం: "అది పరులకు ఎంత ఉపయోగకరమో నాకు తెలీదు. కానీ నీకు మాత్రం చాలా ఉపయోగ పడుతుంది."

ఇది శ్రీకృష్ణుడు మంచి జ్ఞానం అని అంటాడు : మన మధ్య ఎన్నో బేధాలు ఉన్నా దేవుని అందరిలోనీ చూడాలి. దేవుడుని తెలుసుకోవాలంటే కష్టాల నెదుర్కొని అతనిలా మార్పు చెందాలి. జీసస్ ను తెలిసికోవాలంటే అతనిలాగ నిగర్వముతో ఉండాలి. ఆయన శిలువ మీద నుండి శత్రువులను క్షమించేడు. మనకు ఎలా జీవించాలో చెప్పడానికి తన జీవితాన్ని దారపోసేడు. ఎలాగంటే తెలివిగా, సహనంతో, అందరి సౌఖ్యం గురించి. ఆయన్ని గౌర వించడానికి పరిమితులు లేవు. మనని మనమే ఆయనకు శిష్యులుగా చేసికోవాలి. అలాగ మన అనుబంధాలలో క్షమ అనే ఉన్నత గుణాన్ని ప్రదర్శించాలి. ఆయన అన్నట్టు: "తండ్రీ , వారిని క్షమించు. ఎందుకంటే వారేమి చేస్తున్నారో వారికి తెలీదు." 71

Wednesday, October 13, 2021

Eknath Chapter 13 Sloka 6

13.6

[శ్లోకం 13.5 లో ఉన్నది ]

క్రిందటి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఘటనా ప్రపంచం (phenomenal world) లోని ఘటకములను (ingredients) చెప్పెను. ఇప్పుడు ఆ ఘటకములను మేళవించి ఒక వ్యక్తిని తయారుచేసే పద్దతి చెప్పబోవుచున్నాడు. శరీరము ఆ పద్దతిలో ఒక భాగము, కానీ అది ఒక చిన్న పాత్రను పోషిస్తుంది. ఒక వ్యక్తిలో ఎక్కువ శాతం అంతర్గత ప్రపంచం. దానిని మనస్సు అనవచ్చును. ఆ ఘటకములన్నీ ఒకే ఘటనా ప్రపంచమునకు చెందినవి. అది సదా మారుతూనే ఉంటుంది. మనకు దానితో తక్కువ సంభందం ఉంది.

ఉదాహరణకు నా శరీరం తీసికోoడి. అది దిట్టంగా, వెచ్చగా, చామనచాయి రంగులో ఉంది. అయినా నా వైద్య మిత్రులు అది సదా మారుతూ ఉంటుందని చెప్తారు. నా చేతులు ఎప్పుడూ ఉన్నవే. నా చర్మము వేరు. నా కండరాలు వేరు. నా ఎముకలు కూడా వాటిలాగే సదా మారుతున్నాయి. నేనిలా కూర్చున్నప్పుడు నా చేయిలోపల నాకు తెలీకుండా కణాలు మారుతున్నాయి. అయినప్పటికి అది ఒక చేయి. అది నా చేయి. దానియందలి కణాలు చేపగా మారవు. అవి నా శరీరానికి అనుగుణంగా మారుతాయి.

నా పూర్తి శరీరం అంతే. అది 20 ఏళ్ల క్రిందటి శరీరం కాదు. అయినప్పటికీ అది ఒక సంపూర్ణ శరీరం. నా శరీరం. అది ఒక పదార్థమే కాదు. ఒక వ్యవస్థ కూడా. ఈ జ్ఞానం వల్ల మనకి తెలిసినదేమిటంటే శరీరం మీద వ్యామోహము, దురభిమానము తగదు. ముక్కు సూటిగా ఉన్నదని అహంకారం చెందవచ్చు. కానీ అది చెందే మార్పులు మనం తెలిసికోనక్కరలేదు.

ఆ ప్రక్రియ చాలామటుకు ఆకాశానికి (space) కి చెందినదే. శరీరంలో ఘన పదార్థం చాలా తక్కువ. ఎక్కువ ఉన్నది ఆకాశమే. ఆకాశాన్నంతా తీసేస్తే పదార్థo ఒక వేరుశెనగ తొక్కoత ఉంటుందని ఎక్కడో చదివేను. ఇది ఆశ్చర్యకరమైనది అతిశయం కాదు. దీని వలన తెలిసినదేమిటంటే పదార్థం ఎంత ఉపయోగకరమో ఆకాశం కూడా అంతే ఉపయోగకరం. అందుకే ఆకాశం పంచ భూతాల్లో ఒకటని చెప్పబడినది. గాలితో నిండిన ఆకాశమే మన శరీరం అని ఎలా నమ్మడం?

మనం నిజంగా నమ్మితే, బహుశా మనం కలవరం చెందుతాము. ప్రణయం చేయుట మిక్కిలి కష్టం. రోమియో అక్కడ గాలితో నిండి కనిపించని జూలీయట్ గురించి ఏమనుకొంటాడు? వేరుశెనగ తొక్కతో సమానమైన శరీరంని చూసి ప్రేమలో పడతాడా? మాయ ఇటువంటి గ్రాహ్యతను సహించలేదు. కాబట్టి దాని మీద ముసుగు వేస్తుంది. మన నైజం విచిత్రం. రోమియో ఎన్నిమార్లు "అది వేరుశెనగ తొక్కే, అది వేరుశెనగ తొక్కే" అనుకున్నా, జూలియట్ చేయి పట్టుకోగానే శరీరంలో మార్పులు చెందుతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తం వేగంగా ప్రవహిస్తుంది. మోహం వల్ల చేయి ఘన పదార్థంగా గ్రహించబడుతుంది

ఇది ఇప్పటికే మూర్చావస్తని కలుగజేసింది. దాన్ని ఇంకొంచెం పొడిగిద్దాము. మనస్సును చూద్దాం. ప్రతిరోజూ క్రిందటి దినములాగే మార్పు లేకుండా నిద్రనుంచి లేస్తాము. ఎందుకు? మార్పు లేనిదెందుకు? నువ్వు భిన్నంగా చూస్తావు. బహుశా క్రిందటి రోజు రాజాగా తలంచేవు. ఈరోజు విశేషంగా చూస్తావు. "భోజనం చేసిన తరువాత చూద్దాం. నేను భోజనం చేసే వరకు నేను కాదు." భోజనం చేసిన తరువాత నువ్వు నిజంగా మారవచ్చు. మనమంతా అటువంటి భావనలు గలవారమే. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు వ్యక్తులతో మనం వేర్వేరుగా ఉంటాము. ఆఫీసులో అందరినీ గౌరవంగా పలకరిస్తారు. ఇంట్లో స్వార్థపూరితంగా ఉండచ్చు. ఈ విధంగా మనకు రెండు వ్యక్తిత్వాలు ఉండచ్చు. ఇది సమత్వం ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఇదేవిధంగా మన కోరికలు మారుతాయి. ఒక వ్యక్తిత్వంలో నువ్వు చెత్తలబండిని నడిపించే వాడిగా భావించవచ్చు. ఉదయాన్నే బండిని ఇంకా నిద్రపోతున్న చుట్టుప్రక్కలివారిని కలవర పరిచేలాగా తోలుతావు. నీ మనస్సులో వేరే ఉద్దేశం ఉండవచ్చు. అభిప్రాయాలు మారుతాయి. దయపూరిత వారలెందరో నాకు తెలిసి ఇప్పుడు సంప్రదాయ బద్దంగా ఉన్నారు. మార్పు మనస్సు యొక్క స్వభావము.

జ్ఞానులుకూడా అలాగే తలిచేరు. "మరినేను ఎవర్ని" అని ప్రశ్నించు కొన్నారు. మనం అవయవాల సమూహం కాదు. అవి ఏవీ కావు. అవి శూన్యాన్ని సూచిస్తాయి. మనస్సు కూడా మార్పు చెందేదే. ఆలోచిస్తే వేరుశెనగలో చాలామంది ఇముడుతారు అన్న భావన కలుగుతుంది.

ఒక భౌతిక శాస్త్రవేత్తకు, ప్రపంచం పరమాణువులు, శక్తి తో కూడినట్టుగా కనిపిస్తుంది. అలాగే మనస్సు అభిప్రాయాల, ఆలోచనల మహా సముద్రం. వ్యక్తి మార్పు చెందినప్పటికీ, వానిలో ఏదో శక్తి దినదినం మార్పు చెందకుండా ఉంటుంది. మనస్సు స్వభావం పునరుచ్ఛరించడం. అది దేనినైనా ఆలోచించ గలదు. నిజానికి అది పాత ఆలోచనలు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎలాగంటే నా చేయి పాత కణాలు విసర్జించి కొత్త కణాలను తయారు చేసికోవడం లాగ. కానీ ఉన్న చేయి ఉన్నట్టే ఉంటుంది. అలాగే మనస్సు కూడా పని చేస్తుంది. ధ్యానం వల్ల మనస్సును మార్పు చేసుకోవచ్చు. మనస్సులో ఘన పదార్థం , మార్పులేనిదంటూ ఏమీ లేదు. మనం దాని స్వరూపాన్ని పట్టుకోవాలి. మనకున్న అలవాట్లు, గుణాలు, స్వీయ భావావరోధం ని సంస్కృతంలో సంస్కారాలు అంటారు.

ఇవన్నీ మన అహంకారాన్ని గాబరా పెడతాయి. అది ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాదని తలస్తుంది. కానీ అది అబద్ధం. కోరికలు, అలవాట్లు, కోపము, అభద్రత లతో గజిబిజిగా చేసిన కట్టలా యాధృచ్చికంగా ఉన్నది. ఈ కట్టను ఎవరు మోస్తున్నారు? చేతులతో మోద్దామని ప్రయత్నిస్తే అది చిందరవందరగా నేల పడుతుంది. కాబట్టి దానితో కూడి ఉంటే మన అభద్రత ఎక్కువవుతుంది. దానిలో అతిశయోక్తి లేదు. ఈ పేకముక్కలతో చేయబడిన నీడ వంటి ఇల్లుని ఏదైనా భయపెట్టగలదు. దానివల్ల తాడుతో కట్టబడడానికి ప్రయత్నిస్తున్న అహంకారం తన రక్షణ కొరకై ప్రాకులాడుతుంది .

ఎలాగైతే మనస్సులోని ఆలోచనా ప్రవాహం అహంకారానికి వర్తిస్తాయో, అది ఆత్మ తప్ప వేరే వస్తువుకు వర్తించదు. అన్నిటికీ మూలమైన ఆత్మను అహంకారం ఆక్రమించి దాని గుణాలను స్వంతం చేసుకోవడానికి తయారవుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అహంకారం ఆత్మ లక్షణాలను అపహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది కోటు వేసుకొని, టోపీ పెట్టుకొని నన్ను ఆత్మలాగా తెలివైన, ప్రతిసృష్టి చేయగల, ప్రేమించదగిన, మరణంలేనిదానిగ చూడండి అని దబాయించి అడుగుతుంది. కానీ ఒక చిన్న భాగం దాన్ని నమ్మదు. అది అద్దంలో చూసుకొని తనను తాను పొగుడుకోడానికై ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ ప్రతిబింబం లేదు. ఘనమైన పదార్థము లేదు. నిమిషనిమిషానికి మార్పు చెందుతుంది. అవన్నీ ఏకమై దానికి అభద్రత, భయము కలిగిస్తాయి. అవి చేతనావస్తలో తొలగాలంటే ముందు మనమెవరో తెలిసికోవాలి.

ఈ ప్రక్రియనంతటిని క్షేత్రంగా శ్రీకృష్ణుడు అభివర్ణించేడు. అది ఎంత నిజమో మన ఆధునిక జీవన శైలిని చూస్తే తెలుస్తుంది. మనము పదార్థము, శక్తిని వరసగా గోచరమై, సూక్ష్మమై ఒక బలవంతమైన భౌతిక శక్తిగా తలుస్తాము. ఇది పాఠశాలలలోనూ, టివి లోనూ బోధించరు. ఆపై అది ఎందుకూ పనికిరానిదని, నిరూపణ చేయలేనిదని అవహేళన చేస్తారు. మన ఒక విషయం అర్థం చేసుకోవాలి. వస్తువుకి సంబంధించిన జ్ఞానం ఎలా అతిశయోక్తికి గురి అవుతుందో జ్ఞప్తి పెట్టుకోవాలి . అదే గీత చెప్తున్నది. శక్తులతో కూడివున్న ఆ క్షేత్రం అణువుకన్న సూక్ష్మమైన వస్తువుల్లో వ్యాప్తి కలిగినది. అదే మనస్సుకున్న శక్తి.

ఇది వాక్చాతుర్యము కాదు. మనo కరెంటును (electricity) చూడలేము. దాని కార్యాలన్నీటినీ చూడగలం. అలాగే మన వ్యక్తిత్వంలో ఉన్న శక్తులను కూడా చూడలేం. అయస్కాంతం చూస్తే ఒక ఇనప ముక్కలాగ ఉంటుంది. కానీ అది ఒక కుప్పగా ఉన్న ఇనుప రజను దగ్గరకు తెస్తే ఆ రజను కుప్ప సమాంతర రేఖలుగా మారుతుంది. మనం ఆ రేఖలను చూడగలం. అది అయస్కాంత క్షేత్రం యొక్క రూపం.

అదేవిధంగా మనం వ్యక్తిత్వం యొక్క ఆకారాన్ని దాని క్రియలద్వారా తెలిసికోవచ్చు. మొదట శరీర ఆకారం. సూక్ష్మమైన అణువులలో, ఒక శాస్త్రజ్ఞుడు చెప్పినట్లు, శరీరo వర్ణింప శక్యం గాని శక్తిగా తెలియబడుతుంది . మనము శరీరమని దేన్ని అంటామో అది ఘన పదార్థము. ఎందుకంటే అది మన ఇంద్రియాలకు అనుభూతి కలిగిస్తుంది. హిందూ-బౌద్ధ శాస్త్రాలు ఒక అడుగు ముందుకు వేసి: మన భౌతిక శరీరం వ్యక్తిత్వం యొక్క ఘన పదార్థం. అది ఎన్నో సంవత్సరాల కాలంలో మన ఆలోచనల క్రమంతో చేయబడినది. ఇది గుహ్యమైన సిద్ధాంతము కాదు. శాస్త్రాలు స్వస్థత, ఆరోగ్యం, ఎలా బాల్యం నుంచి ఉన్న జీవన శైలిలో నిర్ణయింపబడినవో మన జ్ఞప్తికి తెస్తాయి. మనమేమి తింటామో, రోజుకు ఎన్నిమార్లు తింటామో, పని ఎలా చేస్తామో , జీవితంలో తటస్తిoచే చిక్కులను ఎలా విడదీస్తామో, మన తీరిక సమయం ఎలా గడుపుతామో ఇవన్నీ బాల్యంనుంచి వచ్చినవి. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. ఈ శ్లోకం మన ఇష్టాయిష్టాలను, పట్టుదలను , మనను క్రియాశీలులను చేయు కోరికలను జ్ఞప్తికి తెస్తుంది. అది జన్యు సంభందమైన విషయంగూర్చి చెప్పటంలేదు. చాలా సార్లు మన వ్యక్తిత్వం జన్యువుల మీద ఆధారపడి ఉంటుంది. మన సమర్థత జన్యువులు కూడా నిర్ణయిస్తాయి. తక్కువ కదలిక వల్ల తిండిని నియంత్రించకపోతే లావు అవతాం. మనను ఎక్కువ బరువుగా ఉండమని ఎవ్వరూ శపించరు. మన కోరికలు, నడవడిక, మనం చేసుకొన్న ఎన్నికలు, గుప్తంగాఉన్న ప్రవృత్తులను వెలుపలికి తెస్తాయి.

ఇతరులపైన జరుగు కార్యములు ద్వారా శక్తివంతమైన క్షేత్రం గూర్చి ఇంకా చెప్పవచ్చు.

సాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో ఒక శక్తివంతమైన కరెంట్ తో పనిచేసే ఆయస్కాంతాన్ని చూసేను. నా నడుముకున్న ఎత్తులో రెండు స్థoబాలు ఒకదానివైపు ఇంకోటి వంచ బడి ఉన్నాయి. చెయ్యిని వాటి మధ్య పెడితే ఎటువంటి చలనం ఉండదు. కానీ కరెంటు వాటి లోకి పంపితే అది వేరే విషయం. వాటి మధ్య కొంత ఇనుప రజనను వేస్తే, అవి సమాంతర రేఖల వలె మార్పు చెంది ఒక వంతెనలా గాలిలో తేలుతాయి. నువ్వు దాన్ని కదపవచ్చు. దాని మీద చేయి పెట్ట వచ్చు. ఎటువంటిదీ ఆ రజనును మొయ్యకపోయినా ఆ వంతెన దిట్టంగా ఉంటుంది. కంటికి అగుపడని క్షేత్రం నిజంగా ఇలా ఉంటుంది. అది తన చుట్టూ ఉన్న ఆకాశాన్ని (space) వంచుతుంది.

ఒక మనిషికూడా అలా ఉండవచ్చు. మనము వాడుక భాషలో "ఆమె వ్యక్తిత్వం దృఢంగా ఉంటుంది" అంటాం. అయస్కాంతం లాగ మన వ్యక్తిత్వం ఎక్కడికి వెళ్ళినా శక్తివంతమైన క్షేత్రాన్ని ప్రసరింపజేస్తుంది. అది మంచికయినా లేదా చెడుకయినా కావచ్చు. అందుకే ఒక మనిషి కొందరికి ఆకర్షణీయంగా ఉంటాడు. మరికొందరికి అసహ్యకరoగా ఉంటాడు. సమస్య ఏమిటంటే: మనం కావలసిన వారిని ఆకర్షించ౦. అలాగే మనం అసహ్యించే వారి బారినుండి తప్పించుకోలేం. ఇoకోవిధంగా చెప్పాలంటే మనం కర్మ బీజాన్ని నాటి దాని పంటను పొందే వాళ్ళనే ఆకార్షిస్తాం. ఒక కోపిష్టికి తన కోపాన్ని ప్రేరేపించే మనుష్యులు, సంఘటనలు ఎదురౌతాయి.

తగిన పరిస్థితులు కలుగజేస్తే ఒకని శక్తివంతమైన క్షేత్రం చాలా దూరం ప్రసరించవచ్చు. గీత ఆదిలో చీకటిలో ఉన్న శక్తిలా దుర్యోధనుని వర్ణిస్తుంది. జీవితమనే నదిలో అతడు సుడిగుండం వంటి వాడు. మీరు సుడిగుండాన్ని చూసేరో లేదో నాకు తెలీదు. బాల్యంలో నదిలో ఈదుతూ ఉంటే నాకు భయoకరమైన సుడిగుండాలు కనబడ్డాయి. ఎక్కువగా వర్షా కాలంలో. అది ఒక భయానకమైనది. ఒక కనబడని చెయ్యి దానిని ఈవొడ్డు నుంచి ఆ వొడ్డుకి కదిపినట్టు ఉంటుంది. అది వేగంగా, చీకటిలోలాగా, బలమైన సుడులుగా కనిపిస్తుంది. అలా కదులుతూ దారిలోనున్న వాటినన్ని తనలోకి లాక్కుంటుంది. దుర్యోధనుడు అటువంటి వాడే. అతడు క్రోధం, బలమైన అహంకారలతో ప్రపంచాన్ని తన చుట్టూ త్రిప్పికొని దాని నాశనానికి కారణమయ్యేడు. నేను ఒక వాచ్యార్థానికై ఇది చెప్ప లేదు. హిట్లర్ జీవిత చరిత్ర చదివిన వారికి వాని క్రోధానికి ఎంత మంది బలి అయ్యేరో తెలుసు. దుర్యోధనుడూ ఆ కోవకు చెందినవాడే.

శక్తివంతమైన క్షేత్రం యొక్క చిత్రం మనకు ఒకరిమీద మరొకరు ఎలా ఆధారపడి ఉన్నామో తెలుపుతుంది. మరియ మన మనోవాచాకర్మలు ఎంత దూరం వెళ్లగలవో వివరిస్తుంది. ఎలా అయితే ఒక కెరటాన్ని నదినుంచి విడదీయలేమో, మనలోఉన్న శక్తిగల క్షేత్రం మనం నివసించే శరీరానికే పరిమితమని అనలేం. ఆ కెరటాల సమూహం -- మనలాంటి సాధారణ మనుష్యుల లెక్కపెట్టలేని కోరికలు, కర్మలు -- ఒక సుడిగుండాన్ని సృష్టించి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందవచ్చు .

ఉదాహరణకు నేను ఒక సాధారణ, అమాయకమైన విషయం యొక్క కార్యం గురించి ఆలోచిస్తున్నాను. అది ఆవు మాంసం తినాలనే కోరిక. కొంతమంది అవసరమున్నా లేకపోయినా అదేపనిగా మాంసం తింటారు. రోజూ మాంసాన్నే ఆకాంక్షిస్తారు. కొందరు రోజుకు రెండు సార్లు తింటారు. అది ఆహారంలా కాక ఒక చిహ్నం లా ఉన్నది. ఇది సాధారణంగా మోతాదులో తినే మాంసం గురించి చెప్పబడలేదు. నేను చెప్పేది మాంసం తినాలనే స్థిర భావం. నియంత్రణ చేయని బలమైన కోరిక. ఎప్పుడైతే ఒక కోరికకు నియంత్రణ లేకపోయిందో, కొందరు డబ్బు చేసికొoటారు . ఎపుడైతే బలమైన కోరిక, దురాశ కలసి ఉంటాయో, వాని దుర్మార్గం అన్నిటినీ వ్యాపిస్తుంది.

రస్సెల్ బేకర్ అమెరికాని ఆవు మాంసం మత్తులో ఉన్నట్టు వర్ణించేరు. అమెరికాలో మాంసాహార మార్పు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత వచ్చింది. యుద్ధం ముగిసిన తరువాత ఆవు మాంసం -- ముఖ్యంగా స్టేక్ అనబడేది--ఎక్కువ వాడుకలోకి వచ్చింది. అది ఒకని గొప్పతనానికి, ధనానికి చిహ్నం అయ్యింది. 1950 దశాబ్దంలో ఆవు మాంస విక్రయం కొన్ని కోట్ల వ్యాపారంగా మారింది. నేను ఈ దేశానికి వచ్చినపుడు ఆవు మాంసం సర్వ సాధారణంగా ఉండేది. ఆవు మాంసంతో చేయబడిన అనేక ఆహార పదార్థాలు మధ్యాహ్నం తినేవారు; స్టేక్ లు సాయంత్రం తినేవారు. అతిథులు వచ్చినపుడు బార్ బెక్యూ లు విపరీతంగా చేసేవారు. స్టేక్ బర్గరు లేని జీవన శైలి అమెరికాలో లేదని చెప్పడం అతిశయం కాదు.

క్రమంగా బర్గరు సంపన్నదేశాలకు వ్యాపించింది. పశ్చిమ ఐరోపా, జపాన్, లాటిన్ అమెరికాలో ధనికులు ఆ వ్యాప్తికి దోహదం చేసేరు.

ఇప్పుడు దాని ఫలితాలను కారణ కార్య రూపంలో చూద్దాం. ఆవుల్ని పెంచడానికి లాటిన్ అమెరికాలోని అరణ్యాల్లో చెట్లని నరికేశారు. ఆవు మాంసం తినాలనే కోరిక ఈ విధంగా ప్రపంచాన్నే కబళిస్తోంది.

బ్రజిల్ లో సగం అమెజాన్ అరణ్యము ఉంది. అది కొన్ని కోట్ల విస్తీర్ణం గలది. కేలిఫోర్నియా అంత వైశాల్యం గలది. 1970 సంవత్సరంలో బ్రజిల్ ఆ అరణ్యాన్ని పాశ్చాత్యులకు అమ్మింది. ఎవరైతే ఆవుల్ని పెంచడానికి పెట్టుబడులు పెట్టాలనుకున్నారో వాళ్ళకి ఆర్థికంగా లబ్దిని ఇచ్చింది.

అరణ్యాల్లోని చెట్లను నరకడానికి కారణం: ఆవులు మసలడానికి, వాటికి కావలసిన గడ్డిని పెంచడానికి. ఉష్ణ ప్రదేశ్శాల్లో ఆవుల్ని పెంచడంవల్ల పర్యావరణానికి మిగతా వాటి కన్న అత్యంత ప్రమాదకరం. రెయిన్ ఫారెస్ట్ అనబడే అరణ్యం ఆవులను పెంచేవారు వలన గాక ముఖ్యంగా బహుళ దేశ వ్యాపారస్తుల దూరాశకు గురయ్యింది. ట్రాక్టర్లతో ఉపరితల మొక్కలను నరికేరు. ఏజెంట్ ఆరెంజ్ అనబడే గుల్మ నాశినిని (herbicide) వాడి చెట్లను పీకేశారు. వాటి అవశేషాలను, చచ్చిన జంతు శరీరాలతో కలిపి, దహనం చేసేరు. కొన్ని సంవత్సరాల తరువాత మట్టిలో సారం తగ్గింది. విషపూరిత కలుపు మొక్కలు పెరిగేయి. ఆ తరువాత ఆ ప్రదేశాన్ని ఆవులను పెంచే వారు విడనాడడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఉంకో ప్రదేశానికి వెళ్ళి ఈ విషవలయాన్ని ఆవృత్తి చేసేరు.

పెట్టుబడుదారులు ఇలా అన్నారు : "అయితే ఏమిటంటా? చాలా అరణ్యం చెట్లతో మిగిలి ఉంది. కోట్ల ఎకరాల భూమి సాగులేకుండా ఉంది. పర్యావరణం గురించి గుండెలు బాదుకొనే వారి వల్ల మేము ఆ భూమిని వాడుకోలేకపోతున్నాం. వాళ్ళకి అరణ్యం అంటే మక్కువ ఉంటే ఉండచ్చు". బ్రజిల్ ప్రభుత్వం వాళ్ళతో అంగీకరించింది. వాళ్ళకి కావలసింది విదేశీ పెట్టుబడులు.

తరువాత వరదలు వచ్చేయి. సైన్స్ అనే పత్రికలో డిసెంబర్ 1980 లో ఒక కధనం వచ్చింది. "గత దశాబ్దంగా అమెజాన్ వరద నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. అది అదుపులేకుండా అరణ్యంలోని చెట్లను నరకడం వలననే. నాల్గవ వంతు అమెజాన్ అరణ్యం నరకడం జరిగింది. అది విపరీతం అవుతున్నది." వరద నీటిమట్టం ఎక్కువవడం వల్ల ఉపరితలంలోని మట్టి వరద నీటిలో కొట్టుకు పోతుంది. అలాగే తక్కువ వృక్షాలు వుండడంవల్ల గాలిలో తేమ తక్కువై, వర్షాలు తగ్గేయి. అంటే అనావృష్టి. కొన్నేళ్లలో పచ్చటి అరణ్యం ఉండవలసిన ప్రదేశం ఎడారిగా మారవచ్చు.

ఈ విషయం గూర్చి అనేక కథనాలు వార్తల్లో వచ్చేయి. అవి ఒక పెద్ద చిత్రీకరణకు దారితీసేయి. దక్షిణ అమెరికాలో ఆహార వనరులు ప్రమాదంలో పడ్డాయి. ప్రపంచ పర్యావరణం అమెజాన్ అరణ్యం మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే అరణ్యం విస్తీర్ణం తగ్గినదో భారత దేశంలో వర్షాలు సాగుభూమి మీద కాక సముద్రంలో పడ్డాయి. అలాగే బర్మా (మయనమార్), ఈశాన్య ఆసియాల్లో కరువు వచ్చింది. ఎక్కడో 12 వేల దూరంలో వున్న బ్రజిల్ లోని ఆవుల పెంపకం గూర్చి జరిగిన సంఘటనల వల్ల నీటి ఎద్దడి, కరువు, వరదలు వాళ్ళపై తాండవించేయి.

కొద్ది సంవత్సరముల తరువాత శాస్త్రవేత్తలు పర్యావరణంలో చెడుకు దారి తీసిన మార్పులు గురించి అధ్యయనం చేయడానికి సమావేశం అయ్యారు. "అమెజాన్ అరణ్యాలను ఏఒక్క సహజ వనర౦ కన్న వేగంగా నాశనం చేస్తున్నారు." అని సందేశం ఇచ్చారు. ఆహారముకు సంబంధించిన సంస్థ (Institute for Food and Development Policy) 1987 లో ఇలా చెప్పింది: "ప్రస్తుత పరిస్థితులు గానీ కొనసాగితే ఇంకో 75 ఏళ్లలో అమెజాన్ అరణ్యం కనుమరుగవుతుంది." ప్రపంచంలో ఉన్న అరణ్యాలలో మూడవ వంతు బ్రజిల్ లోనే ఉన్నది. బ్రజిల్ కి అనిశ్చయమైన ఘనత లభించింది. ఎందుకంటే అక్కడ కోట్ల ఎకరాల అరణ్యాలు భూతలంలో ఎక్కడా లేనట్లు నాశనమయ్యేయి.

శాస్త్రవేత్తలు అమెజాన్ అరణ్యాలను భౌగోళిక వనరులుగా భావిస్తారు. ఒకటికి 12 వ వంతు భూమి అరణ్యాలతో కప్పబడినది. మన జీవనం సజావుగా సాగాలంటే అవి ఎంతో అవసరం. మన ఆహార వనరులు వాటి మీద ఆధార పడి ఉన్నాయి. వాటిని "తల్లి భూమి ఊపిరి తిత్తులుగా" వర్ణించేరు. ఎందుకంటే అవి ప్రమాదకరమైన కాలుష్యకారక బొగ్గు పులుసు వాయువుని, ఓజోన్ ని వడపోసి మనకు కావలసిన ప్రాణ వాయువుని, నీటిని సమకూరుస్తాయి. వాటివల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గుతుంది. అనగా పరిశ్రమలు కారణంగా పెరుగుతున్న భూగోళ ఉష్ణోగ్రత అరికట్టబడుతుంది. లేకపోతే మనము ఐస్ ఏజ్ కి వెళ్ళవలసి వస్తుంది. అమెజాన్ అరణ్యాలు విచిత్రంగా తప్పుడుగా అర్థం చేసుకోబడ్డా పరిశ్రమలు నుండి వచ్చే కాలుష్యాలను నివారించి మన మనుగడకి తోడ్పడుతున్నాయి.

ఉష్ణ ప్రదేశాల్లో ఉన్న అడవుల్లో సగం జీవరాస్యులు నివసిస్తాయి. వాటి జన్యు నాశనం ఎటువంటి అనార్థాలకు దారితీస్తుందో ఎవళ్ళకీ తెలీదు. మనకు తెలిసినది అమూల్యమైన ఓషధులు, ఆహార దినుసులు మనకు అందకుండా పోతాయి. అతికొద్ది వృక్ష, జంతు జాతులను ఇప్పటివరకు అధ్యయనం చేసేరు. అవి 4 వేల ఫల, కూరగాయల జాతులు. నూటికి 90 శాతం ఇంకా వృద్ధి చెందలేదు. మనను రక్షించే మందులు తయారీలో నాల్గవ వంతు అక్కడి నుంచి వచ్చినవే. అక్టోబర్ 3, 1988 సైన్స్ పత్రికలో ఇలా వివరించేరు: "అరణ్యాలు కనుమరుగు ఐతే భూమి పై ఉన్న జంతువులు, వృక్షాలు, కీటకాలు 50 శాతం నాశనమవుతాయి. " చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ రాప్ ఇలా చెప్పేరు: "6 కోట్ల సంవత్సారల క్రిందట జరిగిన అతి పెద్ద వినాశనంతో డైనోసార్లు (dinosaurs) అంతరించిపోయేయి. వాటితో పాటు 60-80 శాతం జీవరాసులు కూడా కనుమరుగయ్యేయి. ఒకవేళ ప్రస్తుతం ఉన్న జీవరాసులలో 50 శాతం నాశనమైతే 6 కోట్ల సంవత్సరాల క్రిందన జరిగిన వినాశనం పునరావృత్త మైనట్లే"

ఈ పంథాలో కొన్ని విషాదకరమైన కార్యాలు మనకు అగుపించవు. కొన్ని ఏళ్ల క్రింద న్యూ యార్కర్ అనే పత్రికలో ఈ విషయం చదివేను. రాబిన్ హాన్ బరీ టెనిసన్ అనబడే వ్యక్తి సర్వైవల్ ఇంటర్ నాషనల్ (Survival International) అనే సంస్తను నడుపుతుంటాడు. అతను సమూలంగా నాశనమవుతున్న మానవ జాతులగూర్చి అధ్యయనం చేసేడు. ఆయనకు స్పూర్తి లన్ డన్ టైమ్స్ పత్రిక యొక్క ఆదివార అనుభందంలో ప్రచురించబడ్డ "జినొసైడ్" అనే కథనం. అది జర్మనీ నాజీల గురించి కాదు. అది అమెజాన్ ఇండియన్స్ కు సంబంధించినది. 1500 శతాబ్దంలో అరకోటి ఇండియన్స్ బ్రజిల్ లో ఉండేవారు. అది కాబ్రల్ రాక పూర్వం. నేడు వాళ్ళ సంఖ్య 5 శాతం తగ్గింది. వాళ్ళ వినాశనం ఎంతో దూరంలో లేదు. 20 వ శతాబ్దంలో సంవత్సరానికి ఒక మానవ జాతి కనుమరుగవుతున్నాది. ఇది ఒక క్రూరమైన పద్దతిలో జరుగుతున్నాది. ఎందుకంటే వాళ్ళు ఖాళీ చేసిన ప్రదేశాలను ఆవులతో వ్యాపారం చేసే వాళ్ళు, ఖనిజాలను వెతికేవాళ్ళు, ఇళ్ళు కట్టేవాళ్ళు, తమ హస్తగతం చేసుకొంటున్నారు. ఇదంతా నాగరీకతలో ముందంజ వేసిన దేశంలో జరుగుతున్నది. నేను ఇవన్నీ భూమిని కొల్లగొట్టే సంస్కృతి లేదా మానసిక కారణాల వల్ల జరుగుతున్నాయని నమ్ముతాను.

నేను ఒక సామాన్య కోరిక గూర్చి విచారణ చేసేను. అదేంటంటే మనకు ఒక పదార్థాన్ని తినాలనే కోరిక ఉద్భవించిందనుకోండి. అది చాలా మంచి పదార్థము. దాని వలన మనమెంతో ఉన్నత స్థానంలో ఉన్నామని తెలియజెప్పబడుతుంది అనుకోండి. ఎవరికైనా ఇది ఒక చిన్న కోరికే. కానీ అది సర్వ వ్యాప్తమైతే, ప్రశ్నలు రానీకుండా డబ్బు చేసుకోవడానికి వీలవుతుంది. డబ్బుచేసుకోదలచిన వాపారస్తులు టివిలో ప్రకటనలు ఇచ్చి, మన సహజ అభిలాషను పెంపొందిస్తారు. మనం మంచి పోషకాహారం తినాలనుకొంటాం. మన పిల్లలకు సుఖాలను అందివ్వాలనుకొంటాం. మనం కష్టపడి సంపాదించినది అనుభవిద్దామనుకొంటాం. ఇలా ఉండగా వ్యాపార సంస్థలు వాటిని మనలోని బలహీనతలుగా తలచి ఎక్కువ సంపాదనకై ప్రయత్నిస్తాయి. అవి భూగోళమంతటా పెట్టుబడులు పెడతాయి. సంపన్న దేశాలు --అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ లెక్కలో-- కూడా ఈ ఆటలో ప్రవేశిస్తాయి. తద్వారా విలువైన సహజ సంపదలను సంపన్నుల విలాశాలకై కట్టబెడతారు. వారి దేశ ప్రజలకు వొరిగిందేమీ లేదు. అది అలా వ్యాప్తి చెందుతుంది. ఎప్పటివరకంటే మన చిన్న కోరిక ఒక అలవాటుగా మారి, మనం ప్రకటనలు ఇచ్చే సంస్థల నియంత్రణలో ఉన్నంతవరకు. అందుకే కోరికలను, అవి ఎంత చిన్నవైనా, ఆలోచించుకొని కోరాలి. లేదా ఒక చిన్న కోరిక వేరొకరికి మనను మోసగించడానికి చేయూత నిస్తుంది. 66