Saturday, February 19, 2022

Eknath Gita Chapter 14 Sloka 4

14.4

తత్ర సత్త్వ౦ నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం

సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ

అర్జునా ! ఈ త్రిగుణములలో సత్త్వ గుణము నిర్మలమైన దగుటచేత ప్రకాశమును కలుగజేయునదియు, నిర్వికారమైనదియు నగుచు సుఖాభిలాషయచేతను, జ్ఞానాభిలాష చేతను జీవుని బంధించుచున్నది

త్రిగుణాలను వ్యష్టి పరిణామము దృష్ట్యా చూడవచ్చు. జడత్వం, జాప్యం చేయుట, శక్తిలేమి, లక్ష్యం లేకుండుట, "నాకు లెక్క లేదు. ఈ కర్మ చేయకపోతే ఏమవుతుంది?" అని తలంచేవారు, తమస్ యొక్క లక్షణాలు గలవారు. అపరిమిత శక్తితో క్రియలు చేయవలెనని పట్టుదలతో, ఎప్పుడూ ముందుకు సాగుతూ, లక్ష్యం లేకుండా ప్రవర్తిస్తూ, స్వాధీనములోలేని గాలివానవంటి మోహంతో ఉన్నవారిలో రజస్ ఎక్కువగా ఉన్నది. ఎవరైతే తమ సమయాన్ని, శక్తిని పరోపకారమునకై దారపోస్తారో, ఇతరులను దూషింపక వారి తప్పులను క్షమిస్తారో అట్టివారిలో సత్త్వ గుణము అధిక పాళ్ళలో ఉన్నట్టు. వారిలోని గుప్తమైన శక్తిని వెలికి తీసి, దాన్ని స్వాధీనము చేసుకొని ఇతరుల వృధ్ధికై పాటుపడతారు.

సత్త్వము, తమస్ పరస్పరం సహాయం చేసుకుంటాయి. కాని వాటిలో అగాధమంత తేడా ఉంది. తమస్ మొద్దు బారినది. తామసిక వ్యక్తికి కుర్చీలోంచి లేచి పక్క దగ్గరకు వెళ్ళడానికి బద్దకం. సాత్త్వికమైన వ్యక్తి అపారమైన శక్తితోకూడి ఉంటాడు. ఆ శక్తి అతని ఆధీనంలో ఉంటుంది. వానికి అందరికన్నా ముందు ఉండాలనే కోర్కె ఉండదు. తన శక్తిని ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో తెలిసినవాడు.

"నేను ఏమి చేయాలో ఆలోచించుకొని చేస్తాను. సాధారణంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. వేచి చూడు అన్నది నా ధ్యేయం. వాటిపాటికి వదిలేస్తే అవే సద్దు కొంటాయి" అని తామసిక వ్యక్తి అనుకొంటాడు.

సాత్వికునికి సులభంగా కోపం రాదు. దానివలన వానిలో గొప్ప శక్తి గుప్తంగా ఉంటుంది. వానికి ప్రాణ అనే ఆర్జన ఉండి, బ్యాంక్ అకౌంటు లో కొంత సొమ్ము ఉంటుంది. వీటి వెనుక ఎక్కువ సొమ్ము స్టాక్ మార్కెట్ లో ఉంటుంది. కావలిసినప్పుడు తన స్టాక్ ను అమ్మి లక్షలు తన బ్యాంక్ అకౌంటు కు జమ కట్ట గలడు. రజస్ తో ఉన్న వ్యక్తి తన సొమ్మంతా బ్యాంక్ లో దాస్తాడు. అతని వద్ద చాలా క్రెడిట్ కార్డ్ లు ఉండి, వాటిపై ఖర్చులు పెట్టి, దివాలాకి దగ్గరగా ఉంటాడు. అతని ఆస్తులు గొప్పవే. అలాగే అతని ఖర్చులు కూడా. అతను నడివయస్సును దాటిన తరువాత తలకుమించిన ఖర్చులు చేసి, బ్యాంక్ లోని సొమ్ము నంతటిని వాడుకుంటాడు. తామసిక వ్యక్తి డబ్బంతా పోగొట్టుకుంటాడు. తను చెల్లించ వలసిన రుసుములను ప్రక్కన పెడతాడు. వానిని జమ కట్టడానికి తయారవుతాడు, కాని ఎన్నో ఆలోచనలలో మునిగి వాటిని నిర్లక్ష్యం చేస్తాడు. బాహ్య కర్మలే ప్రాణాన్ని క్షయం చేయనక్కరలేదు. స్వార్థానికి ఎక్కడలేని ఖర్చులు చేసినా ప్రాణం వ్యచ్చి౦పబడుతుంది. తామసిక వ్యక్తి తన జీవితాన్ని వ్యధతో గడుపుతాడు. ఎల్లప్పుడూ తన సమస్యలు, కాంక్షలు గురించి ఆలోచిస్తూ తను కట్టవలసిన రుసుములను నిర్లక్ష్యం చేస్తాడు. గాలిలో మేడలు ఇలా లెక్కలు కడతాడు: "సెలవుకు 20, నా జాలి 75, పైనున్న ఉద్యోగికి ఏమి చెప్పాలో దానికి 100, మొత్తం 477.95". అతను అలాగ సతమతమౌతాడు.

మా ఎలెక్ట్రిక్ సంస్థ రోడ్డు ప్రక్కన విద్యుత్చ్ఛక్తి వాడకాన్ని తగ్గించుకోమని ప్రకటనలు పెట్టింది. "ఇది ఇలా చేయకు. అనవసరమైన వానిని ఆఫ్ చేయి." మన ప్రాణ శక్తిని కూడా అలాగే వ్యర్థం అవ్వకుండా చూసుకోవాలి. దానికై సులభమైన పద్దతి: "స్వార్థాన్ని తగ్గించుకొని, పరోపకారానికి పూనుకోవాలి." మననుండి దృష్టి మార్చి, ఉదాహరణకు మంత్రాన్ని మనస్సులో ధ్యానిస్తూ ఉంటే, ప్రాణ శక్తి తక్కువ ఖర్చు అవుతుంది. ఇతరుల గూర్చి ఆలోచిస్తున్నప్పుడు ప్రాణ శక్తి వృద్ధి అవుతుంది. ఈ విధంగా సాత్వికుడు ప్రాణ పరంగా ధనికుడవుతాడు. సెయింట్ ఫ్రాన్ సిస్ ఇలా చెప్పేరు: "మనం ఇతరులకు దానం చేయడం వలననే లబ్దిని పొందుతాము." అది అక్షరాలా నిజం. పరులకు 10 ప్రాణ రూపాయలు ఇస్తే , మనకు భగవంతుడు ప్రతిఫలంగా 20 ప్రాణ రూపాయలు ఇస్తాడు. మీరు దీనిని అమలుపెట్టి చూడండి. మీకే తెలుస్తుంది. దానికి వ్యతిరేకంగా ఒకరి దగ్గరనుండి కాజేస్తే మనకు నష్టం కలుగుతుంది. మనం ఏదీ పొందకపోవడం సరి కదా, ఉన్నది ఊడ్చుకు పోతుంది.

మనం క్రియా శక్తి దృష్ట్యా చూడవచ్చు. తామసిక వ్యక్తికి అది శూన్యం. అదిలేక తన క్రియలను చేయలేకున్నాడు. వానికి జాప్యం చేయడం వలన కలిగే నష్టాలను ఎంత చెప్పినా వినడు. తమస్సు అతనికి చెప్పిన దానిపై మనస్సును పెట్టక, చెవులున్నా వినీ విననట్టు చేస్తుంది.

రజస్ కు క్రియాశక్తి , క్రియల చేయాలనే ఉత్సాహం ఎక్కువ ఉంది కానీ బుద్ధి తక్కువ. ఎక్కువ కోర్కె, తక్కువ బుద్ధి వల్ల సమస్యలు ఎదురవుతాయి. తమోగుణమున్నవానికి ఒక మంచి లక్షణం ఉంది. వానికి ఆశ లేదు. ఎందుకంటే వానిలో శక్తి లోపించింది. ప్రపంచంలో అతి మూల్యమైన చాకోలేట్ తీసుకొని ఒక స్థంబం ముందు పెడితే ఎలా ఆ స్థంబం స్పందించదో అలాగే తామసిక వ్యక్తికి కోర్కె లేదు. వానికి అమితమైన తిండి తినాలని అనిపించవచ్చు, కాని దానికి కూడా బద్దకిస్తాడు. తామశికులు శిలా విగ్రహాల్లాగ ఉంటారు. వారిని ఒకచోట వదిలి, రెండేళ్ళ తరువాత చూస్తే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నటు వాళ్ళ స్థితిలో ఎట్టి మార్పూ ఉండదు. అలాగే తామసికులకు కోపం రాదు. అది వాళ్ళలో క్షమించాలనే లక్షణం ఉండి కాదు. వాళ్ళలో ఆశ అనేది లేక. వాళ్ళలో దురాశ లేదు. అది వాళ్ళ వైరాగ్యం వల్ల కాదు. వాళ్ళలో స్పందన లేక ఏదీ కాంక్షించరు. వాళ్ళు దేన్నీ ప్రేమించ లేరు. ఒక వింతను చూడడానికి ఇష్ట పడరు. అది వాళ్ళ ప్రక్కనే ఉన్నా. గొప్ప ఖరీదైన వాహనాన్ని చూసి "నాకు దాన్ని పొందుతే ఎలావుంటుంది" అని అనుకోరు. వాళ్ళ జవాబు "నాకేం పట్టింది?"

తమస్ లో సున్నితము, స్పురణ లేదు. స్వామి వివేకానంద ఇలా చెప్పేవారు: నిరాశ కన్నా ఆశ నయం, స్తభ్దత కన్నా కోపం నయం, చచ్చినట్టు పడి ఉండడం కన్నా ఒక్కొక్కప్పుడు విలాసంగా బ్రతకడం నయం. ఈ వ్యాఖ్యలు మనకి తమోగుణం హెచ్చయినప్పుడు పనికి వస్తాయి. కూర్చోవడం కన్నా ఏదో దిక్కులో అటూ ఇటూ తిరగడం నయం. కదులుతూ ఉన్నప్పుడు దిక్కుని మార్చుకోవడం సులభం.

రాజసికులుకు కోపం వెంటనే వచ్చేస్తుంది. వాళ్ళు అవతలి వాళ్ళని లెక్క చేయక, వస్తువులను కోరుకుంటూ, వాళ్ళ మార్గమే ఉత్తమమనే విధంగా ఉంటారు. విరోధము ఎన్నాళ్లయిన పెట్టుకొంటారు. వాళ్ళ జ్ఞాపకశక్తి మెండు. మనమనవచ్చు "ఎంత చెడు భావన!". అయినప్పటికి రాజసికులకు భవిష్యత్ ఉంది. గ్రీటింగ్ కార్డ్ పంపిస్తున్నపుడు మనమిలాగ వ్రాయవచ్చు: "మంచి మిత్రునికి వ్రాయునది." శక్తి చాలా ఉంది. అలాగే మార్పుకుకూడ అవకాశముంది.

దానితో పోలిస్తే తమస్సు తుస్సు టపాకాయి. స్వామి వివేకానంద తమస్సును మెత్తగా నానిన దుంగ అంటారు. ఎన్ని అగ్గిపుల్లలు వెలిగించినా దానిని మండించలేము. రజస్సు అలాగ కాదు. ఒక్క అగ్గి పుల్ల చాలు. వాని చిత్త చాంచల్యం ప్రమాదకరమవ్వచ్చు . కానీ వాడు ఏదో క్రియచేస్తూ ఉంటాడు. వానికి శక్తి ఉన్నది.

రాజసికుడికి ఎప్పుడూ ఏదో పని చేయాలని ఉంటుంది. పనిలేకుండా ఉండడు. బస్ గురించి నిరీక్షించాలంటే ఊరకనే ఉండడు. సిగరెట్ వెలిగిస్తాడు లేదా మెటికలు విరుచుకుంటాడు. ఊరకనే కూర్చొని సినిమా చూడడు. ఏదో తినుబండారాన్ని తింటూ త్రాగుతూ ఉంటాడు. దేని గతి ఐనా నెమ్మదిగా ఉంటే లేచి వెళిపోతాడు. వాహనం నడుపుతున్నప్పుడు రేడియో పెట్టుకొని, వ్రేళ్ళతో స్టీరింగ్ వీల్ మీద తాళం వేస్తూ, రేడియో స్టేషన్ మారుస్తూ ఉంటాడు. రెడ్ సిగ్నల్ దగ్గర దినపత్రిక చదువుతాడు లేదా ఎవరినైనా ఫోన్ చేసి మాట్లాడుతాడు. తన పనిగురించి, సమస్యల గురించి ఆలోచిస్తూ, పక్క మీద అటూ ఇటూ దొర్లుతూ, నిద్ర లోకి జారుకుంటాడు. నిద్రపట్టడానికి మేకలను లెక్క పెడుతూ సింహాలని, పులులని ఊహించుకుంటాడు.

తామసికుడు పరిగెత్తడం కన్నా నడకే మేలనుకొంటాడు. పార్క్ లో పరిగెత్తడం హింసగా భావిస్తాడు. అది రక్తపు పోటుకు దారితీస్తుంది అంటే "అయితే అవ్వనీ" అంటాడు. గుండెపోటు రానంత కాలం ధీమాగా ఉంటాడు. ఊహించ రాని విషయం గురించి ఎందుకు వ్యధ చెందాలి అని తలుస్తాడు. తామసికుడు నడవడం కన్నా కూర్చోవడమే ఉత్తమమని అంటాడు. కార్ మీద "నేను పడుకొని ఉంటే బాగుండును" అని స్టిక్కర్ పెట్టుకుంటాడు. వానికి రాజసికుడు లా కాక నిద్రకు భంగం ఉండదు. స్పృహ లేక నిద్రపోతాడు. మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. అతడు భౌతికముగా ఏ పనులూ చేయకున్నా, సంపూర్ణ విశ్రాంతి అనుభవించడు. అతని మనస్సులో భయానకమైన దృశ్యాలు చూస్తాడు.

సాత్త్వికుడికే విశ్రాంతి ఎలా తీసికోవాలో తెలుసు. అవసరమైనప్పుడు కష్టపడి పని చేస్తాడు. కాని వాని మనస్సు అతలాకుతల మవ్వదు. అది మందమవ్వదు. అతను విశ్రాంతి సమయంలో టెన్నిస్ ఆడవచ్చు, కుటుంబంతో సినిమాకి వెళ్ళవచ్చు, లేదా మిత్రులతో ముచ్చటలాడవచ్చు. అతని మనస్సు ఆఫీస్ పని మీదకు మళ్లక ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో చక్కగా వింటాడు. అతని ఆఫీస్ పనిని భౌతికంగా, మానసికంగా అక్కడే వదిలేస్తాడు. ఎక్కడకి వెళ్ళినా పూర్తిగా నిమగ్నమై ఉంటాడు. అతనికి నిద్రపోవడానికి ఇబ్బందిలేదు. అతను మనలాంటివారి ఇద్దరి, ముగ్గురి చేసేపనిని సునాయసంగా తను ఒక్కడే చేయగలడు. అతని రహస్యం: అసంగత్వం. అతను తన పనితో తాదాత్మ్యం చెందడు . కష్టపడి పనిచేసి, ఫలితం గురించి వ్యధ చెందడు. ఫలం దైవానికే వదిలేస్తాడు.

ఒక మంచి నటుని ఉదాహరణగా తీసికొని చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రిందట సర్ మైకేల్ రెడ్ గ్రేవ్ ఆంగ్ల సాహిత్యంలోని కొన్ని అంశాలను చదవడానికి ఏర్పరచిన సమావేశానికి వెళ్ళాను. ఆయన పిక్ విక్ పేపర్స అనే పుస్తకంలోనుంచి ఒకానొక అంశం తీసికొన్నారు. టాప్ మేన్ అనే పాత్ర ప్రేమ వలలో పడడం దాని ప్రధాన విషయము. సర్ మైకేల్, మిస్ వార్ డిల్ ఆ పాత్రలకు అనుగుణంగా నటించేరు. తరువాత వాళ్ళు ఉంకో నవల (The Importance of Being Earnest) ఆధారిత పాత్రలను పోషించేరు. వాళ్ళ మాట తీరు, ప్రవర్తన, మొదటి దానికన్నా చాలా భిన్నంగా ఉన్నాయి. నేను వాళ్ళు వేరే వ్యక్తులనుకునేలా అ విభిన్న పాత్రలలో కనిపించేరు. అలాగే జాన్ డాన్, షేక్స్ పియర్, షా సాహిత్యాని కనుగుణంగా పాత్రలు పోషించేరు. ఈ విభిన్న పాత్రలు చేసిన సర్ మైకేల్ ఉన్నది ఒక్కడే. మనమది ఎప్పటికీ మరువం. దానిలోనే ఉంది సగం కళ. సర్ మైకేల్ అలాగే మరువరు.

సాత్వికుడు అలాగే ఉంటాడు. తన స్వస్వరూపం తెలిసికొని, తన విభిన్న పాత్రలను తడబాటు లేకుండా చేస్తాడు. అతను వైద్యుడయితే ఉదయాన్నే తెల్ల కోటు వేసికొని తన క్రియలను సామర్థ్యంతో నిర్వర్తిస్తాడు. అది అతని వృత్తి. రోగులకది నమ్మిక కలిగిస్తుంది. కానీ తను ఒకానొక పాత్రధారినని మరచిపోడు. ఇంటి కెళుతున్నప్పుడు తన కోటుని తీసి, దానితోనే తన పాత్రను విరమించి ఇంటికి వెళతాడు. ఇంట్లో ప్రేమించే భర్తగా, తండ్రిగా, వివిధ పాత్రలను సునాయసంగా ధరిస్తాడు.

అదే రజస్ అనే వైద్యుని వైనం చూద్దాం. అతనికి తను చదువుకొన్న పాఠ్య పుస్తకాలు కంఠతా వచ్చు. కానీ మానసికంగా రోగులు వారి రోగములతో తాదాత్మ్యం చెందుతాడు. ఇంటికి వెళ్ళినా తన రోగుల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అతను అతి తక్కువ సమయం భార్యాపిల్లలపైన వ్యచ్చిస్తాడు. ఆ వ్యాపకంతో మరుసటి దినం తన ఆసుపత్రికి వెళ్ళేక క్రొత్త రోగులను చూస్తూ, పాత రోగుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీని వలన తన మనస్సును రోగులమీద కేంద్రీకరించ లేకపోతాడు. అతను గత స్మృతులను తలచుకొంటూ, వాటి బరువును మోస్తూ, అవి తనవేనని ఆవేదన చెందుతాడు. దీనివల్ల ఎవరికీ లాభంలేదు.

అసంగత్వం లేకపోవడం పనిలో పెద్ద అవరోధం. ఈమధ్య ఒక లావాటి పుస్తకం చదివేను. దానిలో అనేక రోగుల చరిత్ర, వారికి సంబంధించిన చిత్ర పఠాలు ఉన్నాయి. దాని రచయితకు తెలీని విషయం: ఒక సాత్వికుడు నిరంతరం అసంగత్వంగా సమస్య లేకుండా పని చేయగలడు.

ఒక ఉపాధ్యాయుడికీ ఇది వర్తిస్తుంది. ఇక్కడ నా స్వీయానుభవము చెప్తాను. ఒక కాలేజీ ప్రొఫెసర్ నిజానికి ప్రొఫెసర్ కాదు. అతను ఇంటా, బయటా, అన్నిచోట్లా ఒక మంచి వాడు. కాని అతడు కాలేజీ లోకి ప్రవేశించగానే పాండిత్యం ఉదయిస్తుంది. గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలను పోగుచేసి, అందులో కొన్ని పెద్ద పుస్తకాలను ఎంచుకొంటాడు. పాఠం చెప్తున్నప్పుడు బోర్డు మీద వ్రాసి, చిత్రాలు గీసి, స్లయిడ్ లు చూపించి, తోచిన హాస్యం కూర్చి, ఒక పండితుడిగా వ్యవహరిస్తాడు. కాలేజీ బయటకు వచ్చినపుడు షాపు కు వెళ్తే అక్కడ అతను ప్రొఫెసర్ కాడు. అందరిలాగా వ్యవహరిస్తాడు. కల్పిత శాస్త్ర సాహిత్యం, స్టాక్ మార్కెట్ లో ఎలా పెట్టుబడి పెట్టాలి మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ ఒక సగటి మధ్య తరగతి వ్యక్తి గా మెలుగుతాడు.

సాత్వికుడు అసంగతవ్యంగా వ్యవహరిస్తాడు. ఒక సాత్వికమైన భార్య తన బాధ్యతను సక్రమముగా నిర్వర్తిస్తుంది. పిల్లలకు మంచి తల్లిగా ఉంటుంది. ఆఫీస్ లో డాక్టర్ , ఉపాధ్యాయిని, గుమాస్తా, కంప్యూటరు ప్రోగ్రామర్, అకౌంటెంట్ మొదలగు పాత్రలు ధరించి చక్కగా పనిచేస్తుంది. కొంత కాలం తరువాత యధేచ్చగా, సహజంగా సర్ మైకేల్ రెడ్ గ్రేవ్ లాగ ఆమె వ్యవహరిస్తుంది. తన స్వస్వరూపం ఆత్మ అని తెలిసికొని, జీవితంలో వివిధ పాత్రలను ధరించి, ఇతరులకు సహాయకారిగా ఉండాలనే కాంక్ష ఆమెను బలపరుస్తుంది.

ప్రతి గుణంలోనూ లోపం లేకపోలేదు. తమస్ భయమును కలిగిస్తుంది. తామసికుడు తన నీడను చూసి భయపడకపోవచ్చు. తనను తాను భయంకరమని తలంపక పోవచ్చు. కానీ భయం అనేక రూపాలలో వస్తుంది. అతడు సదా వ్యధతో నుండి, ఏ కార్యము చేయకుండా ఉంటాడు. అతడు దేశ ఆర్థిక పరిస్థితి, అంటువ్యాధుల గురించి వ్యధ చెందవచ్చు. అతడు తన గురించి తక్కినవారు ఏమనుకుంటున్నారన్న భావనతో సతమతమవ్వచ్చు. వాళ్ళు తనను ప్రేమిస్తున్నారో లేదో, తనకు కావలసిన విధంగా స్పందిస్తారో లేదో అని బాధ పడుతూ ఉండొచ్చు. అతడు చాలమార్లు భయానికి లొంగి ఉంటాడు. అది మంచి పద్దతి కాదు.

రాజసికుడు రెండు విధాలుగా స్పందిస్తాడు: కోపం లేదా ఆశ. అతడు ఎన్నిక చేసుకోలేడు. అయినప్పటికి అతని ఎదుగదలకు ఆస్కారం ఉంది. అతను తనను మార్చుకోగలడు. అతనికి కొంత బుద్ధి ఉంది. సమస్యలు ఎందుకు ఎదురవుతాయంటే తనను క్రియలలో నిర్బంధించుకుంటాడు కాబట్టి. అతనిలోని బుద్ధి, కోర్కె ఒక చిన్నపిల్లవాడు, తండ్రిలాగా ఉంటాయి. కోర్కె వేగంగా నడుస్తూంటే బాలుడిలా బుద్ధి వెనకబడుతుంది. కానీ తండ్రిలాంటి కోరిక వేచి చూడదు. అతనికి సహనం లేదు. "నాతో నడవడానికి ప్రయత్నించు. అడుగు తీసి అడుగు వెయ్యి" అంటాడు. కానీ బుద్ధి ముందుకు వేగంగా సాగలేదు. అది ఇంకా వెనుకబడిపోతుంది. అది ఒక సమస్యగా మారుతుంది. అతడు తన కోర్కెలకు బలి అయిపోతాడు. అతడికి ఎన్నుకోడానికి స్వతంత్రము లేదు. ఎంతసేపు ముందుకు సాగాలనే తపన పట్టి పీడిస్తుంది. ఒక వస్తువు లేదా వ్యక్తి గురించి వచ్చే ఆలోచనలను నియంత్రి౦చలేక పోతే, మనస్సును కట్టడి చేయలేకపోతే, కోర్కెను చంపుకోలేకపోతే బుద్ధి తీవ్రంగా వెనకబడుతుంది.

కోర్కె విపరీతంగా ఉంటే అది తీరే వరకు చేతనాన్ని వేదిస్తుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, వాహనాన్ని నడుపుతున్నప్పుడు, నిద్రలో మనస్సు కోర్కె వైపు తిప్పుతుంది. దృష్టి కేంద్రీకరించలేక ఏ పనీ సక్రమంగా నిర్వర్తించలేక, స్నేహితులకు, బంధువులకు దూరమవుతూ ఉండడానికి కారణం బుద్ధి లేక పోవడమే.

అదృష్టవశాత్తూ ధ్యానం ఇందుకు సహకరిస్తుంది. భారత దేశంలో తల్లులు తమ బిడ్డ నడక నేర్చుకుంటున్నప్పుడు మూడు చక్రాలున్న ఊత నిస్తారు. దానితో బిడ్డ చిన్న చిన్న అడుగులు వేసి, నడవడానికి ప్రయత్నిస్తాడు. వాడు సమంగా నడుస్తే తల్లిని చేరుకొంటాడు. ఒకరోజు ఆ ఊతను తల్లి తీసేస్తుంది. "ఇక్కడికి రా" అని పిలుస్తుంది. బిడ్డ రెండు మూడు అడుగులు తత్తరపాటుతో వేస్తాడు. తల్లి వాడిని ప్రోత్సాహిస్తుంది. "రా, ముందుకు రా" అంటుంది. వాడు చివరకు తల్లిని చేరి సేద తీర్చుకొంటాడు. చివరికి వాడికి నడక వస్తుంది. త్వరలోనే వాడు పరిగెత్తి ఫూట్ బాల్ ఆడుతాడు. తల్లి వాడిని ఇంట్లో వుండేలా చేయలేదు.

ఇదే విధంగా మన బుద్ధిని కూడా పెంపొందించుకోవాలి. అది తినే ఆహారంతో మొదలవుతుంది. మధ్యాహ్న రాత్రి భోజనాల మధ్య కాలంలో తినకపోవడం, శరీరానికి హాని కలిగించే ఆహారాన్ని తినకుండా, తీపి కొవ్వు తగ్గించి, పచ్చటి ఆకుకూరలను తింటూ ఉండాలి. ఇది మంచి పోషకాహారమనే కాదు, మన బుద్ధిని కూడా మేల్కొలుపుతుంది.

మన ఇంద్రియాలను కేవలం నేర్పడానికే కాదు. వాని ద్వారా మన బుద్ధిని ప్రభావితం చెయ్యడానికి. దానికి వేరే మార్గ౦లేదు. "సిగరెట్ అలవాటును మానుకోవడానికి మాతో సముద్ర యానంకి రండి" అని ప్రకటనలు చూస్తాం. ఇవి కట్టు కథలు మాత్రమే. మనం వాటిని చూసి మోసపోకూడదు. మీ బుద్ధిని బలపరచడం నిరంకుశముగా మీకు కావలసిన వస్తువును లాక్కోడం, లేదా మనం పట్టిన పట్టు సాధించడానికి కాదు. దాని అవసరం పట్టు వదలని రజస్ ని స్వాధీనం చేసుకోడానికి. తద్వారా మోహం, ఉద్రేకం మొదలైన వాటిని కట్టడి చేసి ఇతరులకై పాటు పడడానికి.

ఇంద్రియాలకు నేర్పుతూఉంటే, రాజసికుడ క్రమంగా బుద్ధిని నేర్చుకోంటాడు. అలాగ అతడు సాత్వికుడిగా మారుతాడు. బుద్ధి పరంగా ఒక పెద్ద వస్తాదు అవుతాడు. కాని వానికి ఎంతో పని లేదు. సాత్వికుడు ఒక కోర్కెను నిరాకరించినా, బుద్ధి సరిగా పనిచేని కోర్కెను తరిమేస్తుంది. కానీ సత్త్వ గుణాన్ని ఎదిరించేది లైంగిక కామం. దానితో నిజమైన యుద్ధం జరుగుతుంది. అదే సాధన. అది చాలా కాలం జరుగుతుంది.

దీని గురించి ఇబ్బంది పడక్కరలేదు. లైంగిక కామం చాలా బలమైన కోరిక. అది జీవితమిచ్చే పెద్ద భౌతిక సుఖం. అందుకే దానికి అంతులేని శక్తి ఉన్నది. కామ కోర్కె అధికంగా ఉంటే వాహనంలో ఇంధనం అధికంగా ఉన్నట్టే. ఆ ఇంధన పాత్రను తీసి పారేయలేం. మనకున్న ఎన్నిక: లైంగిక కామానికి బానిసలమా కామా. దాన్ని అధిగమిస్తే గొప్ప శక్తిని పొంది, అయస్కాంతం లాంటి వ్యక్తిత్వాన్ని పొందవచ్చు. కోర్కెలోని శక్తిని కుండలిని అంటారు. అది మనని చేతనవంతులుగా చేసి, ఉత్తమ పురుషులుగా పరిణామ౦ చెందిస్తుంది. లైంగిక కామంతో చాలా శక్తి వ్యర్థం అవ్వకుండా నియంత్రించుకొంటే, మనలాంటి సాధారణ వ్యక్తులు ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకొనేలాగా, నిస్వార్థ కర్మలను ఆచరించేలాగా చేస్తుంది.

సత్త్వ గుణం మన బుద్ధి ఎంత పెంపొందిస్తుందంటే, అది లైంగిక కామాన్ని అణచివేస్తుంది. అప్పుడు గీత చెపుతుంది హృదయం పరిశుద్ధ మవుతుందని. జీసస్ చెప్పినట్లు ఎవరి హృదయం పరిశుద్ధంగా ఉంటుందో వాళ్ళు దేవుడిని చూస్తారు. మన హృదయంలోని స్వార్థ మోహాన్ని తీసివేయడానికే మన బుద్ధిని అతి బలవంతునిగా చేసుకోవడం. 122

No comments:

Post a Comment