Saturday, February 12, 2022

Eknath Gita Chapter 14 Sloka 3

14.3

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః

నిభధ్నంతి మహాబాహో దేహే దేహిన మవ్యయం

అర్జునా! ప్రకృతినుండి జనించిన సత్త్వరజస్తమో గుణములు అవ్యయుడైన జీవుని దేహమునందు బంధించుచున్నవి

మన గ్రంథములు జీవి, పరమాత్మ నుండి ఆవిర్భవించి, మూడు శక్తులచే బంధింపబడ్డవాడని చెప్పుచున్నవి. ఆ మూడు గుణాల గూర్చి గీత చెప్పే సిద్ధాంతం అతి ముఖ్యమైనది. గుణాలు ప్రకృతికి మూలం. పదార్థం, శక్తి, మనస్సు ఈ మూడు గుణాల కలయికగా చెప్పవచ్చు. సత్త్వ గుణం అనగా నీతి, సామరస్యం, సమత్వం. రజస్ అనగా శక్తి. తమస్ అనగా జడత్వం. వ్యష్టిగా సత్త్వ గుణము ఆనంద సామ్రాజ్యానికి దారి తీస్తుంది. రజస్ మనను అక్కడికి తీసుకు వెళ్ళే శక్తి. అది స్వాధీనములో లేకపోతే మనం అడ్డదారులు తొక్కుతాం. తమస్ మనకు కలిగే అవరోధాలు.

హిందూ శాస్త్రాల దృష్ట్యా, సృష్టికి పూర్వం, నిర్వికల్పమైన, విభజింపబడని, చైతన్యం ఉన్నది. దానినే మనం పరమాత్మ లేదా దేవుడు అంటాము. పురాణాలలో విష్ణు మూర్తిని సర్వాంతర్యామి అయిన దేవుడుగా భావిస్తారు. ఆయన అంతములేని ఆది శేషునిపై, ప్రపంచమనే సముద్రమధ్యలో శయనించి ఉంటాడు. చైతన్యం సర్వవ్యాపాకమై, ఏఖాండమైనంతకాలం వేరే పదార్థానికి తావులేదు. జెనెసిస్ లో చెప్పినట్లు "దేవుడుచే నీరు మీద ఆయని శక్తి పయనించింది". దేవుడు ధ్యానంలోకి వెళ్ళేడు. దానివల్ల చైతన్యం మూడు గుణాలతో వికల్పమైనది. వాటినుండి పదార్థము, శక్తి ఆవిర్భవించినవి. ఈ విధముగా మూడు గుణాల సముదాయంతో సృష్టి గోచరమైనది. జ్ఞానులు సృష్టి జరగబడలేదు, వివర్తించినది అని కూడా నమ్ముతారు. ఎలాగైతే సాలీడు తన స్వశక్తితో గూడు కడుతుందో, అలాగే దేవుడు సృష్టి తనంతట తానే చేసేడు. మూడు గుణాలూ ఆ సృష్టికి మూలం.

కోట్ల సంవత్సరాల పరిణామము వలన మానవులలో మూడు గుణాలూ వివిధ పరిమాణములో ఉంటాయి. ఒకడు బహు శక్తిమంతుడు. మరొకడు మందగొండి. బహు కొద్దిమంది శాంతమైన, నమ్మకమైన, భద్రతతో కూడిన వారు. ప్రతి ఒక్కరిలో ఒక గుణం ప్రబలమై ఉంటుంది. అది వ్యక్తిత్వంలో వివిధ దశలలో వ్యక్తమౌతుంది.

నిజానికి ఆ మూడు గుణాలూ ప్రతీ వ్యక్తిలోనూ ఉన్నాయి. ఒకప్పుడు ఒకడు శక్తితో పూనుకొని ఉంటాడు. ఉదాహరణకి వాడు తనకిష్టమైన కార్యం చేస్తున్నప్పుడు. అతడే వేరే సమయములో ఉదాసీనంగా ఉంటాడు. అది తనకయిష్టమైన పని చేయవలసి వచ్చినపుడు. వ్యక్తి ఒక్కడే గాని గుణాల వల్ల తన ప్రమేయం లేకుండా ప్రభావితమౌతున్నాడు.

ఒక్కొక్కప్పుడు సమయం, శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఉదయం మనం శక్తితో కూడి, ఏ కార్యాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉంటాము. మధ్యాహ్నం, ముఖ్యంగా భోజనం చేసిన తరువాత, స్తబ్దుగా ఉంటాము. ఒక పరిశీలకుడు వానిని ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా, వ్యక్తిత్వాలుగా భావించవచ్చు. మనలో మూడవ వ్యక్తిత్వం కూడా బహు అరుదుగా ఉంది. మానవులమైనందుకు మనలో సత్త్వ గుణం ఎంతోకొంత ఉంది. దాని వల్ల మనలో దయ, భద్రత, సమభావము, స్వయం నియంత్రణ ఉన్నాయి. అవి గుప్తంగా ఉండవచ్చు. కానీ మనలో అవి వున్నాయి కాబట్టి మనం జంతువులనుండి పరిణామం చెందేమని తెలుస్తుంది. మనం రజస్ యొక్క శక్తిచే తమస్ కలిగించే అవరోధాల్ని దాటే౦. పిదప రజస్ యొక్క శక్తిని నియంత్రించేం.

గుణాలతో మన వ్యక్తిత్వాన్ని విశ్లేషించి, అదెలా ఏర్పడిందో, దానికి ఉంకో దానితో ఎలా సంబంధం ఉన్నదో చెప్పగలం. మన స్వభావం ఎలాగ మారుతుందో గుణాల బట్టి చెప్పవచ్చు. అవి స్తబ్దంగా ఉండేవి కావు. గీత మన వ్యక్తిత్వం క్రింద ఎటువంటి శక్తులు ఉన్నాయో చెప్పడం, ఒక ఆదర్శమైన వ్యక్తిగా మనం మనలను మలచుకోడానికి.

మనం ఒక దృఢమైన మూసలో, పెరుగుదల లేకుండా, లేము. మనము నిజంగా తలచుకుంటే మనను మార్చుకోవచ్చు. కానీ దానికి ఒక మంచి సంకల్పం కలగాలి. అవసరమైతే మన పరిస్థితి బట్టి ఎదురీత ఈదాలి. మొదట తమస్ ని రజస్ గా మార్చుకోవాలి. అనగా జడత్వాన్ని ఉత్సాహపూరితంగా, శక్తిమంతంగా మార్చాలి. రజస్ అనగా: మనలో ఉన్న భయం, కోపం, ఆశ మొదలైనవి. వాటిని తగినట్లుగా నియంత్రించి జడంగా ఉన్న వ్యక్తిత్వాన్ని మేల్కొలిపి ఉన్నత మైన స్థితికి చేరవచ్చు. మన లక్ష్యాన్ని సాధించడానికి అది తోడ్పడుతుంది.

ఇక్కడితో అయిపోలేదు. మనం రజస్ ను సత్త్వం గా మార్చగలగాలి. అతిశయముగాఉన్న శక్తిని నిస్వార్థ కర్మకై వినియోగించాలి. చివరిగా, అన్ని నియంత్రణలూ తీసి వేయాలంటే త్రిగుణాలను కూడా దాటి వెళ్ళాలి.

ఈ గుణాల పరిణామం ప్రాణం వల్ల సాధ్యం. భౌతిక శాస్త్రంలో ఎలాగైతే గుప్తంగా ఉన్న శక్తిని, చలన శక్తిగా మార్చి, తద్వారా విద్యుత్తును కలుగజేయవచ్చని చెప్పేరో, తమస్ ను కూడా రజస్ గా మార్చి తద్వారా సత్త్వ గుణాన్ని పొందవచ్చు. తమస్ ఘనీభవించిన గుప్త౦గా ఉన్న బలము. అది ఫ్రిడ్జ్ లో చాలా కాలముండి ఘనీభవించింది. అదలా కూర్చొని, ఎవరైనా మెల్కొలుపుతారా అని వేచి చూస్తోంది. ఘనీభవించిన నీరుని, మళ్ళీ ద్రవంగా మార్చవచ్చు. అలాగే తమస్ కరిగి రజస్ అవుతుంది. అది పరిగెత్తే నదిలాటిది. నది పదార్థాలను అతలాకుతలం చేసి, అవరోధాలని అధిగమించి, ఒక ప్రదేశాన్ను౦చి శరవేగంగా ఉంకో ప్రదేశానికి ఎలాగైతే ప్రవహిస్తుందో, రజస్ కూడా అలాగే శక్తివంతమైనది. కాని అది నది వరదగా మారినట్టు వినాశకారి అవుతుంది. సత్త్వమ్ రైలును నడపగల ఆవిరి వంటిది. రజస్, సత్త్వ గుణాల శక్తి, తమస్ లో గుప్తంగా ఉన్న శక్తివలననే. తమస్ ని కరిగించిన కొలదీ శక్తి ఉత్పన్నమౌతుంది.

తమస్ కరిగినికొద్దీ మన జీవితంలో ఎనలేని శక్తి వస్తుంది. దీనితో మన ధ్యాననికి పరీక్ష పెట్ట వచ్చు: ఎప్పుడైతే పనులు వాయిదా వేస్తున్నామో, మనం ధ్యానాన్ని పెంపొందించుకోవాలి. ధ్యానంలో భౌతికంగా , మానసికంగా అప్రమత్తంగా ఉండి మన కుటుంబానికి , సమాజానికి ఉపయోగపడే రీతిలో ఉండాలి. కష్టపడి పనిచేస్తే తమస్ నుండి ఉత్పన్నమైన శక్తిని ఉపయోగించుకోవచ్చు.

తెరెసా ఆఫ్ ఆవిలా ఇలా చెప్పేరు: "నిస్వార్థ సేవ ధ్యానం యొక్క చివరి లక్ష్యం. భగవంతుని నుండి మనకు అనుగ్రహింపబడినవి మన సేవలకు నిదర్శనం." మరొక పరీక్ష : "మన౦ మానవ కళ్యాణనికై నిస్వార్థంగా, ఏకాగ్రతతో పని చేస్తున్నామా లేదా?" కష్టపడి పని చేయడంతో సరిపోలేదు. రజస్ కు అవసరమైనా లేకున్నా మన ఆనందానికై పనులు చేయి౦చే సామర్థ్యం ఉంది. చాలా మంది నియంత్రించబడని రజస్ తో పనికిరాని, వ్యర్థమైన, ఇతరులకు హాని కలిగించే పనులు చేస్తారు.

వ్యాకులత చెడ్డ గుణం కాదు. తమస్ తో పోలిక చేస్తే అది మంచిదే. వ్యాకులత సూచించేది: "ధ్యానం నేర్చుకొని, అంతర్ముఖులము అవ్వాలి" . ఆ సూచనని పాటించని వారు ఊర్లు , దేశాలు, ఉద్యోగాలు, మారుతూ ఉంటారు. ఇది లోపలి శక్తులను వృధా చేయడమే. వ్యాకులత వల్ల ప్రపంచాన్నే మార్చేయాలి, లేదా ప్రపంచాన్ని ఒక వాహనంతో చుట్టేయాలి, మొదలైన ఎవరికీ ఉపయోగపడని, అహంకారాన్ని పోషించే, తన సాహసాన్ని ప్రదర్శించే వ్యర్థమైన కోర్కెలు కలుగుతాయి. అటువంట కోర్కెలు వచ్చినపుడు ధ్యానం చేయాలి. మనకున్న శక్తిని పోగుచేసి సత్త్వగుణంగా మార్చుకొంటే స్వర్గం ఎక్కడో లేదు, మన హృదయం లోనే ఉంది అని తెలుసుకొంటాము. 115

No comments:

Post a Comment